ట్రంప్ నా కోసం తన సెక్యూరిటీని పక్కన పెట్టేశారు.. మోడీ కామెంట్స్..
అమెరికన్ పాడ్కాస్టర్, ఏఐ పరిశోధకుడు లెక్స్ ఫ్రిడ్మాన్తో జరిగిన ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్రమోడీ కీలక విషయాలను వెల్లడించారు. హ్యూస్టన్లో జరిగిన ‘‘హౌడీ మోడీ’’ కార్యక్రమం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన భద్రతను పక్కన పెట్టారని అన్నారు. వేల సంఖ్యలో ప్రవాస భారతీయులు హాజరైన తీరును మోడీ గుర్తు చేసుకున్నారు. మోడీ తన ప్రసంగం ముగిసిన తర్వాత, ట్రంప్తో కలిసి స్టేడియంలో తిరగడం గురించి చెప్పారు.
‘‘ నేను అతనికి కృతజ్ఞతలు చెప్పడానికి అతని దగ్గరికి వెళ్ళాను, మీకు అభ్యంతరం లేకపోతే మనం స్టేడియం చుట్టూ ఒక రౌండ్ ఎందుకు తిరగకూడదు అని మామూలుగా అన్నాను’’ అని ట్రంప్తో అన్నానని మోడీ చెప్పారు. అందుకు ట్రంప్ ‘‘ఇక్కడ చాలా మంది ఉన్నారు. మనం కలిసి నడుద్దాం, వారిని పలకరిద్దాం అని చెప్పినట్లు మోడీ వెల్లడించారు. అమెరికా కఠినమైన భద్రతా ప్రోటోకాల్లో ఇలాంటి తీరు అసాధారణమని మోడీ చెప్పారు. అమెరికన్ సమాజంలో వేలాది మంది ప్రజల సమక్షంలో ప్రెసిడెంట్ ఇలా తిరగడం అసాధ్యమని చెప్పారు.
హరీష్ రావుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్
తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల గురించి చర్చకు సిద్ధమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. శ్రీరాం సాగర్, నాగార్జున సాగర్, కోయిల్ సాగర్, మంజీరా గడ్డపై సాగునీటి ప్రాజెక్టులపై ఎవరి వద్ద అయినా మాట్లాడేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.
హరీష్ రావును ఉద్దేశించి సీఎం రేవంత్ వ్యంగ్యంగా స్పందించారు. పిల్ల కాకులకేం తెలుసు… వాళ్లు వీళ్లు కాదు, కేసీఆర్ నువ్వే రా అంటూ కౌంటర్ ఇచ్చారు. 2023లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారని, ప్రజల తీర్పుతో కేసీఆర్కు సరైన దెబ్బపడిందని అన్నారు.
కేసీఆర్ ప్రజల్లోకి రాలేకపోవడాన్ని విమర్శిస్తూ, అధికారం లేకపోతే బయటకు రావడం లేదా? అని ప్రశ్నించారు. తన బదులుగా కొడుకు, అల్లుడిని ముందుకు నెడుతున్నారని ఆరోపించారు. అసెంబ్లీకి హాజరుకాకపోయినా ప్రతిపక్ష హోదా ఎందుకు? జీతభత్యాలు ఎందుకు? అని నిలదీశారు.
ఎంపీ డీకే అరుణ ఇంట్లో చొరబడిన దొంగ..
ఎంపీ డీకే అరుణ ఇంట్లో ఆందోళన చెలరేగింది. అర్ధరాత్రి ఓ దొంగ ఇంట్లోకి రావడం కలకలం రేపింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 56లోని ఆమె ఇంట్లో చొరబడిన దొంగ గంటన్నర సేపు ఇంట్లోనే సంచరించాడని హౌస్ మెయింటేనెన్స్ ఇన్ చార్జి లక్ష్మణ్ తెలిపారు. ‘తెల్లవారు జామున 3 గంటలకు దొంగ ఇంట్లోకి ఎంటర్ అయ్యాడు. కిచెన్ దగ్గర అలజడి రావడంతో మేము మేల్కొన్నాం. అతను రెండు చేతులకు గ్లౌస్ లు, ముఖానికి మాస్క్ వేసుకున్నాడు. కిచెన్ పక్కనే పెద్ద గోడ ఉంటుంది. దాన్ని దూకి అతను ఇంట్లోకి ఎంటర్ అయ్యాడు’ అంటూ లక్ష్మణ్ వివరించారు.
ప్రతిపక్షంలో అభివృద్ధి కష్టమని గ్రహించి కాంగ్రెస్లో చేరాను
కడియం శ్రీహరి సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అభివృద్ధి పనుల కోసం రూ.800 కోట్లు మంజూరు చేసినందుకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. తన విజయానికి ప్రజల ఆదరాభిమానాలే కారణమని, ప్రతిపక్షంలో అభివృద్ధి కష్టమని గ్రహించి కాంగ్రెస్లో చేరినట్లు చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల కింద 3,500 ఇండ్లు మంజూరయ్యాయని, ఇంకా పెంచాలని సీఎం ప్రత్యేక నిధుల నుంచి మరిన్ని ఇండ్లు మంజూరు చేయాలని కోరారు. గత 15 ఏళ్లలో అభివృద్ధి జరగలేదని, అవినీతి పాలన రాజ్యమేలిందని విమర్శించారు. పదవులు, పథకాలు అమ్ముకోవడం మాత్రమే జరిగిందని, తాగుడూ తినుడే మిగిలిందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టెస్ట్ మ్యాచ్, వన్డే మ్యాచ్ పూర్తయ్యిందని, ఇప్పుడు టీ20 మ్యాచ్ ఆడుతున్నాడని శ్రీహరి వ్యాఖ్యానించారు. ఆయన తెలంగాణ అభివృద్ధే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నారని పేర్కొన్నారు.
తెలంగాణ భవిష్యత్తు కేసీఆర్ హస్తంలోనే
నిజామాబాద్ బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. రంజాన్ తోఫా నిలిపివేయడం, సీఎం రేవంత్ రెడ్డి తీరు, తెలంగాణ భవిష్యత్తు గురించి ఆమె తన అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తపరిచారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ తోఫాను నిలిపివేయడం ముస్లిం సోదరుల హక్కులకు భంగం కలిగించే విషయం అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మతసామరస్యానికి ప్రతీక అయిన తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలకు ఇచ్చే సహాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నిలిపివేసిందని ఆమె ప్రశ్నించారు. తమ పాలనలో అన్ని మతాలకు సమాన గౌరవం కల్పించామని, ముస్లింల సంక్షేమానికి ప్రత్యేక నిధులు కేటాయించామని గుర్తు చేశారు.
ఢిల్లీ టూర్ నన్ను పూర్తిగా మార్చేసింది
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇటీవల మీడియాతో చిట్చాట్ చేశారు. ఆయన తన సినీ ప్రయాణం, రాజకీయ భవిష్యత్తు, అభివృద్ధి పై కీలక వ్యాఖ్యలు చేశారు. జగ్గారెడ్డి మాట్లాడుతూ, మూడు నెలల క్రితం దర్శకుడు రామానుజం తన వద్దకు వచ్చి, ఒక ఫోటో చూపించారని చెప్పారు. ఆ ఫోటో చూసిన వెంటనే తనకు కనెక్షన్ కలిగిందని, 2013 నుంచి దర్శకుడు తనలాంటి వ్యక్తిని వెతుకుతున్నారని చెప్పాడని వెల్లడించారు. మొదటగా సినిమాకు సమయం ఇవ్వలేనేమో అనుకున్నా, కానీ ఆ ఫోటో చూసిన తర్వాత సినిమాను చేయాలని ఖచ్చితంగా నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
“కేదార్నాథ్లో హిందువులు కాని వారిని నిషేధించాలి”.. మరో వివాదం..
కేదార్నాథ్ ఆలయంలోకి హిందువులు కానీ వారిని నిషేధించాలని ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యే ఆశా నౌటియల్ చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి కారణమైంది. కొంతమంది హిందువులు కాని వ్యక్తులు, మతపరమైన స్థలం పవిత్రతకు హాని కలిగించడానికి ప్రయత్నిస్తున్నారని కేదార్నాథ్ ఎమ్మెల్యే ఆరోపించారు. దీనిపై , ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీష్ రావత్ స్పందించారు. బీజేపీ నాయకులకు సంచలనాత్మక వ్యాఖ్యలు చేయడం అలవాటుగా మారిందని ఆగ్రహ వ్యక్తం చేశారు.
భారత్ శాంతికి ప్రయత్నిస్తే.. పాకిస్తాన్ ప్రతీసారి ద్రోహం చేసింది..
పాకిస్తాన్తో శాంతిని నెలకొల్పడానికి చేసిన ప్రతి ప్రయత్నంలో భారత్కి ద్రోహం, శత్రుత్వం ఎదురైందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. అమెరికన్ పాడ్కాస్టర్ లెక్స్ ఫ్రిడ్మాన్తో జరిగిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 2014లో తాను మొదటిసారిగా ప్రమాణస్వీకారం చేసే సమయంలో పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ని ప్రత్యేకంగా ఆహ్వానించిన విషయాన్ని గుర్తు చేశారు. దైపాక్షిక సంబంధాలను మెరుగుపరచడానికి ఇస్లామాబాద్కి జ్ఞానం రావాలని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు.
మార్చి 27న థియేటర్లలోకి మోహన్ లాల్ ‘L2 ఎంపురాన్’..
మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘L2 ఎంపురాన్’. పృథ్వీరాజ్ సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. దీన్ని లూసీఫర్ కు సీక్వెల్ గా రూపొందించారు. జనవరిలో రిలీజ్ అయిన టీజర్ కూడా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ సినిమాను మళయాలంతో పాటు ఇటు తెలుగులో కూడా ఒకేరోజు రిలీజ్ చేస్తున్నారు. మురళి గోపి కథ అదించగా.. ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్ బ్యానర్లపై సుబాస్కరన్, ఆంటోనీ పెరుంబవూర్, గోకులం గోపాలన్ సంయుక్తంగా నిర్మించారు.