NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

కేటీఆర్ బావమరిది ఫామ్‌హౌస్‌లోనే రేవ్‌పార్టీలా?

రేవ్ పార్టీపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పలు వ్యాఖ్యలు చేసాడు. ఇందులో భాగంగా బామ్మర్థి ఫాంహౌజ్ లోనే రేవ్ పార్టీలా..? డ్రగ్స్ తీసుకుంటూ అడ్డంగా దొరికినా బుకాయిస్తాడేమో.. ‘‘సుద్దపూస‘‘ను కావాలనే తప్పించారనే వార్తలొస్తున్నయని, సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్న డ్రగ్స్ పై రాజీధోరణి ఎందుకని ఆయన అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కాంప్రమైజ్ పొలిటిక్స్ సిగ్గు చేటని, చిత్తశుద్ధి ఉంటే సమగ్ర విచారణ జరపాలని కోరారు. సీసీపుటేజీ సహా ఆధారాలు ధ్వంసం కాకుండా చూడాలని, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాల్సిందే అని ఆయన డిమాండ్ చేసారు. బడా నేతలతోసహా రేవ్ పార్టీలో ఉన్న వాళ్లందరినీ అరెస్ట్ చేయాలని, చట్టం ముందు అందరూ సమానమని నిరూపించేలా చర్యలుండాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

మహిళాభివృద్ధిలో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలువనుంది

నేడు ఖమ్మం సమీకృత కలెక్టర్ కార్యాలయంలో ఇందిర మహిళా శక్తి క్యాంటీన్, బస్సు షెల్టర్, కలెక్టరేట్ సిబ్బంది భోజనశాల, లేడీస్ లాంజ్, స్త్రీ టీ క్యాంటీన్ లను ప్రారంభించారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మహిళాభివృద్ధిలో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలువనుందని, ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఇచ్చి మహిళలను వ్యాపారవేత్తలు గా తీర్చిదిద్దుతామని ఆయన అన్నారు. ఈ ఏడాది మహిళలకు వడ్డీ లేని రుణాలు 25 వేల కోట్ల రూపాయలు పంపిణీ చేయాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ముందుకు పోతుందని ఆయన వ్యాఖ్యానించారు. వచ్చే ఐదు సంవత్సరాల్లో మహిళలకు లక్ష కోట్ల రూపాయల రుణాలు వడ్డీ లేకుండా ఇస్తామని ఆయన అన్నారు.

కడప-హైదరాబాద్‌ ఇండిగో కనెక్టింగ్ విమాన సర్వీసును ప్రారంభించిన మంత్రి

కడప ఎయిర్‌పోర్టులో కడప – హైదరాబాద్ ఇండిగో కనెక్టింగ్ విమాన సర్వీసును రాష్ట్ర రవాణా శాఖా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యేలు పుట్టా సుధాకర్ యాదవ్, చైతన్య రెడ్డితో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఏడాదిగా కడప-హైదారాబాద్ విమాన సర్వీసులు లేవని.. ఎన్నో సార్లు లేఖలు రాసినా ప్రయోజనం లేదన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక హైదరాబాద్ సర్వీసులు పునరుద్ధరించామన్నారు. హైదరాబాద్ కనెక్టివిటీ ద్వారా దేశంలో అన్ని చోట్లకు వెళ్లే సదుపాయం కలుగుతోందన్నారు. ఈ సందర్భంగా కేంద్ర విమాన శాఖ మంత్రికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కడప నుంచి దూర ప్రాంతాలకు కూడా త్వరలో కనెక్టివిటీ పెంచుతామన్నారు. అలానే రైల్వే శాఖలో అభివృద్ధి చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం వచ్చి 120 రోజులు దాటిందని.. విద్యుత్ చార్జీల పెంపుపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలను మంత్రి ఖండించారు. గత ప్రభుత్వ తప్పిదాల వల్లే విద్యుత్ చార్జీల పెంపు.. యూనిట్ 5 నుంచి 7 రూపాయలకు కొనడం వల్లే ఈ భారమని అన్నారు. అనుభవజ్ఞుడైన చంద్ర బాబుకు ప్రజలకు ఏం చేయాలో తెలుసన్నారు. ప్రజలపై కూటమి ప్రభుత్వం ఏ భారం వేయదన్నారు.

రాబోయే నాలుగేళ్లలో హైదరాబాద్ మెట్రో రైల్ రెండవ దశ ప్రాజెక్ట్ పూర్తి?

హైదరాబాద్ మెట్రో రైల్ రెండవ దశ ప్రాజెక్ట్ కు లైన్ క్లియర్ అయింది. సిటీ విస్తరిస్తున్న కొద్దీ ట్రాఫిక్ రద్దీ పెరగటంతో ఇప్పుడున్న మెట్రోను ఇతర మార్గాలకు విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. అందుకు సంబంధించిన డీపీఆర్ కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా రూ.24269 కోట్ల అంచనాలతో చేపట్టే మెట్రో రెండో దశకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం రాగానే పనులు మొదలు పెట్టి రాబోయే నాలుగు సంవత్సరాలలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకుంది. హైదరాబాద్ మెట్రో రైల్ మొదటి దశలో మూడు కారిడార్లలో 69 కిలోమీటర్లు విజయవంతంగా సేవలందిస్తోంది. ఈ ప్రాజెక్టును ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో రూ.22,000 కోట్లతో నిర్మించారు.

ఢిల్లీలో చైనీస్ మొబైల్ జామర్ల రికవరీ.. భద్రతా సంస్థలు అప్రమత్తం

ఢిల్లీలోని పాలికా బజార్‌లోని ఓ దుకాణంలో రెండు చైనీస్ మొబైల్ జామర్‌లు స్వాధీనం చేసుకోవడంతో కలకలం రేగింది. ఈ జామర్ల సామర్థ్యం 50 మీటర్లు. ఈ సంఘటనపై షాపు యజమాని రవి మాథుర్‌ను అరెస్టు చేశారు. ఈ జామర్‌ను లజ్‌పత్‌రాయ్‌ మార్కెట్‌ నుంచి రూ.25 వేలకు కొనుగోలు చేసినట్లు రవి తెలిపాడు. ఎక్కువ ధరకు అమ్మేందుకు తీసుకొచ్చినట్లు పేర్కొన్నాడు. ఈ రకమైన జామర్‌ను విక్రయించడానికి, లైసెన్స్, పలు పత్రాలు అవసరం. దుకాణదారుడి వద్ద ఎలాంటి పత్రాలు లేవు. అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించాడు.

సదర్ అంటే యాదవుల ఖదర్..

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియంలో నిర్వహించిన సదర్ సమ్మేళనంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ నగర అభివృద్ధిలో యాదవ సోదరుల పాత్ర కాదనలేనిదని, నగరంలో సదర్ ఉత్సవాలు నిర్వహించడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. సదర్ సమ్మేళనం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని నేను ఆనాడే చెప్పా అని, ఇక నుంచి ప్రతీ ఏటా సదర్ సమ్మేళనం అధికారికంగా నిర్వహించాలని.. ఈ వేదిక నుంచి అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా అన్నారు రేవంత్‌ రెడ్డి. సదర్ అంటే యాదవుల ఖదర్ అని, సదర్ సమ్మేళనాన్ని ప్రతీ గ్రామానికి తీసుకెళ్లాలన్నారు. యాదవులు రాకీయంగా ఎదగాలని అనిల్ కుమార్ యాదవ్ ను రాజ్యసభకు పంపించామని, రాబోయే రోజుల్లో రాజకీయాల్లో యాదవ సోదరులకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు. హైదరాబాద్ నగరంలో యాదవ సోదరులు పశు సంపదను పెంచి పోషించారని, ఆనాడు మూసీ పరివాహక ప్రాంతాల్లో యాదవ సోదరులు పశుగ్రాసాన్ని పెంచుకునేవారని సీఎం రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

TGSP సిబ్బంది పట్ల ఇది అణచివేత చర్య

తెలంగాణ స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ) సిబ్బందిపై తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న కఠిన, నిరంకుశ చర్యలను బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఆదివారం తీవ్రంగా ఖండించారు. తమ ఫిర్యాదులను శాంతియుతంగా లేవనెత్తినందుకు 39 మంది పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేయడం స్పష్టమైన అణచివేత చర్య , వారి గౌరవం , రాజ్యాంగ హక్కులపై దాడి అని ఆయన అన్నారు. ఈ సిబ్బందిపై విధించిన అమానవీయ పని పరిస్థితులపై శ్రవణ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు, ఇది వారిని కూలీల వలె పని చేయడానికి బలవంతం చేస్తుంది, ఎక్కువ కాలం వారి కుటుంబాల నుండి వారిని దూరంగా ఉంచుతుంది , వారికి ప్రాథమిక సెలవులను నిరాకరించింది.

జగన్ మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఉండటానికి అర్హుడు కాదు..

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పాలకొల్లులో ఆయన మాట్లాడుతూ.. అక్రమ ఆస్తులు కోసం తల్లిని చెల్లిని కోర్టుకు ఈడ్చిన మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఉండటానికి అర్హుడు కాదని ఆరోపించారు. 2004 ఎన్నికల అఫిడివిట్‌లో లక్షల్లో సంపాదన, జూబ్లీహిల్స్‌లో చిన్న ఇల్లు చూపించిన జగన్.. ముఖ్యమంత్రి అయిన తర్వాత రూ. 8 లక్షల కోట్లు ఆస్తిని సంపాదించడం అక్రమం కాదా అని ప్రశ్నించారు.

సస్పెండ్‌ను నిరసిస్తూ 12వ బెటాలియన్‌ కానిస్టేబుళ్లు నిరసన

తెలంగాణ అదనపు డైరెక్టర్ జనరల్ పోలీసులు (ఏడీజీపీ) తమ సహోద్యోగులలో 39 మందిని సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ 12వ బెటాలియన్‌కు చెందిన తెలంగాణ స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ) కానిస్టేబుళ్లు నిరసన తెలిపారు. సస్పెండ్ చేసిన తమ సహోద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 27 ఆదివారం నల్గొండ జిల్లాలో నిరసన కార్యక్రమం జరిగింది. తమ ఫిర్యాదులను అధికారులు పరిష్కరించడం లేదని భావించిన పోలీసు యంత్రాంగంలో పెరుగుతున్న అసంతృప్తిని ఈ నిరసన హైలైట్ చేసింది. తమ డిమాండ్లను నెరవేర్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని కానిస్టేబుళ్లు ప్రకటించారు. 39 మంది టీజీఎస్పీ పోలీసు కానిస్టేబుళ్లను దురుసుగా ప్రవర్తించడం, ప్రేరేపించడం వంటి ఆరోపణలపై సస్పెండ్ చేశారు.