NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

హైదరాబాద్‌లోని బస్సులు, రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ..

దసరా పండుగ సందర్భంగా హైదరాబాద్ సందడిగా మారింది. తెలంగాణ రాష్ట్రం నుంచి దసరాకు వెళ్లే ప్రయాణికులు ఇంటి బాట పడతుండటంతో బస్సులు, రైల్వే స్టేషన్లలో రద్దీ పెరిగింది. శనివారం వచ్చే విజయదశమికి మరికొన్ని రోజులు మాత్రమే ఉండడంతో హైదరాబాద్‌లోని అన్ని బస్సులు, రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల సందడి నెలకొంది. హైదరాబాద్ నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల కొన్ని జిల్లాలకు ప్రజల భారీ తరలివెళుతున్నారు. ప్రతి ఒక్కరూ శనివారం లోపు వారి స్వగ్రామాలకు వెళ్లి వారి వారి కుటుంబాలతో గడిపేందుకు బయలు దేరారు. సికింద్రాబాద్‌లోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (ఎంజిబిఎస్), జూబ్లీ బస్ స్టేషన్ (జెబిఎస్) వంటి ప్రధాన బస్ స్టేషన్‌లు రిజర్వ్ చేసిన టిక్కెట్‌లతో చేరుకునే వారి సంఖ్య పెరిగింది. సికింద్రాబాద్‌, నాంపల్లి, కాచిగూడ, లింగంపల్లి రైల్వేస్టేషన్‌లు అన్ని ప్రయాణికులతో సందడిగా మారాయి.

ఇన్‌స్టాగ్రామ్‌ సేవల్లో అంతరాయం.. ఎక్స్‌లో ఫిర్యాదులు!

ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ‘ఇన్‌స్టాగ్రామ్‌’ సేవల్లో అంతరాయం ఏర్పడింది. సాంకేతిక సమస్యల కారణంగా దేశవ్యాప్తంగా చాలా మంది వినియోగదారులు ఇన్‌స్టా సేవల్లో సమస్యలు ఎదుర్కొన్నారు. ఈరోజు ఉదయం 11:15 గంటల సమయంలో అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. అప్లికేషన్‌ లాగిన్‌, సర్వర్‌ కనెక్షన్‌కు సంబంధించిన సేవలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. డౌన్‌ డిటెక్టర్‌ వెబ్‌సైట్‌ ప్రకారం… 64 శాతం మంది యూజర్లు యాప్‌లోకి లాగిన్‌ అవ్వడంలో సమస్యలు ఎదుర్కొన్నారు. 24 శాతం మంది వినియోగదారులు సర్వర్‌ కనెక్షన్‌లో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తమకు కలిగిన అంతరాయాన్ని పలువురు ఇన్‌స్టా యూజర్లు.. మరో సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ‘ఎక్స్‌’ ద్వారా పంచుకున్నారు. కొందరికి స్క్రీన్‌పై ‘సమ్‌ థింగ్‌ వెంట్‌ రాంగ్‌’ వంటి మెసేజ్‌లు వచ్చాయి. దీంతో కొందరు యూజర్లు తమ అకౌంట్ ఏమైనా హ్యాక్ అయిందా? అని ఆందోళన పడ్డారు. మరికొందరు యూజర్లు అయితే ఏకంగా యాప్‌ను అన్ ఇన్‌స్టాల్ చేసి.. రీ ఇన్‌స్టాల్ చేశారట.

కలెక్టర్లతో డిప్యూటీ సీఎం పవన్‌ వీడియో కాన్ఫరెన్స్‌.. ‘పల్లె పండుగ’పై కీలక సూచనలు..

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.. రాష్ట్ర సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తుంచిన ఆయన.. వివిధ జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడారు.. ఈ నెల 14వ తేదీ నుంచి రాష్ర్టంలోని పంచాయతీల్లో నిర్వహించే ‘పల్లె పండుగ’ కార్యక్రమంపై కీలక సూచనలు చేశారు..

రెండు రోజుల పాటు లావోస్ పర్యటనకు ప్రధాని మోడీ..

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల పాటు లావోస్‌ పర్యటనకు వెళ్లబోతున్నారు. అక్టోబర్ 10, 11 తేదీల్లో ఆయన లావోస్‌లో పర్యటించనున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ సందర్భంగా మోడీ 21వ ఆసియాన్- ఇండియా సమ్మిట్.. 19వ ఈస్ట్‌ ఏషియా సదస్సులో పాల్గోనున్నారు. ప్రస్తుతం ఆసియాన్-ఇండియాకు లావోస్‌ అధ్యక్షతగా బాధ్యత వహిస్తుంది. కాగా, ఈ సదస్సుల్లోనే భారత్‌ వివిధ దేశాలతో భాగస్వామ్య ప్రాంతీయ ప్రాముఖ్యం కలిగిన అంశాలపై చర్చించే ఛాన్స్ ఉందని విదేశాంగ మంత్రిత్వశాఖ చెప్పుకొచ్చింది. ఈ శిఖరాగ్ర సమావేశాల్లో భాగంగా నరేంద్ర మోడీ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక విషయాలకు సంబంధించిన సమావేశాల్లోనూ పాల్గోనున్నారు. యాక్ట్ ఈస్ట్ పాలసీ భారతదేశంలో వచ్చి దశాబ్దకాలం అవుతోంది. ఈ పాలసీ ఇండో-పసిఫిక్ అభివృద్ధికి కీలకమని విదేశాంగ శాఖ వెల్లడించింది.

చెరువులు, మూసీ పరిస్థితిపై చర్చకు సిద్ధమా..?

చెరువులు, మూసీ పరిస్థితిపై చర్చకు సిద్ధమా..? అని మాజీమంత్రి ఎమ్మెల్యే జి .జగదీష్ రెడ్డి సవాల్ విసిరారు. హైడ్రా,మూసీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆగ్రహానికి గురి అయిందన్నారు. బడే భాయ్ నోట్ల రద్దుతో ఏం తప్పు చేశారో ఇక్కడ చోటా భాయ్ హైడ్రా విషయంలో తప్పు చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు. నల్లధనం బయటకు తెస్తానని మోడీ 2014 ఎన్నికల ప్రచారంలో చెప్పారన్నారు. నోట్ల రద్దు దేశ ఆర్థిక రంగాన్ని నాశనం చేసిందన్నారు. హైడ్రా ఎవరి మీద కక్షతో తెరపైకి తెచ్చారన్నారు. ఢిల్లీకి కప్పం కట్టేందుకు మూసీ సుందరీకరణ అంటున్నారని తెలిపారు. మూసీ సుందరీకరణ ఎవరి కోసమో చెప్పాలన్నారు. రేవంత్ రెడ్డి తాబేదార్ల కోసం హైడ్రా,మూసీ వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. లక్షా 50 వేల కోట్లు అని ఎవరు చెప్పారని డిప్యూటీ సీఎం అంటున్నారన్నారు. మూసీ సుందరీకరణపై మంత్రివర్గంలో చర్చ జరిగిందా? అని ప్రశ్నించారు. చర్చకు భట్టి విక్రమార్క సిద్ధమా? అన్నారు.

సమాజం కోసం, దేశం కోసం.. పవన్ కల్యాణ్ నిర్ణయాలు

స్వర్ణాంధ్ర 2047 ప్రణాళిక కోసం ప్రజల భాగస్వామ్యం కోసం అభిప్రాయ సేకరణ చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. యాభై వేల ప్రజల నుంచి విభిన్న ఆలోచనలతో అభిప్రాయ సేకరణ జరిగిందని వెల్లడించారు. రాజధాని ప్రాంతంలోని గుంటూరు జిల్లాలో యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. కమర్షియల్ క్రాప్స్ పండించే రైతన్నకు భరోసాగా ఈ ప్రభుత్వం ఉంటుందని హామీ ఇచ్చారు. నేషనల్ హ్యాండ్లూమ్ క్లస్టర్లు ఏర్పాటు చేసి నేతన్నకు అండగా ఉంటామన్నారు. మిగతా జిల్లాల కన్నా మెరుగైన ఫలితాలు సాధిస్తామని మంత్రి తెలిపారు. కలిసి కట్టుగా చేసే అభివృద్ధితో రాష్ట్రం వికశించేలా ప్రణాళికలు చేస్తున్నామని స్పష్టం చేశారు.

తెలంగాణలో కులగణన విధివిధానాలపై కసరత్తు

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కుల గణన చేయడానికి వేగంగా అడుగులు ముందుకు పడుతున్నాయి. కుల గణన పై షెడ్యూల్ ఖరారు చేయడానికి రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో సెక్రటేరియట్ లోని వారి ఛాంబర్ లో కీలక సమావేశం జరిగింది. సమావేశంలో బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ తో పాటు ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి,బీసీ కమిషన్ సభ్యులు , సభ్యులు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

విజయం తర్వాత మొదటిసారి స్పందించిన వినేష్ ఫోగట్..

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో జులనా స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి వినేష్ ఫోగట్ విజయం సాధించారు. వినేష్ ఫోగట్ 6015 ఓట్లతో గెలుపొందారు. వినేష్‌కి మొత్తం 65080 ఓట్లు వచ్చాయి. సమీప ప్రత్యర్థి యోగేష్ కుమార్‌కు 59065 ఓట్లు వచ్చాయి. తన విజయంపై వినేష్ ఫోగట్ మొదటిసారి స్పందించింది. ‘ఇది ఎల్లప్పుడూ పోరాట మార్గాన్ని ఎంచుకునే ప్రతి అమ్మాయి, మహిళ యొక్క పోరాటం. ఈ దేశం నాకిచ్చిన ప్రేమను ఎప్పటికీ నిలబెట్టుకుంటాను. అన్ని సీట్ల ఫలితాలు ఇంకా స్పష్టంగా తెలిసేంత వరకు వేచి ఉండండి. ఇంకా ఏమీ క్లారిటీ లేదు.. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది’. అని తెలిపారు.

విద్యుత్ సిబ్బంది, అధికారులు పొలం బాట పట్టాలి

ఒక్క నిమిషం కూడా పవర్ పోకుండా చూస్తున్నామని, రైతులకి సోలార్ సిస్టం కూడా అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర అభివృద్ధి లో కరెంట్ పాత్ర చాలా ముఖ్యమైనదని, విద్యుత్ సిబ్బంది అధికారుల పాత్ర చాలా ప్రాధాన్యత వుంటుందన్నారు భట్టి విక్రమార్క. వ్యవసాయ పంపు సెట్ల ను నెలరోజుల్లోనే ఇస్తానని ఆయన తెలిపారు. అంతేకాకుండా.. విద్యుత్ సిబ్బంది అధికారులు పొలం బాట పట్టాలని, ఇక్కడ విద్యుత్ సమస్య రాకుండా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు.

మంత్రి అసభ్యంగా మాట్లాడారు..క్రిమినల్ చర్యలు తీసుకోవాలి!

నాగార్జున పిటిషన్‌పై నాంపల్లి కోర్టు విచారణ జరుగుతోంది. నాంపల్లి కోర్టుకు సినీ నటుడు నాగార్జున హాజరు కాగా నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మూలం రికార్డ్ చేస్తోంది కోర్టు.. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై కోర్టును నాగార్జున ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కొండ సురేఖపై నాగార్జున పరువు నష్టం దావా వేయగా ఈ రోజు కోర్టులో హాజరై స్టేట్మెంట్ ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ క్రమంలో నాగార్జున వెంట అమ‌ల‌, నాగ‌చైత‌న్య‌, యార్ల‌గ‌డ్డ సుప్రియ‌ కూడా కోర్టుకు హాజరయ్యారు. నేరుగా తన స్టేట్ మెంట్ ఇస్తున్నారు నాగార్జున. దేని కోసం పిటిషన్ ఫైల్ చేసారని నాగార్జునను కోర్టు ప్రశ్నించగా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల వల్ల త‌మ‌ కుటుంబ పరువు మర్యాదలకు భంగం క‌లిగిందని, త‌న కుమారుడు నాగచైతన్య, సమంత విడాకుల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేశారని నాగార్జున‌ అన్నారు.