NTV Telugu Site icon

Top Headlines @9AM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

ప్రభుత్వాసుపత్రిలో ఆక్సీజన్ అందక 8 మంది రోగులు మృతి…కుటుంబ సభ్యుల ఆందోళన

ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్ అందక ఎనిమిది మంది మృతి చెందారు. ఎంఐసీయూ వార్డులో 6 మంది మృతి చెందారని మృతుల బంధువులు ఆరోపించారు. విషయం వెలుగులోకి రావడంతో ఆస్పత్రిలో కలకలం రేగింది. మరోవైపు ఈ ఆరోపణలను ఆస్పత్రి యాజమాన్యం పూర్తిగా తోసిపుచ్చింది. రోగాల బారిన పడి ప్రజలు చనిపోతున్నారని చెప్పారు.

ఆక్సిజన్ సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేదని వైద్యులు చెబుతున్నారు. నెల్లూరు ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరా లేకపోవడంతో జరిగిన మరణాలపై ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ నివేదిక సమర్పించారు. ఆక్సిజన్ అందక మృతి చెందాడన్న ఆరోపణలను కలెక్టర్‌కు సమర్పించిన నివేదికలో ఆసుపత్రి సూపరింటెండెంట్ ఖండించారు. అనేక ఇతర కారణాల వల్ల మరణాలు సంభవించాయని ఆయన పేర్కొన్నారు.

తల్లికి బాలేదని డాక్టర్‎ను ఇంటికి పిలిచింది.. వీడియో తీసి బ్లాక్ మెయిల్ మొదలుపెట్టింది

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ నుంచి హనీట్రాప్ కేసులు తెరపైకి వస్తున్నాయి. ఈసారి హనీట్రాప్‌లో ఓ ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుడు చిక్కుకున్నట్లు సమాచారం. పోలీసులు ఇప్పుడు మొత్తం రాకెట్‌ను ఛేదించారు. ఈ కేసులో హిమానీగా గుర్తించిన 22 ఏళ్ల యువతిని అరెస్టు చేశారు. హనీట్రాప్‌లో చిక్కుకున్న డాక్టర్ షాక్ తట్టుకోలేక చనిపోయాడు. ఈ కేసు తెరపైకి రావడంతో పోలీసులు ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని హెచ్చరించారు.

ఈ కేసు బరేలీలోని సుభాష్‌నగర్‌కు చెందినది. అక్కడ డాక్టర్ తన క్లినిక్‌ని కాలనీలో నడుపుతున్నాడు. ఈ క్రమంలో హిమానీ తనకు ఫోన్ చేసి ఉద్యోగం కావాలని చెప్పింది. తర్వాత స్నేహితుడితో కలిసి, ఆమె మరుసటి రోజు క్లినిక్‌కి చేరుకుంది. ఈ కేసు 2022లో ప్రారంభమైంది. దాదాపు 10 రోజుల తర్వాత అకస్మాత్తుగా డాక్టర్‌కి హిమానీ నుంచి కాల్ వచ్చింది. తన తల్లి ఆరోగ్యం విషమంగా ఉందని, ఆమె చాలా బాధగా ఉందన్నారు. ఆ తర్వాత డాక్టర్‌ని ఇంటికి రమ్మని అడిగింది.

టీమిండియా మహిళల జట్టుకు చేజారిన విజయం.. సిరీస్ సమం

బంగ్లాదేశ్‌ మహిళలతో జరిగిన చివరి వన్డేలో టీమిండియా ఉమెన్స్ జట్టు 226 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగింది. కానీ 41.1 ఓవర్లలో స్కోరు 191/4…చేతిలో 6 వికెట్లతో మరో 53 బంతుల్లో 35 పరుగులు చేయాల్సిన పరిస్థితిలో మ్యాచ్ మలుపు తిరిగింది. హర్లీన్‌ డియోల్‌, దీప్తి శర్మ ఒకే ఓవర్లో రనౌట్ కావడంతో పాటు.. 34 పరుగుల వ్యవధిలో చివరి 6 వికెట్లను కోల్పోయిన భారత్‌ స్కోరును మాత్రం సమం చేసింది. అయితే, చివర్లో 19 బంతుల్లో 10 పరుగులు చేయాల్సిన సమయంలో కూడా లక్ష్యాన్ని అందుకోలేక మూడు బంతులు మిగిలి ఉండగానే టీమిండియా ఆలౌటైంది. జెమీమా రోడ్రిగ్స్‌ మరో ఎండ్‌లో ఉండగా.. చివరి ఓవర్‌ మూడో బంతికి మేఘనా సింగ్‌ను మారుఫా అవుట్‌ చేయడంతో మ్యాచ్‌ టై అయింది.

మంచినీళ్లు అనుకుని యాసిడ్ తాగిన కార్మికురాలు

ఓ మహిళ కార్మికురాలు.. బాటిళ్లను క్లీన్ చేసే ఫ్యాక్టరీలో పని చేస్తుంది. అయితే పని చేస్తున్న సమయంలో ఆమెకు దాహం వేయడంతో దీంతో తన తోటి కార్మికురాలుని నీళ్లు ఇవ్వాలని కోరింది. అయితే, ఆమె చూసుకోకుండా యాసిడ్ బాటిల్ ఇచ్చింది.. దాన్ని మంచి నీళ్లు అనుకుని సదరు మహిళ తాగేసింది. దీంతో ఒక్కసారిగా నోటిలో విపరీతమైన మంట ప్రారంభమైంది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖర్గోన్ జిల్లాలో రింకూ ఠాక్రే అనే కార్మికులు నివాసం ఉంటుంది. తన జీవనోపాధి కోసం అదే జిల్లాలో ఉన్న బాటిళ్లను శుభ్రం చేసే ఫ్యాక్టరీలో ఆమె పని చేసేది. ఎప్పటిలాగే నిన్న (శనివారం) కూడా ఫ్యాక్టరీలోకి పనికి వెళ్లింది. ఈ క్రమంలో ఆమెకు బాగా దాహం వేసింది. దీంతో తన పక్కనే పని చేస్తున్న ఓ మహిళను తాగేందుకు నీళ్లు ఇవ్వాలని అడిగింది. కానీ పని ధ్యాసలో ఉన్న ఆమె సరిగ్గా చూసుకోకుండా రింకూకు ఓ సీసాను ఇచ్చింది.

పోలీస్ స్టేషన్లో అవినీతికి వ్యతిరేకంగా రోడ్డుపై అడ్డంగా పడుకున్న హోంగార్డు.. వీడియో వైరల్

పంజాబ్‌లోని జలంధర్‌లోని హైవేపై ఓ పోలీసు హఠాత్తుగా పడుకున్నాడు. ఎందుకు ఇలా చేస్తున్నాడో చుట్టుపక్కల వారికి అర్థం కాలేదు. తన సొంత పోలీస్ స్టేషన్‌లోనే అవినీతికి వ్యతిరేకంగా ఆ పోలీసు నిరసన తెలిపాడు. నేరాల నిరోధించాల్సిన పోలీసులే నిందుతుల వంతుపాడుతూ వారికి మద్దతు పలుకుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. అందుకే రోడ్డుపై పడుకున్నాడని తెలుస్తోంది. ఇలాంటి నిరసనను చూసి ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. ఆ రోడ్డుపై చాలా సేపటివరకు ట్రాఫిక్ జామ్ అయింది.

పోలీసుల నిరసనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ వీడియోలో, ‘నేను దొంగలను పట్టుకుంటాను, నా పోలీస్ స్టేషన్‌లోని పోలీసులు డబ్బు తీసుకున్న తర్వాత వారిని విడిచిపెడతారు’ అని పోలీసు చెప్పడం కనిపిస్తుంది. వీడియోలో పోలీసు అతన్ని రోడ్డుపై తన్నడం కనిపిస్తుంది. పోలీసులు ఆ వ్యక్తి ఆరోపణలను తోసిపుచ్చారు. అతను తన్నలేదని కూడా పేర్కొన్నారు. ఈ ఘటన జలంధర్‌లోని భోగ్‌పూర్ ప్రాంతంలోని పఠాన్‌కోట్ హైవేపై జరిగింది. హోంగార్డు జవాన్లు ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి భోగ్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అతను నిన్న పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఆ వ్యక్తి గురించి అడగగా, తోటి పోలీసులు తప్పించుకునే సమాధానాలు చెప్పారు.

సోషల్‌ మీడియాను దుర్వినియోగం చేయద్దు: సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌

అన్ని వర్గాల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న సోషల్‌ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ అన్నారు. ఈ బాధ్యతను యువత తీసుకోవాలన్నారు. వేగంగా జనబాహుళ్యంలోకి చేరేందుకు అవకాశమున్న సామాజిక మాధ్యమాలు, అన్ని రంగాల్లోకి విస్తరించిన కృత్రిమ మేధ(ఏఐ) దుర్వినియోగాన్ని అరికట్టాలన్నారు. శనివారం జరిగిన ఐఐటీ మద్రాస్‌ 60వ స్నాతకోత్సవంలో సీజేఐ పాల్గొని విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. మానవీయ విలువలు, వ్యక్తిగత గోప్యతలకు అత్యున్నత ప్రాధాన్యత కల్పించాలని సీజేఐ తెలిపారు. ఆధునిక సాంకేతికతను సానుకూలంగా వాడుకునేందుకు వీలుగా రక్షణలు ఏర్పాటు చేయాలన్నారు. సోషల్‌ మీడియా దుర్వినియోగం కాకుండా చూడాలన్నారు. సాంకేతికతతో వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్లుతుందని ప్రజలు భయపడక ముందే నమ్మకమైన వినియోగాన్ని సులభతరం చేయాలన్నారు. సామాజిక మాధ్యమాల రాకతో సరిహద్దులు, వయస్సు, జాతీయత వంటి అవరోధాలు తొలగినప్పటికీ ఆన్‌లైన్‌లో వేధింపులు, ట్రోలింగ్‌ వంటివి కొత్తగా పుట్టుకొచ్చా యని సీజేఐ ఆవేదన వ్యక్తం చేశారు. విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన సామాజిక మాధ్యమాలు, కృత్రిమ మేధ పద్ధతుల దుర్వినియోగం ఆగాలని సీజేఐ అన్నారు. న్యాయబద్ధత, మానవతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేలా సాంకేతిక వినియోగం ఉండాలని జస్టిస్‌ చంద్రచూడ్‌ ఆకాంక్షించారు. సోషల్‌ మీడియా వ్యక్తిగత స్వేచ్ఛకు విఘాతం అనే భావన పౌరుల్లో నెలకొనకుండా సాంకేతికత వినియోగం జరగాలన్నారు. ఐఐటీ మద్రాస్‌ ఆరు దశాబ్దాలకు పైగా పరిశోధనలు, నూతన, సాంకేతిక ఆవిష్కరణలతో దేశాభివృద్ధికి నిరంతరం పాటుపడుతుండటం అభినందనీయమని పేర్కొన్నారు. అన్ని రంగాలకు విస్తరించిన సాంకేతికత, కృత్రిమ మేధను దుర్వినియోగం చేయొద్దని.. అన్నింటికంటే మానవ విలువలు సర్వోన్నతమైనవని సీజేఐ అన్నారు. ‘సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారమ్‌ ఆన్‌లైన్‌ వేధింపులకు వేదిక అవుతున్నది. నైతిక విలువలకు ప్రతీకగా నిలిచే టెక్నాలజీ అమలైనప్పుడు ఆ విలువలను మరింత పెంచుతుందని సీజేఐ తెలిపారు.

నేడు తెలంగాణ హైకోర్టు కొత్త సీజేగా జస్టిస్‌ అలోక్‌ అరాధే ప్రమాణ స్వీకారం

నేడు తెలంగాణ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ అలోక్‌ అరాధే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్‌భవన్‌లో ఉదయం 11 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి అధికార యంత్రాంగం ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేసింది. జస్టిస్‌ అలోక్‌ అరాధేతో గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ ప్రమాణం చేయించనున్నారు. ఈ ప్రొగ్రాంకు సీఎం కేసీఆర్‌తో పాటు హైకోర్టు న్యాయమూర్తులు, పలువురు ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. అయితే, ఇటీవల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతిపై వెళ్లడంతో అతని స్థానంలో జస్టిస్‌ అలోక్‌ అరాధే తెలంగాణకు వచ్చారు.

ఈ మేరకు కొలీజియం సిఫార్సులకు కేంద్ర న్యాయశాఖ గత వారం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు ఏర్పాటైన తర్వాత 6వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ అలోక్‌ పదవి బాధ్యతలు తీసుకుంటున్నారు. అయితే, మధ్యప్రదేశ్‌కు చెందిన జస్టిస్‌ అలోక్‌ అరాధే 1964, ఏప్రిల్‌ 14న రాయ్‌పూర్‌లో జన్మించారు. బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ పూర్తిచేశాక 1988లో న్యాయవాదిగా పని చేశారు. 2007లో సీనియర్‌ న్యాయవాదిగా, ఆ తర్వాత మధ్యప్రదేశ్‌ హైకోర్టులో రాజ్యాంగం, మధ్యవర్తిత్వం, కంపెనీ చట్టాలకు సంబంధించిన కేసులు వాదించారు.

ప్రపంచంలో అత్యంత ఖరీదైన కారు.. తొలిసారి రోడ్డు పైకి

ఈ వరల్డ్ లోనే అత్యంత ఖరీదైన కారు ఏది అంటే మనకు వెంటనే అందరికి గుర్తుకు వచ్చే పేరు రోల్స్ రాయిస్. అయితే, ఈ బ్రాండ్ కార్లు ప్రారంభ ధరలే కోట్ల రూపాయల్లో ఉంటాయి. కాగా గరిష్ట ధరలు ఏకంగా 200 కోట్ల రూపాయల కంటే ఎక్కువ అని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇలాంటి అత్యంత ఖరీదైన కారు దుబాయ్ రోడ్ల మీద మొదటిసారి కనువిందు చేసింది. రోల్స్ రాయిస్ బోట్ టెయిల్ పేరుతో ఈ కారు అందుబాటులో ఉంది. అయితే, ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు కావడం గమనార్హం. ఇప్పటికే బెయోన్స్ అండ్ జే జెడ్ ఈ కారుని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

అయితే, నిజానికి ఈ కారుని ఆవిష్కరించిన తరువాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో కనిపించడం ఇదే తొలిసారి. కాగా కంపెనీ ఇప్పటి వరకు ఈ కార్లను కేవలం మూడు యూనిట్లను మాత్రమే రిలీజ్ చేసింది. నిజానికి ఈ కారు ధర 28 మిలియన్ డాలర్లు.. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం చూస్తే సుమారు రూ. 220 కోట్ల కంటే ఎక్కువ అన్నమాట.