NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

జమ్మూకశ్మీర్‌లో వరుస ఉగ్రదాడులపై రాహుల్‌ గాంధీ స్పందన.. కేంద్రంపై ఫైర్

జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడులపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు . ఎక్స్‌లో కాంగ్రెస్‌ అధినేత తన అభిప్రాయాన్ని వెల్లడించారు. జమ్మూకశ్మీర్‌లో శాంతి భద్రతలను నెలకొల్పడంలో ఎన్డీఏ ప్రభుత్వ విధానాలు విఫలమయ్యాయని ఆరోపించారు. నిరంతర ఉగ్రవాద కార్యకలాపాలు, సైనికులపై దాడులు, పౌరుల హత్యల కారణంగా ఈ రాష్ట్రం ప్రమాదపు నీడలో జీవిస్తోందని పేర్కొన్నారు.

ముగిసిన రెండో రోజు ఆట.. భారీ ఆధిక్యంలో న్యూజిలాండ్

పుణే టెస్టులోనూ టీమిండియాకు కష్టాలు తప్పలేదు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 156 పరుగులకే కుప్పకూలగా… రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన న్యూజిలాండ్ భారీ ఆధిక్యంపై కన్నేసింది. కాగా.. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ రెండో ఇన్సింగ్స్‌లో 5 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. దీంతో.. భారత్‌పై న్యూజిలాండ్ 301 పరుగుల ఆధిక్యం సాధించింది. కివీస్ కెప్టెన్ లాథమ్ 86 పరుగులతో రాణించారు. విల్‌ యంగ్‌ (23), డేరియల్‌ మిచెల్‌ (18) పరుగులు చేశారు. ప్రస్తుతం.. గ్లెన్ ఫిలిప్ 9, టామ్ బ్లండెల్ 30 పరుగులతో క్రీజులో ఉన్నారు. రెండో ఇన్నింగ్స్‌లో వాషింగ్టన్ సుందర్ 4 వికెట్లు పడగొట్టాడు. అశ్విన్ ఒక వికెట్ తీశాడు.

అల్లు అర్జున్‌కి గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ హైకోర్టు

స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి ఆంధ్ర‌ప్రదేశ్ హైకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. అసలు విషయం ఏమిటంటే ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్ సమయంలో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారనే కారణంతో నంద్యాల పోలీసులు అల్లు అర్జున్‌పై ఒక కేసు న‌మోదు చేసిన విష‌యం తెలిసిందే. అయితే ఈ కేసును కొట్టేయాలని అల్లు అర్జున్, మాజీ ఎమ్మెల్యే రవిచంద్రకిశోర్‌రెడ్డి కలిసి పిటిష‌న్ దాఖలు చేశారు. ఈ పిటిష‌న్ శుక్రవారం నాడు విచార‌ణ‌కు రాగా ఎఫ్ఐఆర్ ఆధారంగా నవంబరు 6 వరకు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవద్దని న్యాయస్థానం పోలీసుల‌ను ఆదేశించింది. అలాగే ఈ కేసుకు సంబంధించి నవంబరు 6న తుది తీర్పు ఇవ్వ‌నున్న‌ట్లు ధ‌ర్మాస‌నం వెల్లడించింది.

ఉచిత ఇసుక విధానాన్ని మరింత సరళం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు..

ఉచిత ఇసుక విధానాన్ని మరింత సరళం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఉచిత ఇసుక పాలసీ 2024లో సీనరేజి ఫీజు మాఫీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు మైన్స్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా జీవో జారీ చేశారు. ఉచిత ఇసుక పాలసీపై ఈ నెల 21న జరిగిన సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయలను అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎటువంటి రుసుము చెల్లించకుండ ఇసుకను నిర్మాణ అవసరాలకు తీసుకు వెళ్ళేలా ఆదేశాలు ఇచ్చారు. నిర్మాణ రంగం వలన ఉపాధి ఆదాయం పెరుగుతున్నందున ఉచిత ఇసుక పూర్తిస్థాయిలో అమలుకు చర్యలు తీసుకుంది ప్రభుత్వం. ఇందులో భాగంగా సీనరేజీ ఫీజు, మెరిట్ అన్ శాండ్, డీఎంఎఫ్ మాఫీకి చర్యలు చేపట్టినట్టు ఉత్తర్వుల్లో వెల్లడించారు.

పేద ప్రజల సంక్షేమాన్ని ఛిద్రం చేయడమే ప్రజా పరిపాలన లక్ష్యమా..?

మూసీ బాధితులకోసం బీజేపీ నేడు హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ చౌక్ వద్ద మహా ధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ధర్నాలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేఎల్పీ నేత ఏలేటి మాహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రికి అప్పీల్ చేస్తున్న, డిమాండ్ చేస్తున్నాం పేదల ఇండ్లను కూల్చోద్దు అని ఆయన అన్నారు. మీ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే మూసీ సుందరీకరణ ను తెర మీదకు తెచ్చారని, సిగ్గులేకుండా ప్రభుత్వం పేద ప్రజల ఇండ్లను కూల్చుతోందన్నారు కిషన్‌ రెడ్డి. ప్రభుత్వ విధానాలు మార్చుకోకపోతే రాబోవు కాలంలో ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని, మూసీ సుందరీకరణ పేరుతో ప్రజల ఇండ్లను కూల్చితే జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు కిషన్‌ రెడ్డి.

అన్ని పాలసీలతో 30 లక్షల కోట్ల పెట్టుబడి, 20 లక్షల ఉద్యోగాలు కల్పన..

AP అంటే A ఫర్ అమరావతి, P ఫర్ పోలవరం అనే విధంగా ప్రజలు ఆలోచిస్తున్నారని సమాచార పౌరసంబంధాల శాఖామంత్రి కొలుసు పార్ధసారథి అన్నారు. ఏపీని పెట్టుబడికి అనువైన ప్రాంతంగా పెట్టుబడిదారులు వస్తున్నారని తెలిపారు. రూ. 15 వేల కోట్లు కేంద్రంతో మంజూరు చేయించడం అమరావతి ప్రాజెక్టు పూర్తవుతుందనే నమ్మకం కలిగించిందని మంత్రి పేర్కొన్నారు. అమరావతి ఏర్పడుతుందా అనేది ఇప్పటివరకూ ఒక మిధ్య ఉండేదని అన్నారు. భారతమాల ప్రాజెక్టులో భాగంగా హైవేల అభివృద్ధితో భవిష్యత్తు బాగుపడనుంది.. అలాగే, అన్ని పాలసీలతో రూ. 30 లక్షల కోట్ల పెట్టుబడి, 20 లక్షల ఉద్యోగాల కల్పన ప్రయత్నం జరుగుతోందని మంత్రి తెలిపారు. మరోవైపు.. పెన్షన్, ఉచిత సిలిండర్లు, గత ప్రభుత్వం ఎగ్గొట్టినవి ఇవ్వడం ద్వారా సంక్షేమం చేయాలని సీఎం చంద్రబాబు ప్రణాళిక చేస్తున్నారని మంత్రి పార్ధసారథి అన్నారు.

టీడీపీ కుట్రలో షర్మిల పావులా మారింది..

టీడీపీ కుట్రలో షర్మిల పావులా మారిందని వైసీపీ సీనియర్‌ నేత, రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. మాజీ మంత్రి పేర్నినానితో కలిసి వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. జగన్ జైలుకు వెళ్ళటానికి కాంగ్రెస్, టీడీపీ పెట్టిన అక్రమ కేసులు కారణం అని అన్నారు. ఆ కేసుల్లో భాగంగా ఈడీ విచారణ చేసి ఆస్తులు అటాచ్ మెంట్ చేసింది.. ట్రాన్స్‌ఫర్ చేయద్దు అని హైకోర్టు చెప్పినా షేర్లు ట్రాన్స్‌ఫర్ చేసారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అంటే టీడీపీ కుట్రలో మనం కూడా భాగం అయ్యామని అనిపిస్తోంది.. వాస్తవాలు చెప్పేందుకు జగన్ ఎన్‌సీఎల్టీని ఆశ్రయించారన్నారు. అంతే తప్పా.. తల్లి, చెల్లి పై కేసులు వేయాలని దురుద్దేశం మాత్రం కాదని తెలిపారు.

ఏపీలో వింత రాజకీయాలు అన్నీ కనపడుతున్నాయి..

వైఎస్ జగన్, షర్మిల మధ్య తలెత్తిన ఆస్తుల వివాదంపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్‌కు షర్మిల వ్యక్తిగతంగా రాసిన ఉత్తరం కూటమి ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్‌లో ఉంటుందని ఆరోపించారు. చంద్రబాబు రాజకీయ అక్రమ బంధాలు పెట్టుకోవటంలో ముందు ఉంటారు.. ఎన్డీయేలో ఉన్నాను అని చెబుతూ ఇక్కడ కాంగ్రెస్‌తో చెట్టా పట్టాలు, చెలిమి ఉంటుదని అన్నారు. ఏపీలో వింత రాజకీయాలు అన్నీ కనపడుతున్నాయని పేర్కొన్నారు. వైఎస్సార్ బ్రతికి ఉన్న సమయంలో సంస్థలు ఏర్పాటు చేసినప్పుడు షర్మిల ఆమె భర్తకు కూడా వాటాలు ఉండాలి కదా అని అన్నారు. వైఎస్సార్ ఆ రోజునే షర్మిల, అనిల్ పేర్లు డైరెక్టర్లుగా ఉండాలని చెబితే ఉండేవి కదా అని తెలిపారు. వైఎస్సార్ ఆశయాలు కొనసాగించాలని నిజంగా అనుకుంటే చంద్రబాబుతో కలిసి రాజకీయాలు చేస్తారా, కలిసి ప్రయాణం చేస్తారా అని ప్రశ్నించారు.

33 కోర్సులను ప్రక్షాళన చేసి విద్యార్థులకు అందిస్తాం

గత ప్రభుత్వం పదేళ్లలో 40 వేల ఉద్యోగాలివ్వలేదని విమర్శించారు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే 50 వేల పై చిలుకు ఉద్యోగాలుచ్చామని ఆయన తెలిపారు. గ్రూప్ 1 పరీక్షకు ముందు విద్యార్థులను రెచ్చగొట్టి బీఆర్ఎస్ పరీక్షలను అడ్డుకునే ప్రయత్నం చేసిందని ఆయన మండిపడ్డారు. గడిచిన పదేళ్లలో టెక్నికల్ వ్యవస్థలు మూలనపడ్డాయని, ఆర్థిక పరిస్థితిని అస్తవ్యస్తం చేసారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం పై ప్రత్యేకమైన శ్రద్దగా పెట్టిందని, పాలమూరులో రెండు ఏటీసీ ( అడ్వాన్స్డ్ టెక్నికల్ సెంటర్స్) ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి శ్రీధర్‌ బాబు తెలిపారు. యువతలో నైపుణ్యాన్ని పెంచేందుకు స్కిల్ యూనివర్సిటీ ని ఏర్పాటు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. పాలమూరులో స్కిల్ యూనివర్సిటీ విభాగం ఏర్పాటు చేసి విద్యార్థులకు నైపుణ్యాలు అందిస్తామని, గత ప్రభుత్వం యూనివర్సిటీలకు వీసీలను నియమించలేదని మండిపడ్డారు.

ఏపీలో ఎస్సీ వర్గీకరణ అమలు వేగవంతం చేయాలి..

ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ వర్గీకరణ అమలు వేగవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నవంబర్ మొదటి వారంలో డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుంది అని మంత్రి లోకేష్ చెప్పారు.. ఎస్సీ వర్గీకరణ ప్రారంభం అయ్యేవరకు ఎటువంటి జాబ్ నోటిఫికేషన్‌లు ఇవ్వకూడదని అన్నారు. తమ విజ్ఞప్తికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. షెడ్యూల్ కులాల వర్గీకరణ ఆగష్టు 1న సుప్రీం కోర్ట్ తీర్పు ఇచ్చింది.. ఎస్సీ వర్గీకరణ చట్టం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు చంద్రబాబు నాయుడు తీసుకు వచ్చారని మందకృష్ణ పేర్కొన్నారు.