ప్రపంచ దేశాలకు ముడి చమురు సరఫరా చేసే అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి (Strait of Hormuz) వద్ద పరిస్థితి ప్రస్తుతం అత్యంత ఉత్కంఠభరితంగా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ , ఇరాన్ మధ్య మాటల యుద్ధం ముదిరిపోవడంతో.. ఇది ఎటు దారితీస్తుందోనని ప్రపంచ దేశాలు భయాందోళన చెందుతున్నాయి.
ట్రంప్ ఏం హెచ్చరించారు?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా ఇరాన్కు ఒక గట్టి హెచ్చరిక జారీ చేశారు. ‘వచ్చే 48 గంటల్లోగా హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిచి ఉంచకపోతే, ఇరాన్లోని అతిపెద్ద విద్యుత్ కేంద్రాలను అమెరికా నేలమట్టం చేస్తుంది’ అని ఆయన హెచ్చరించారు. కేవలం హెచ్చరించడమే కాకుండా.. మొట్టమొదట ఇరాన్లోని అన్నింటికంటే పెద్దదైన పవర్ ప్లాంట్పైనే దాడి చేస్తామని బాంబు పేల్చారు. ఇరాన్ తీరు వల్ల అంతర్జాతీయ వాణిజ్యానికి ఆటంకం కలుగుతోందని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read:CM Revanth Reddy : మహిళా సంఘాలకు బంపర్ ఆఫర్.. ఇకపై అందరూ కోటీశ్వరులే.!
ఇరాన్ సమాధానం ఏమిటి..?
ట్రంప్ హెచ్చరికలపై ఐక్యరాజ్యసమితి వేదికగా ఇరాన్ ప్రతినిధి అలీ మూసవి స్పందించారు. హర్మూజ్ జలసంధి అందరికీ తెరిచే ఉందని, అయితే తమ శత్రువులకు సంబంధించిన నౌకలను మాత్రం అనుమతించబోమని ఆయన తేల్చి చెప్పారు. ఇరాన్తో భద్రతాపరమైన ఒప్పందాలు చేసుకుని.. తమకు సహకరించే దేశాల నౌకలు యథావిధిగా ప్రయాణించవచ్చని తెలిపారు. ప్రస్తుతం అక్కడ నెలకొన్న ఉద్రిక్తతలకు అమెరికా, ఇజ్రాయెల్ దేశాలే కారణమని ఆయన విమర్శించారు. దౌత్యపరంగా సమస్యను పరిష్కరించుకోవడమే తమ మొదటి ప్రాధాన్యత అని, కానీ దాడులు ఆగిపోయి పరస్పర నమ్మకం ఏర్పడటం అంతకంటే ముఖ్యమని ఇరాన్ వ్యాఖ్యానించింది.
ఎందుకింత రచ్చ..?
ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడి చమురులో దాదాపు 20 శాతం ఈ హర్మూజ్ జలసంధి ద్వారానే వెళ్తుంది. ఇది గనుక మూతపడితే పెట్రోల్, గ్యాస్ ధరలు ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా పెరిగిపోతాయి. అందుకే అమెరికా ఈ మార్గంపై పట్టు కోసం ప్రయత్నిస్తుండగా.. ఇరాన్ తన భూభాగం గుండా వెళ్లే ఈ మార్గాన్ని ఆయుధంగా వాడుకుంటోంది. ప్రస్తుతం ఈ 48 గంటల గడువు సమీపిస్తుండటంతో, ప్రపంచమంతా అప్రమత్తమైంది.