Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే ఛాన్స్?

Trump Russia

Trump Russia

Donald Trump: హోర్ముజ్ జలసంధి సంక్షోభం సృష్టించిన ఉద్రిక్తతల మధ్య, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఓ సంచలన నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలను మళ్లీ మండించబోతోంది. రష్యా ముడి చమురు కొనుగోళ్లపై గతంలో ఇచ్చిన తాత్కాలిక మినహాయింపును ట్రంప్ పొడగించేందుకు నిరాకరించారు. ఈ మినహాయింపు గడువు శనివారంతో (మే 16) ముగిసిపోయింది. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యాపై అమెరికా, ఐరోపా దేశాలు కఠినమైన ఆంక్షలు విధించినప్పటికీ, మార్చి 2026లో ఇరాన్ యుద్ధం మొదలై హోర్ముజ్ జలసంధి దిగ్బంధానికి గురికావడంతో గ్లోబల్ మార్కెట్లో చమురు కొరత ఏర్పడింది. అప్పట్లో మార్కెట్‌ను సమతుల్యం చేయడానికి సముద్రంలోని ట్యాంకర్లపై లోడ్ చేసిన చమురుకు మాత్రమే వర్తించేలా ట్రంప్ ప్రభుత్వం ఒక ప్రత్యేక మినహాయింపునిచ్చింది. అయితే, ఈ చమురు విక్రయాల ద్వారా వచ్చే డబ్బు రష్యా యుద్ధ నిధిని బలోపేతం చేస్తోందని ఐరోపా దేశాలు తీవ్రంగా వ్యతిరేకించడంతో ట్రంప్ ఈ మినహాయింపును రద్దు చేశారు.

ఈ నిర్ణయం ముడి చమురు పెద్ద ఎగుమతిదారు అయిన రష్యాతో పాటు గ్లోబల్ మార్కెట్‌కు, ముఖ్యంగా భారతదేశానికి పెద్ద దెబ్బగా మారింది. పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా మార్చి, ఏప్రిల్ 2026 మధ్య కాలంలో భారత్.. యూరప్, రష్యాల నుంచి చమురు దిగుమతులను భారీగా పెంచింది. మార్చి 2026లో భారత్ ప్రతిరోజూ దాదాపు 4.5 మిలియన్ బారెళ్ల ముడి చమురును దిగుమతి చేసుకోగా, అందులో దాదాపు 50 శాతం వాటా రష్యాదే కావడం విశేషం. అదే సమయంలో మిడిల్ ఈస్ట్ నుంచి సరఫరా 61 శాతం వరకు పడిపోయింది. ఏప్రిల్ 2026లో కూడా రష్యానే భారత్‌కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా నిలిచింది. ఫిబ్రవరితో పోలిస్తే ఏప్రిల్‌లో భారత ముడి చమురు దిగుమతులు 85 శాతం స్థాయిలో ఉన్నాయి. అయితే ఏప్రిల్‌లో రష్యా నుంచి ముడి చమురు దిగుమతి ప్రతిరోజూ దాదాపు 1.57 మిలియన్ బారెళ్లుగా నమోదైంది. ఇది మార్చి నెలతో పోలిస్తే 20 శాతం తక్కువ కావడం గమనార్హం. ఇదిలా ఉండగా.. ఇటీవలనే భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు 3 రూపాయల చొప్పున పెంచడంతో పాటు సీఎన్‌జీ ధరలను సైతం పెంచారు. ఇప్పుడు ట్రంప్ నిర్ణయంతో అంతర్జాతీయంగా చమురు ధరలు గనుక ఇలాగే అదుపులేకుండా పెరిగితే, భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు మరోసారి ఆకాశాన్నంటుతాయని, తద్వారా తీవ్రమైన ద్రవ్యోల్బణం (ధరల పెరుగుదల) ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.