Site icon NTV Telugu

Top Headlines @1PM : టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

వీఐపీల సైరన్‌లో కొత్త శబ్ధం.. భారతీయ సంగీతం ఏర్పాటు

వీఐపీల సైరన్‌లకు కేంద్రం స్వస్థి పలకాలని భావిస్తోంది. ప్రస్తుతం కొనసాగిస్తున్న వీఐపీల సైరన్‌ మూలంగా శబ్ధ కాలుష్యం ఎక్కువగా అవుతోందని.. అందుకే వాటి స్థానంలో కొత్త సౌండ్స్ ను ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తోంది. అటువంటి విధానాన్ని రూపొందిస్తున్నట్టు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న వీఐపీ సంస్కృతిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కొత్త ప్రణాళిక గురించి కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. శబ్ధ కాలుష్యాన్ని తగ్గించే వీఐపీ వాహనాలపై పెద్ద శబ్దంతో కూడిన సైరన్‌ల స్థానంలో ఓదార్పు సౌండ్‌లను అమర్చాలని ప్రభుత్వం యోచిస్తోంది. సైరన్ శబ్దాల స్థానంలో వేణువు, తబలా మరియు శంఖ్ వంటి భారతీయ సంగీత వాయిద్యాల ధ్వనితో కొత్త విధానాన్ని రూపొందిస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. మంత్రులు, వీఐపీల వాహనాలకు ప్రోటోకాల్‌లో భాగంగా సైరన్‌ ఉంటుంది. రోడ్లపై సైరన్‌ మోతతో వాహనాలు వెళుతుంటే.. అందులో ఎవరో వీఐపీ వెళుతున్నారని, పోలీసులు ట్రాఫిక్‌ క్లియర్‌ చేస్తారు. కానీ, ఈ సైరన్‌ను కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. మరికొందరు అనుమతి లేకుండా తమ వాహనాలకు సైరన్‌లు ఏర్పాటు చేస్తున్నారు.

మెట్రో బంపరాఫర్.. రూ. 59తో అపరిమిత ప్రయాణం..

హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇటీవలి కాలంలో మెట్రోలో రద్దీ విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. వేసవిలోనూ భారీ సంఖ్యలో ప్రయాణికులు మెట్రోను ఆశ్రయించారు. ఎక్కువ మంది ప్రయాణికులను ఆకర్షించేందుకు మెట్రో రైల్ యాజమాన్యం మరో కొత్త ఆఫర్ తీసుకొచ్చింది. భారతదేశ 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు సూపర్ సేవర్ ఫ్రీడమ్ ఆఫర్ పేరుతో ప్రత్యేక ప్రయోజనాన్ని అందిస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవ వారాంతంలో ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరచడానికి ఈ ఆఫర్ అందుబాటులోకి వచ్చింది.

నేడు విద్యా శాఖ పై సీఎం జగన్ సమీక్ష

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో విద్యాశాఖపై సమీక్ష చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధిత శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో స్కూల్స్‌ ప్రారంభానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. నాడు-నేడు పనుల పురోగతి, విద్యాకానుక, అమ్మ ఒడి అమలుపై చర్చించనున్నారు సీఎం జగన్‌. ఉదయం 11 గంటలకు తాడేపల్లి కార్యాలయంలో ఈ సమావేశం ప్రారంభంకానుంది. ఇదిలా ఉంటే.. గత నాలుగు రోజుల క్రితం.. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, కేంద్ర సహకార బ్యాంకులపై ముఖ్యమంత్రి జగన్‌ సమీక్ష నిర్వహించారు.

అప్పుల కుప్పగా దేశం.. 9 ఏళ్లల్లో రూ. 100 లక్షల కోట్లు

దేశ ఆర్థిక పరిస్థితి దిన దిన గండం.. నూరేళ్ల ఆయుష్షుగా కొనసాగుతోంది. ఇండియా చేస్తున్న అప్పుల విలువ రోజు రోజుకు పెరిగిపోతోంది. నరేంద్ర మోడీ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత అప్పులు విపరీతంగా పెరిగిపోయాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దేశంలో గత 9 ఏళ్ల కాలంలో రూ. 100 లక్షల కోట్ల అప్పు చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 67 ఏళ్లల్లో చేసిన దానికంటే ఇది ఎక్కువగా ఉందని ఆర్థికరంగ నిపుణులు చెబుతున్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో అప్పులు పెరిగిపోయాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాష్ర్టాలు పరిమితికి మించి అప్పులు చేస్తున్నాయని పదే పదే చెబుతున్న కేంద్రం… తాను మాత్రం విచ్చలవిడిగా అప్పులు చేస్తోందని విమర్శిస్తున్నాయి.

వాతావరణశాఖ కీలక అప్టేట్.. నేటి నుంచి వచ్చే మూడ్రోజులు వర్షాలే

తెలంగాణలో గత 15 రోజులుగా వర్షాలు లేవు. సాధారణంగా జూలై, ఆగస్టు నెలల్లో వర్షాలు బాగా కురుస్తాయి. ఆ రెండు నెలలు రైతులకు చాలా కీలకం. కాయలు పెరిగే కొద్దీ వర్షాలు అవసరం. అయితే జూలై చివరి వారంలో వర్షాలు కురిశాయి. అయితే గత 15 రోజులుగా అక్కడక్కడా చెదురుమదురు జల్లులు తప్ప భారీ వర్షాలు కురవలేదు. తాజాగా, రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై భారత వాతావరణ శాఖ ఒక ముఖ్యమైన అప్‌డేట్ ఇచ్చింది. నేటి నుంచి మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్‌లో శనివారం వాతావరణం చల్లబడింది. ఇటీవలి కాలంలో ఎండలకు కాస్త ఉలిక్కిపడిన నగర ప్రజలకు వర్షంతో కాస్త ఊరట లభించింది. ఎస్ఆర్ నగర్, కూకట్ పల్లి, నిజాంపేట్, ప్రగతినగర్, మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట, నాంపల్లి, బషీర్ బాగ్, ఖైరతాబాద్, బేగంబజార్, చిక్కడపల్లి, బాగ్ లింగంపల్లి, ముషీరాబాద్, ఆర్టీసీ నగర్ క్రాస్ రోడ్, అశోకాపోల్, అశోకాపోల్. నగర్, అబిడ్స్, కోఠి, లోయర్ ట్యాంక్ బండ్, హబ్సిగూడ, రామాంతపూర్, ఉప్పల్, జీడిమెట్ల, కొంపల్లి, సూరారం, షాపూర్ నగర్, కుత్బుల్లాపూర్, చింతల్, జగద్గిరిగుట్ట, సరూర్ నగర్, కొత్తపేట, దిల్ సుఖ్ నగర్, చైతన్యపురి, ఎల్బీ నగర్, నాగోల్, వనస్థలిపురం ఇతర ప్రాంతాలు వర్షం అందుకుంది. రోడ్డుపై వర్షపు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

నేడు భూమన అధ్యక్షతన టీటీడీ బోర్డు సమావేశం

తిరుమల తిరుపతి దేవస్థానం నూతన చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి ఆధ్వర్యంలో నేడు టీటీడీ బోర్టు హైలెవల్‌ కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశంలో యాత్రికుల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. అయితే.. ఈ సమావేశంలో అటవీ శాఖ అధికారులు, టీటీడీ ఈవో ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకట రమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వర రెడ్డి, టీటీడీ సీవీ అండ్ ఎస్వోతో పాటు మరికొంత మంది అధికారులు పాల్గొననున్నారు. ప్రధానంగా..నడకదారి భక్తుల భద్రతకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ సమావేశంలో చర్చించనుంది టీటీడీ బోర్డు. దర్శన టోకెన్ కోసం నడకదారిన వచ్చే భక్తుల ఇక్కట్లు తొలగించాలని భావిస్తోన్న టీటీడీ.. నడకదారి భక్తులకు జారి చేసే దర్శన టోకెన్ల విధానాన్ని రద్దు చేసి.. సర్వదర్శన టోకన్లు పెంచే యోచనలో టీటీడీ ఉన్నట్లు సమాచారం. సర్వదర్శనం భక్తులకు ప్రస్తుతం జారీ చేస్తున్న 15 వేల టోకెన్ల సంఖ్యను 30 వేలకు పెంచే అవకాశముంది. వీటన్నింటితో పాటు… మరికొన్ని కీలక నిర్ణయాలను సమావేశం అనంతరం వెల్లడించే అవకాశం కనిపిస్తోంది..

రూ.300 కోట్ల క్లబ్ లోకి చేరనున్న జైలర్..

అత్యంత వేగంగా రూ.300 మార్కును అందుకున్న తమిళ చిత్రంగా జైలర్ రెండో స్థానంలో నిలవగా, నాలుగు రోజుల్లో రూ.400 కోట్లు రాబట్టిన 2.o చిత్రంతో రజనీకాంత్ మొదటి స్థానంలో నిలిచారు.. అభిమానుల సందడి మధ్య గురువారం విడుదలైన జైలర్ తొలిరోజు రూ.48.35 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. శుక్రవారం ఈ సినిమా రూ.25.75 కోట్లు రాబట్టగా, శనివారం రూ.35 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ అగ్రిగేటర్ సక్నిల్క్ పేర్కొంది. 4వ రోజు ఈ చిత్రం వెబ్‌సైట్ ప్రకారం రూ.38 కోట్లు రాబట్టింది. ఈ చిత్రం యొక్క గ్రాస్ ఇండియన్ కలెక్షన్ 127 కోట్లుగా అంచనా వేయబడింది.

గోదావరి ఎక్స్ ప్రెస్ రైల్లో ఎలుక కలకలం

గోదావరి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లో ఎలుక కలకలం సృష్టించింది. ట్రైన్ నంబర్ 12728 హైదరాబాద్‌ నుంచి వైజాగ్ వస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌ రైలు 3rd AC కోచ్‌ B4లో క్యాబిన్ కంట్రోల్ ప్యానెల్‌లోకి ఎలుక దూరడం తో పొగలు వచ్చాయి. ఈ ఘటన ఆదివారం రాత్రి 10.15 గంటల సమయంలో ఖమ్మం విజయవాడ మధ్యలో బోనకల్ స్టేషన్ దగ్గర ఈ ఘటన జరిగింది. దాంతో ఒక్క సారిగా రైలు నిలిపేశారు. సుమారు 20 నిమిషాల పాటు రైల్వే సిబ్బంది, ప్రయాణికుల్లో టెన్షన్ నెలకొంది. ఎలుకను బయటకు తీసిన తర్వాత రైలు తిరిగి బయలు దేరింది.

నర్సు నిర్లక్ష్యం.. జర్వం వచ్చిన చిన్నారికి రేబిస్ వ్యాక్సిన్

ఆరోగ్యం బాగా లేకపోతే ఆసుపత్రికి వెళ్లి చూపించుకుంటాము. ఆసుపత్రికి వెళ్లగానే చికిత్స చేసే ముందు వైద్యులు గానీ, లేదా నర్సులు గానీ ఏమైందని అడుగుతారు.. రోగి చెప్పే దాన్నిబట్టి రోగికి చికిత్సను అందిస్తారు. అయితే ఒక్కోసారి ఏమరుపాటుతో డాక్టర్లు రోగికి సంబంధించిన రోగానికి కాకుండా ఇతర చికిత్సలను చేస్తుంటారు. ఇటువంటివి అరుదుగా జరుగుతుంటాయి.. కొన్నిసందర్భాల్లో నిర్లక్ష్యంతోనూ జరుగుతుంటాయి. కేరళలోనూ అలాగే నర్సు నిర్లక్ష్యంగా వ్యవహారించింది. దీంతో చిన్నారికి సీరియస్‌ అయింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది.

బోరబండలో రౌడీ షీటర్ దారుణ హత్య..!

హైదరాబాద్ సనత్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని బోరబండలో ఫిరోజ్ అనే ఒక రౌడీ షీటర్ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే.. తెల్లవారు జామున కళ్లల్లో కారం కొట్టి కతులతో కిరాతకంగా హత్య చేసిన ఘటన 2021లో సంచలన సృష్టించింది. అయితే ఇప్పుడు మళ్లీ బోరబండలోనే నదీమ్‌ అనే రౌడీ షీటర్‌ ను అతికిరాతకంగా హత్య చేసారు గుర్తు తెలియని వ్యక్తులు. నదీమ్‌ ను విగత జీవిగా చూసిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు హుటాహుటిన హత్యకు గురైన ఫిరోజ్‌ ఇంటికి వెళ్లారు. నదీమ్‌ కు కొందరు ప్రత్యర్థులే హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా నదీమ్‌ పై ఆగంతకు దాడికి ప్రయత్నించారని కుటుంబ సభ్యులు పోలీసులకు సమచారం అందించారు.

ఈ సారి పంద్రాగస్టుకు సామాన్యులే చీఫ్ గెస్టులు.. 1800 మందిని ఆహ్వానించిన కేంద్రం

ప్రతి ఏడాది స్వాతంత్ర్య దినోత్సవానికి వేరే దేశాలకు చెందిన అధ్యక్షులు, ప్రధానమంత్రులను ముఖ్య అతిధులుగా ఆహ్వానించలేదు. దేశంలోని సామాన్యులనే చీప్‌గెస్టులుగా పిలవాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పటికే సుమారు 1800 మంది వరకు ఆహ్వానాలను సైతం కేంద్ర ప్రభుత్వం పంపించింది. రేపు ఢిల్లీలో జరిగే 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సామాన్యులే చీప్‌గెస్టులుగా హాజరవుతున్నారు. వివిధ రంగాల్లో ఉన్న వారిని ముఖ్య అతిధులుగా పిలిచారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 76 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను రేపు ఘనంగా నిర్వహించనున్నారు.

నగరంలో జింక మాంసం విక్రయం.. రంగారెడ్డి, నల్గొండకు వాసులు అరెస్ట్..!

హైదరాబాద్ నగరంలో జింకలు, దుప్పి మాంసం విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. శబ్దం కాకుండా మాంసం విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. వివరాల్లోకి వెళితే..శంషాబాద్ ఎయిర్ పోర్టు పోలీస్ స్టేషన్ పరిధిలోని గగన్ పహాడ్ లో ఎస్ ఓటీ పోలీసులు తనిఖీలు చేపట్టారు. కొందరు దుండగులు జింకలు, దుప్పుల మాంసాన్ని అక్రమంగా విక్రయిస్తున్నారనే సమాచారంతో సీఐ సత్యనారాయణగౌడ్ ఆధ్వర్యంలో తెల్లవారుజామున దాడులు నిర్వహించారు.

నేడు తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ భేటీ.. అభ్యర్థుల ఎంపికపై చర్చ..

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ వేడి రాజుకుంటోంది. ఈ క్రమంలో అన్ని పార్టీలు తమ వ్యూహాలు, ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే అధికార బీఆర్‌ఎస్ ప్రతిపక్ష పార్టీలకు అవకాశం ఇవ్వకుండా గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంతోపాటు ప్రజాభిమానం పొందేందుకు కొత్త సంక్షేమ పథకాలను కూడా ప్రవేశపెడుతోంది. హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ తనదైన శైలి వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. విపక్షాలు కూడా తమకేమీ తక్కువ కాదన్నట్లుగా ఈసారి ఎలాగైనా గెలవాలని ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో శాసన సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు ముమ్మరం చేసింది.

తిరుమల శ్రీవారిమెట్టు నడకమార్గంలో ఎలుగుబండి హల్‌చల్‌

శ్రీవారి దర్శనార్థం తిరుమలకు మెట్టుమార్గంలో వెళ్తున్న భక్తులను వన్యప్రాణాలు హడలెత్తిస్తున్నాయి. గత కొన్ని రోజలు క్రితం కౌశిక్‌ అనే బాలుడిపై చిరుత దాడి చేయగా.. ఇటీవల లక్షిత అనే బాలికపై చిరుత దాడి చంపిన ఘటనలు భక్తులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. అయితే.. భక్తులను సంరక్షించేందుకు రంగంలోకి దిగి అటవీశాఖ మెట్టుమార్గంలో సంచరిస్తున్న చిరుత పులిని పట్టుకునేందుక బోను ఏర్పాటు చేయడంతో.. ఈ రోజు ఉదయం బోను చిరుత చిక్కింది. అయితే.. దీంతో ఊపిరి పీల్చుకున్న అధికారులకు మరోసవాల్‌ ఎదురైంది. అదే ఎలుగుబంటి.. సోమవారం ఉదయం మెట్టు మార్గంలోని 2వేల మెట్టు వద్ద ఎలుగుబంటి తారసపడటంతో భక్తులు బెంబెలెత్తిపోయారు. భక్తులను అధికారులను అప్రమత్తం చేయడంతో ఎలుగుబంటి అడవిలోకి వెళ్లిపోయింది. ఈ ఘటనతో అటవీశాఖ, టీటీడీ భద్రతా సిబ్బంది మెట్టుమార్గంలో గస్తీ ముమ్మరం చేశారు.

హవాయి దీవుల కార్చి చ్చులో 100కి చేరిన మృతులు.. 2200 భవనాలు నాశనం

అమెరికాలోని హవాయి దీవుల్లో చెలరేగిన కార్చిచ్చులో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఆదివారం వరకే 100 మందికిపైగా మృతి చెందినట్టు అమెరికా అధికారిక వర్గాలు ప్రకటించాయి. కార్చిచ్చుతో వేలాది మంది ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులుగా మిగిలారు. సుమారు 2200 పైగా భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కార్చిచ్చు నివారణలో ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదని ప్రతిపక్షాలు విమర్శించాయి. శవాల కోసం శవ కుక్కలతో రికవరీ సిబ్బంది వందలాది గృహాలల్లో పరిశీలన చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. లహైనాలో వాహనాలను తగలబడటం వల్ల ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

 

Exit mobile version