Site icon NTV Telugu

Donald Trump: మిత్రదేశాలపై ట్రంప్ ఆగ్రహం.. ‘మీరు పిరికివారు’ అంటూ విమర్శ..

Trump

Trump

ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో.. సముద్ర మార్గాలను కాపాడేందుకు సైనిక సాయం అందించని దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా మండిపడ్డారు. అమెరికాకు మిత్రులుగా ఉన్న దేశాలను ఆయన ‘పిరికివారు’ అని సంబోధించారు. ‘మిమ్మల్ని మేము గుర్తుపెట్టుకుంటాం’ అంటూ తన సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు.

ట్రంప్ వాదన ఏమిటి..?

చమురు (ఆయిల్) ధరలు పెరిగిపోతున్నాయని అందరూ ఫిర్యాదు చేస్తున్నారని.. కానీ హోర్ముజ్ జలసంధిని తెరిపించడానికి మాత్రం ఎవరూ ముందుకు రావడం లేదని ట్రంప్ విమర్శించారు. అమెరికా గతంలో ఎన్నో దేశాలకు సహాయం చేసిందని, ఇప్పుడు ఆ దేశాలు తమ స్వార్థం కోసమైనా ఇరాన్‌ను అడ్డుకోవడానికి సహకరించాలని ఆయన కోరారు.

యుద్ధం మొదలవ్వకముందు 70 డాలర్లు ఉన్న ఆయిల్ ధర, ఇప్పుడు 108 డాలర్లకు చేరుకుంది. ఇంధన ధరలు పెరగడంతో ఆహార వస్తువులు, నిత్యావసరాల ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. హర్మూజ్ మార్గం గుండానే ఎక్కువ చమురు సరఫరా అవుతుంది కాబట్టి.. మనలాంటి ఆసియా దేశాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. కంప్యూటర్ చిప్స్ తయారీకి వాడే హీలియం, ఎరువుల తయారీకి వాడే సల్ఫర్ వంటి వాటికి కూడా కొరత ఏర్పడే ప్రమాదం ఉంది.

మరోవైపు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, జపాన్ దేశాలు ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. సముద్ర మార్గాల్లో ప్రయాణాలు సురక్షితంగా సాగేందుకు తాము కృషి చేస్తామని చెప్పాయి. ఇరాన్ చేస్తున్న దాడులను, సముద్రంలో మైన్లు వేయడాన్ని ఈ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఇరాన్ యుద్ధం మొదలై 21 రోజులు అవుతోంది. ప్రస్తుతం ఆ సముద్ర మార్గం దాదాపు మూతపడింది. ఇప్పటివరకు దాదాపు 23 ఓడలపై దాడులు జరిగినట్లు సమాచారం.

Exit mobile version