NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

రికార్డు ధరకు రాజా సాబ్ ఆడియో రైట్స్..

ఏడాదికి ఒక సినిమా రిలీజ్ ఉండేలా ప్లానింగ్ చేస్తున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. ఈ ఏడాది కల్కి తో సూపర్ హిట్ అందున్నాడు. ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే రెండు సినిమాలను సెట్స్ పైకి తీసుకువెళ్లాడు. వాటిలో ఒకటి మారుతి దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ లో హార్రర్‌, కామెడీ, రొమాంటిక్ కథాంశంతో ఈ చిత్రం రానుంది. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు.

కట్ ఆఫ్ మార్కులు ఎక్కడా కూడా ప్రచురించలేదు

దేశంలోనే ప్రఖ్యాత న్యాయవాది కపిల్ సిబల్ సహా సీనియర్ న్యాయవాదులను మేము ఈ కేసు కోసం నియమించామని, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేపట్టే పరీక్షల నిర్వహణ, నియామక ప్రక్రియ హైకోర్టు తుది తీర్పులకు లోబడి ఉంటుందని కోర్ట్ స్పష్టం చేసిందన్నారు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు ఇప్పటికే చేరుకున్నారు కాబట్టి వాటిని వాయిదా వేయడం కుదరదని సుప్రీంకోర్టు భావించిందన్నారు. పరీక్షలు నిర్వహిస్తే నిర్వహించారు, ఫలితాలను మాత్రం ప్రకటించవద్దు అంటూ సుప్రీంకోర్టు ఇవాళ్టి ఆదేశాల్లో పేర్కొందని, ఫలితాలు వెల్లడించినా సరే.. నియామకాలు తుది తీర్పులకు లోబడి ఉంటాయని తెలంగాణ హైకోర్టు చెబితే, తుది తీర్పు ఇచ్చిన తర్వాతనే ఫలితాలు వెల్లడించాలని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు దాసోజు శ్రవణ్‌.

గత ఐదేళ్లలో పారిశుద్ధ్యంపై ఎలాంటి డబ్బులు ఖర్చులు చేయలేదు..

విజయనగరం జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించారు. గుర్ల తాగునీటి పథకాన్ని పరిశీలించడంతో పాటు.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న డయేరియా బాధితులను ఉపముఖ్యమంత్రి పరామర్శించారు. అనంతరం గ్రామస్థులతో మాట్లాడారు. డయేరియా వ్యాప్తి కారణాలపై కలెక్టర్‌తో సమీక్షించారు. చంపావతి నది పరివాహక ప్రాంతాలలో చెత్తా చెదారం పడేస్తున్నారని.. గుర్ల గ్రామంలో బహిరంగ మలవిసర్జన ఎక్కువగా ఉందని పవన్ తెలిపారు. దీనిని ఆపకపోతే ఆరోగ్య పరంగా చాలా వరకు నష్టపోయే అవకాశం ఉందన్నారు. గత అయిదేళ్లలో ఎలాంటి డబ్బులు ఖర్చు చెయ్యలేదని.. పంచాయితీ నిధులు విడుదల చెయ్యలేకపోయారని విమర్శించారు. గత అయిదేళ్లలో కనీసం ఫిల్టర్స్ కూడా మార్చలేకపోయారన్నారు.

ముత్యాలమ్మ టెంపుల్ ఎపిసోడ్‌లో పూర్తి స్థాయి విచారణ జరగాలి

హైదరాబాదులోని శ్రీ ముత్యాలమ్మ దేవి ఆలయం వద్ద శనివారం ఆలయ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున గుమిగూడిన ఆందోళనకారులపై తెలంగాణ పోలీసులు లాఠీచార్జి చేశారు . తెలంగాణలోని హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా విశ్వహిందూ పరిషత్ (విహెచ్‌పి), భజరంగ్ దళ్ రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ నిరసనలకు పలు హిందూ సంస్థలు మద్దతు తెలిపాయి. అయితే.. తాజాగా ఎంపీ రఘునందన్‌ రావు డీజీపీని కలిసి ఈ వ్యవహారంపై లోతైన విచారణ అవసరమని వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. ముత్యాలమ్మ టెంపుల్ ఎపిసోడ్ లో పూర్తి స్థాయి విచారణ జరగాలని, సంఘ విద్రోహ శక్తులు, స్లీపర్ సెల్స్ ఏవైనా కుట్రలు చేస్తున్నాయా..? అని ఆయన ప్రశ్నించారు. ముత్యాలమ్మ టెంపుల్ కు సమీపంలో స్లీపర్ సెల్స్ కు శిక్షణ అని, మునవర్ అనే వ్యక్తి ఎవరు..? ఎక్కడించి వచ్చారు.? ఇంటిలిజెన్స్ ఏం చేస్తోంది..? అని రఘునందన్‌ రావు అన్నారు.

సుప్రీం కోర్టు తీర్పు అభినందనీయం.. కాంగ్రెస్ బడుగు బలహీన వర్గాల పార్టీ

నిజామాబాద్ జిల్లాలో నుడా చైర్మన్ కేశ వేణు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహా దారులు షబ్బీర్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ.. గ్రూప్ వన్ పరీక్షల విషయంలో బీఆర్‌ఎస్‌ విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రతిష్టను మాసకబార్చే ప్రయత్నం చేసారు.. కానీ పరీక్షలకు అనుమతి లభించిందన్నారు మంత్రి జూపల్లి. సుప్రీం కోర్టు తీర్పు అభినందనీయమని, కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ అని ఆయన వ్యాఖ్యానించారు. నిజామాబాద్ జిల్లా పై సీఎం రేవంత్ రెడ్డి కి ప్రత్యేక మక్కువ ఉందని, జిల్లాకు అత్యధికంగా కేటాయించిన నామినేటెడ్ పోస్టులే ఇందుకు నిదర్శనమన్నారు.

విద్యుత్‌ ఛార్జీల పెంపు ప్రతిపాదనల్ని ప్రభుత్వం విరమించుకోవాలి

రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థల ద్వారా 18,500 కోట్ల రూపాయల అదనపు భారాన్ని మోపేందుకు రంగం సిద్ధం చేసిందన్నారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇవాళ ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. వివిధ మార్గాల్లో ప్రజలపై విద్యుత్ భారం మోపాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. గృహ అవసరాలకు నెలకు 300 యూనిట్లు దాటితే ఫిక్స్డ్ ఛార్జ్ ఐదు రెట్లు పెంచాలని భావిస్తోందని, పది రూపాయలు ఉన్న ఛార్జీని 50 రూపాయలు చేయాలని భావిస్తోందన్నారు. ఇళ్ళల్లో 300 యూనిట్లు దాటడం కామన్ గా మారిందని, విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను తిరస్కరించాలని మేము ఈఆర్సి చైర్మన్ కు వినతిపత్రం ఇచ్చామన్నారు. పరిశ్రమలన్నింటిని ఒకే కేటగిరి కిందకు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోందని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం విధానాలతో రాష్ట్రంలో పరిశ్రమలు వెళ్లిపోతున్నాయని, ఫాక్స్ కాన్ సంస్థ ఇప్పటికే చెన్నైకి వెళ్ళిందని, రైతులు పూర్తిగా నైరాశ్యంలో ఉన్నారని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. మోటార్లకు మీటర్లు పెట్టాలనే ఆలోచనపై ఇప్పటి వరకు ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడం లేదని, ట్రూ ఆప్ చార్జీల పేరుతో 12,500 కోట్లు విద్యుత్ సంస్థలు పెంచాలని చూస్తే కేసీఆర్ తిరస్కరించారని ఆయన అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని దేశంలో అగ్రస్థానంలో నిలిపిందని, రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చామన్నారు. విద్యుత్ చార్జీలు పెంచితే రాష్ట్ర అభివృద్ధికి ఆటంకంగా మారుతుందని, ప్రజలను అప్రమత్తం చేసేందుకు మేము ఈఆర్సీకి వినతిపత్రం ఇచ్చామని కేటీఆర్‌ తెలిపారు.

విద్యార్థులు హ్యాపీ గా పరీక్షలు రాసుకోండి.. మేము అండగా ఉన్నాం..

సుప్రీంకోర్టు తీర్పు తో విద్యార్థులు హ్యాపీగా పరీక్షలు రాసుకోవాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు. గ్రూప్ 1 పరీక్షలను వాయిదా వేయలేమని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు హర్షనీయమన్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో విద్యార్థులు హ్యాపీ గా పరీక్షలు రాసుకోవాలని సూచించారు. 13 ఏళ్ల తర్వాత ఒక మంచి అవకాశం వచ్చింది.. మంచిగా ఉపయోగించుకొని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షిస్తున్నా అన్నారు. మేము మొదటి నుంచి గ్రూప్ 1 విద్యార్థులకు అండగా ఉన్నామన్నారు. ఇదే విషయాన్ని పదే పదే చెపుతూనే ఉన్నామని గుర్తు చేశారు. జీఓ 29 వల్ల రిజర్వేషన్లు అభ్యర్థులకు ఎలాంటి అన్యాయం జరగదని మరోసారి చెప్తున్నామని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు వారి రాజకీయ లబ్ది కోసం గ్రూప్ 1 విద్యార్థులను పావుగా వాడుకున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

హడావుడిగా గుర్ల టూర్ ముగించుకున్న డిప్యూటీ సీఎం పవన్‌!

విజయనగరం జిల్లా గుర్లలో నేడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పర్యటించారు. స్థానిక పీహెచ్‌సీలో డయేరియా బాధితులను ఆయన పరామర్శించారు. వ్యాధి వ్యాప్తి, కారణాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గుర్లలో బాధిత కుటుంబాలతో ఆయన మాట్లాడారు. అయితే డిప్యూటీ సీఎం పవన్ హడావుడిగా గుర్ల టూర్ ముగించుకున్నారు. ఇన్ ఫిల్టరైజేషన్ పాయింట్ వద్ద అడుగుపెట్టిన ఆయన.. పీహెచ్‌సీలో బాధితులను చూశారు. గ్రామ ప్రజలతో మాత్రం ఎక్కువగా మాట్లాడలేదు.

అధికారులను దగ్గరకు తీసుకున్న డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. నేతలను పక్కన పెట్టారు. జిల్లా మంత్రి, స్థానిక ఎమ్మెల్యేలను సైతం పవన్ బృందం దూరం పెట్టింది. పవన్ అభిమానులను అదుపు చెయ్యలేక పోలీసులు చేతులెత్తేశారు. భారీగా అభిమానులు ఉండడంతో మూడు కుటుంబాలతో మాత్రమే డిప్యూటీ సీఎం మాట్లాడారు. దాంతో కొందరు అసంతృప్తికి గురయ్యారు. డిప్యూటీ సీఎం పవన్‌ ఓ గంటలోనే గుర్ల టూర్ ముగించుకున్నారు.

ఒక్క నిమిషం ఆలస్యం.. అనుమతించని అధికారులు!

తెలంగాణలో గ్రూప్‌ 1 పరీక్షలు ఇప్పుడు హాట్‌ టాపిక్‌. సుప్రీం కోర్టు తీర్పుతో అధికారుల అలర్ట్ అయ్యారు. భారీ బందోబస్తు మధ్య అధికారులు గ్రూప్‌ 1 పరీక్షలను నిర్వహిస్తున్నారు. దీంతో పోలీసులు, అధికారులు జిల్లాల వ్యాప్తంగా 46 కేంద్రాల వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. గ్రూప్‌ 1 పై సుప్రీం కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో అని అభ్యర్థుల్లో టెన్షన్‌ మొదలైన సమయంలో కొందరు విద్యార్థుల తీరు మాత్రం మారలేదు. గ్రూప్‌ 1 అభ్యర్థులు పరీక్ష సమయానికి గంట ముందే కేంద్రాల వద్దకు చేరుకోవాలని సూచించారు. ఒక్క నిమిషం ఆలస్యమైన అభ్యర్థులను లోనికి అనుమతించం అని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులు ముందుగా పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకోవాలని కోరారు. అయితే ముందు నుంచి అధికారులు నియమాలు పాటించాలని కోరుతున్న కొంతమంది అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

దూసుకొస్తున్న తుఫాన్.. ఈ రాష్ట్రాలకు అత్యంత భారీ వర్ష సూచన

దేశంలోని రెండు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. బంగాళాళాతంలో ఏర్పడిన తుఫాన్ ఈనెల 23న తీరం దాట నుంది. దీని ప్రభావంతో ఒడిశా, పశ్చిమబెంగాల్‌లోని వివిధ జిల్లాల్లో అత్యంత భారీ వర్షం నమోదు అవుతుందని ఐఎండీ తెలిపింది. ఒడిశాలోని పూరీ, ఖుర్దా, గంజాం, జగత్‌సింగ్‌పూర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అధికారులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. భారత వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా తగు చర్యలు తీసుకుంటున్నారు. ముందుగా అన్ని సన్నాహాలు చేస్తున్నట్లు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు స్పష్టం చేశాయి. ఫైర్ సర్వీస్, శాంతిభద్రతల అదనపు డీజీతో సమీక్ష నిర్వహిస్తామని ఒడిశా రెవెన్యూ విపత్తు నిర్వహణ మంత్రి సురేష్ పూజారి తెలిపారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సహాయక కేంద్రాల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని.. కేంద్రప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు మంత్రి తెలిపారు.