*ఎన్నికలకు తొలి నోటిఫికేషన్ విడుదల.. నేటి నుంచే నామినేషన్లు
2024 లోక్సభ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. తొలి దశలో 102 లోక్సభ స్థానాలకు ఈరోజు నోటిఫికేషన్ విడుదలైంది. ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్ సహా 21 రాష్ట్రాల నుంచి 102 లోక్సభ స్థానాలకు అభ్యర్థులు నేటి నుంచి నామినేషన్లు దాఖలు చేయనున్నారు. 9 లోక్సభ స్థానాలున్న ఈశాన్య రాష్ట్రాల్లోని ఆరు రాష్ట్రాలు. దక్షిణ భారతదేశంలోని తమిళనాడులోని మొత్తం 39 స్థానాలు, లక్షద్వీప్లోని ఒక లోక్సభ స్థానం మొదటి దశకు సిద్ధంగా ఉన్నాయి. తొలి దశలో ఏప్రిల్ 19న 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటింగ్ జరగనుంది. 21 రాష్ట్రాల్లోని 102 స్థానాల్లో తొలి దశ లోక్సభ ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా, బీహార్లో నామినేషన్ దాఖలుకు మార్చి 28 చివరి తేదీ. ఇది కాకుండా, మిగిలిన 20 రాష్ట్రాల్లో మార్చి 27 వరకు నామినేషన్లు వేయవచ్చు. నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 30 తేదీ. బీహార్లో ఏప్రిల్ 2 వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. మొదటి దశలో మొత్తం 102 లోక్సభ స్థానాలకు ఏప్రిల్ 19న ఒకేసారి పోలింగ్ జరగనుండగా, జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి.
*చంద్రబాబు రాజకీయ వికలాంగుడు..
వైసీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి సిద్ధం అయ్యారు. ఈ నెల 27వ తేదీ నుంచి ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సుయాత్ర ద్వారా తొలి విడత ఎన్నికల ప్రచారం ప్రారంభించబోతున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 28న నంద్యాలలో, 29న ఎమ్మిగనూరులో ‘మేమంతా సిద్ధం’ సభలు నిర్వహించనున్నామని మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. ఐదేళ్లలో అమలు చేసిన పథకాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు వివరిస్తారన్నారు. మేమంతా సిద్ధం సభ సక్సెస్ అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పొత్తులు లేకుండా చంద్రబాబు నిలబడలేడన్న పెద్దిరెడ్డి.. చంద్రబాబు ఓ రాజకీయ వికలాంగుడు అంటూ ఎద్దేవా చేశారు. పొత్తులను ముందుగా ఊహించిందే.. ఇంకా అధిక సీట్లు సాధిస్తామని ఆయన అన్నారు. చంద్రబాబు అందితే జుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకుంటారని, జుట్టు అందలేదని కాళ్లు పట్టుకున్నారని విమర్శలు గుప్పించారు. జగన్ మూడు రాజధానులకు కట్టుబడి వున్నారని.. కర్నూలులో రాజధాని ఏర్పాటు చేస్తాం… తిరిగి అధికారంలోకి వచ్చాక న్యాయరాజధాని ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
*ఆయనను వైసీపీలోకి ఆహ్వానిస్తే ఎలా ఉంటుంది.. పవన్కు వంగా గీత స్ట్రాంగ్ కౌంటర్
ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతుండడంతో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు, ప్రతివిమర్శలకు దిగుతున్నారు. ఇటీవల తనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కాకినాడ ఎంపీ, వైఎస్సార్సీపీ పిఠాపురం అభ్యర్థి వంగా గీత కౌంటర్ ఇచ్చారు. బుధవారం ఉదయం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆమె.. ఎన్టీవీతో మాట్లాడారు. పిఠాపురంలో పోటీ చేసే అంశంపై మాట్లాడే క్రమంలో పవన్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. తాను కూడా పవన్ కల్యాణ్ని వైసీపీలోకి ఆహ్వానిస్తే ఎలా ఉంటుందని అని అన్నారు. పవన్వి దింపుడు కళ్లెం ఆశలని పేర్కొన్నారు. 2009 కంటే ముందు నుంచే నేను రాజకీయాల్లో ఉన్నా. 2009లో చిరంజీవి నాకు అవకాశం ఇచ్చారు. పిఠాపురంలో గెలుపుపై పవన్వి దింపుడు కళ్లెం ఆశలు. పవన్ కళ్యాణ్ చెప్పినట్లు మెజార్టీ కోసమే ఎన్నికలు జరుగుతున్నాయి. అది వంగా గీతా మెజారిటీ కోసం జరుగుతున్నాయి. నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజల మద్దతు నాకే ఉంది. 2009లో పీఆర్పీ పిఠాపురంలో గెలిస్తే, ఆ తర్వాత కూడా జనసేన పోటీ చేసింది. పిలిస్తే పలికే వాళ్ళని ప్రజలు గెలిపిస్తారు. పవన్కి డబ్బుల గొడవ ఎందుకు?’ అని వంగా గీత పేర్కొన్నారు.2009లో పిఠాపురం నుంచి ప్రజారాజ్యం తరఫున వంగా గీత గెలిచారు. ఆమె వైఎస్సార్సీపీ వీడి జనసేనలోకి రావాలని ఆశిస్తున్నా అంటూ పవన్ నిన్న మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై వంగా గీత కౌంటర్ తాజాగా స్పందించారు. ఇదిలా ఉంటే.. పిఠాపురంలో పవన్ పోటీ వేళ జనసేనకు ఇవాళ పెద్ద షాకే తగలబోతోంది. నియోజకవర్గ నేత మానినీడు శేషు కుమారి వైఎస్సార్సీపీలో చేరబోతున్నారు. సీఎం జగన్ సమక్షంలోనే ఆమె వైఎస్సార్సీపీ కండువా కప్పుకోబోతున్నట్లు తెలుస్తోంది.
*తెలంగాణ గవర్నర్గా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణం
తెలంగాణ ఇన్ఛార్జ్ గవర్నర్గా సీపీ రాధాకృష్ణన్ బాధ్యతలు స్వీకరించారు. ఇవాళ ఉదయం రాజ్భవన్లో ప్రధాన న్యాయమూర్తి లోక్ ఆరాధే ఆయనతో ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, రాష్ట్ర సీఎస్తో పాటు పలువురు ఉన్నతాధికారులు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. ప్రమాణస్వీకారోత్సవం అనంతరం ఇన్ఛార్జ్ గవర్నర్ రాధాకృష్ణన్తో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్ర పరిస్థితులు, గవర్నర్ కోటా ఎమ్మెల్సీ సమస్యలపై రాధాకృష్ణన్ కు సీఎం రేవంత్ వివరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్గా ఉన్న రాధాకృష్ణన్ తెలంగాణ ఇన్ఛార్జ్ గవర్నర్గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా కొనసాగనున్నారు. రాధాకృష్ణన్ తమిళనాడు బీజేపీలో సీనియర్ నాయకుడు. గతంలో ఆయన బీజేపీ రాష్ట్ర చీఫ్గా, కేరళ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్గా పలు కీలక పదవులు నిర్వహించారు. 1998, 99 సార్వత్రిక ఎన్నికల్లో కోయంబత్తూరు నుంచి బీజేపీ తరపున లోక్సభకు ఎన్నికయ్యారు. అయితే ఆ తర్వాత మూడుసార్లు పోటీ చేసి ఓడిపోయారు. తమిళనాడులో బీజేపీని బలోపేతం చేసేందుకు వారు ఎన్నో పోరాటాలు చేశారు. అలాగే.. బీజేపీ తరపున పలు కీలక పదవులు నిర్వహించారు. గతేడాది ఫిబ్రవరిలో జార్ఖండ్ గవర్నర్గా నియమితులయ్యారు.
*తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. సులువుగానే దర్శనం…!
తిరుమలలో భక్తుల రద్దీ పూర్తిగా తగ్గింది. బుధవారం, అందులో పిల్లలకు పరీక్షల సమయం కావడంతో భక్తుల రద్దీ అంతగా లేదు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లు అన్ని ఖాళీగానే కనపడుతున్నాయి. దీనితో శ్రీవారి దర్శనం భక్తులకు అత్యంత సులువుగానే అవుతుంది. ఇక అలాగే టీటీడీ వసతి గృహాల విషయంలోనూ భక్తులకు పెద్దగా ఇబ్బంది కావడం లేదు. అలాగే తిరుమలలోను ఏ వీధిలో కూడా పెద్దగా రద్దీ కానపడం లేదు. ఇక 300 రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం కేవలం ఒక గంట సమయంలో పూర్తి అవుతుందని టీటీడీ దేవస్థానం అధికారులు తెలిపారు. బుధవారం తిరుమల శ్రీవారిని 63,251 మంది భక్తులు దర్శించుకోగా అందులో.. 20,989 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. ఇక బుధవారం తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం విషయానికి వస్తే.. రూ. 4.14 కోట్ల రూపాయలు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. ఇక నేడు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లలో ఎక్కడ వేచి ఉండకుండానే స్వామి భక్తులు స్వామి వారిని నేరుగా దర్శించుకుంటున్నారు. ఇక సర్వదర్శనం క్యూ లైన్ లో ఉన్న భక్తులకు మాత్రం 6 నుంచి 8 గంటల సమయం పడుతుంది స్వామి వారి దర్శనం.
*బెంగళూరులో నీటి సంక్షోబానికి కారణం ఏంటో తెలుసా?
ప్రస్తుతం బెంగళూరు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. అక్కడి వాసులు నీటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా నీటి వినియోగంపై ఆంక్షలు విధించిందంటే.. అక్కడ పరిస్థితి ఏ రేంజ్లో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. స్నానానికి బదులు వైప్స్తో తుడుచుకోవడం, వంట సమన్లు ఎక్కువగా కడగకపోవడం, తినడానికి డిస్పీజబుల్ ప్లేట్స్ వాడుతూ.. జనాలు అడ్జస్ట్ అవుతున్నారు. వేసవి ప్రారంభంలోనే ఈ విధంగా ఉందంటే.. ఏప్రిల్, మే నెలల్లో నీటి కష్టాల ఏ రేంజ్లో ఉంటాయో అని బెంగళూరు వాసులు ఆందోళన చెందుతున్నారు. నీటి సమస్య కారణంగా పలు కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం ఇచ్చేశాయి. దాంతో చాలామంది టెక్కీలు కుటుంబ సభ్యులతో కలిసి సొంత ఊర్లకు వెళ్లిపోతున్నారు. అక్కడే ఉన్న వారు నీటి కోసం ట్యాంకర్లను బుకింగ్ చేసుకుంటున్నారు. అయితే అవి ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. సాధారణంగా 1000 లీటర్ల వాటర్ ట్యాంక్ నీటి ధర రూ.600-800 ఉండగా.. ఇప్పుడు రూ.2000 డిమాండ్ చేస్తున్నారట. ఇప్పుడు దేశవ్యాప్తంగా బెంగళూరు నీటి కష్టాలు హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకీ బెంగళూరు నీటి కష్టాలకు కారణాలేంటో ఓసారి చూద్దాం. బెంగళూరు నీటి సంక్షోబానికి ప్రధాన కారణం తక్కువ వర్షపాతం నమోదవ్వడమే. కర్ణాటకలో గత వర్షాకాలంలో 18% తక్కువ వర్షపాతం నమోదైంది. 2015 నుంచి ఇదే అత్యల్ప వర్షపాతం. దాంతో భగర్బజలాలు ఇంకిపోయాయి. వర్షాలు ఎక్కువగా లేకపోవడంతో కావేరి నదిలో నీటి మట్టం తగ్గి.. సాగునీటి, తాగునీటి సరఫరాకు ఇబ్బంది తలెత్తింది. ప్రస్తుతం బెంగళూరు వ్యాప్తంగా ఉన్న సగం బోర్లు ఎండిపోయాయి. ఐఐటీ గాంధీనగర్ ప్రొఫెసర్ విమల్ మిశ్రా మాట్లాడుతూ.. ‘దక్షిణ భారతదేశం చాలా భిన్నమైన జలాశయ వ్యవస్థను కలిగి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా రాతి ఉంటుంది. అందుకే జలాశయాలు ఎక్కువ నీటిని కలిగి ఉండవు’ అని అన్నారు.
*డీఎంకే మేనిఫెస్టోలో పుదుచ్చేరికి రాష్ట్ర హోదా, నీట్ నిషేధం హమీలు
లోక్సభ ఎన్నికలకు ముందు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బుధవారం తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ, స్టాలిన్ సోదరి కనిమొళి, ఇతర పార్టీ నేతలు కూడా పాల్గొన్నారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే 16 మంది అభ్యర్థుల జాబితాను కూడా పార్టీ ప్రకటించింది. డీఎంకే విడుదల చేసిన మేనిఫెస్టోలో పుదుచ్చేరికి రాష్ట్ర హోదా, నీట్ పరీక్షపై నిషేధం వంటి హామీలు ఉన్నాయి. పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసిన అనంతరం సభను ఉద్దేశించి ముఖ్యమంత్రి స్టాలిన్ మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు మేనిఫెస్టోను రూపొందించి, మేం చెప్పినట్టే చేస్తూనే ఉంటామని, ఇదే మా నాయకులు మనకు నేర్పిన విషయమని డీఎంకే అధినేత అన్నారు. కనిమొళి చెప్పినట్లు రాష్ట్రమంతటా వెళ్లి వివిధ వ్యక్తుల మాటలు విన్నామని, ఇది డీఎంకే మేనిఫెస్టో మాత్రమే కాదని, ప్రజల మేనిఫెస్టో అని స్టాలిన్ అన్నారు. 2014లో బీజేపీ అధికారంలోకి రాగానే భారతదేశాన్ని నాశనం చేశారని, ఎన్నికల వాగ్దానాలేవీ నెరవేర్చలేదని, అందుకే ఇండియాకూటమిని ఏర్పాటు చేశామని, 2024లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. మా మేనిఫెస్టోలో తమిళనాడుకు ప్రత్యేక పథకాలు ప్రకటించామని, ఈ మేనిఫెస్టోలో ప్రతి జిల్లాకు పథకాలు ఇచ్చామని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడు పర్యటనపై ఎంకే స్టాలిన్ మాట్లాడుతూ.. వరదల సమయంలో తమిళనాడుకు ప్రధాని మోడీ వచ్చి ఉంటే సంతోషించేవాడినని అన్నారు.
*పాకిస్థాన్ లో బలమైన భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.5గా తీవ్రత నమోదు
బుధవారం అర్థరాత్రి పశ్చిమ పాకిస్థాన్లో బలమైన భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో ఉంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. రిక్టర్ స్కేల్పై 5.5 తీవ్రతతో భూకంపం పాకిస్థాన్లో మధ్యాహ్నం 2:57 గంటలకు నమోదైంది. అయితే భూకంపం కారణంగా ప్రాణ, ఆస్తినష్టం గురించి ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదు. అయితే పాకిస్థాన్లో బలమైన భూకంపం రావడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అంతకుముందు ఫిబ్రవరి 17న పాకిస్థాన్లోని ఇస్లామాబాద్ సమీపంలో రిక్టర్ స్కేలుపై 4.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. జనవరిలో, పాకిస్తాన్లో రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. జనవరిలో, వాతావరణ శాఖ (పిఎమ్డి) ప్రకారం, పాకిస్తాన్లోని కొన్ని ప్రాంతాలను 6.0 తీవ్రతతో మరో భూకంపం తాకింది. ఫిబ్రవరి 17న పాకిస్థాన్లోని ఇస్లామాబాద్ సమీపంలో భూకంపం సంభవించిందని మీకు తెలియజేద్దాం. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.7గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. దీని లోతు 190 కిలోమీటర్లుగా నమోదైంది. అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. మీడియా నివేదికల ప్రకారం, పాకిస్తాన్లో తరచుగా వివిధ తీవ్రతతో భూకంపాలు సంభవిస్తున్నాయి. అయితే 2005లో పాకిస్థాన్లో అత్యంత ఘోరమైన భూకంపం సంభవించింది. ఇందులో 74 వేల మందికి పైగా చనిపోయారు.
*ప్రపంచంలోనే సంతోషకరమైన దేశం ఫిన్లాండ్.. భారత్ స్థానం ఎంతో తెలుసా?
ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశాల జాబితా వచ్చేసింది. ఈ సంవత్సరం కూడా నార్డిక్ దేశాలు (ఉత్తర ఐరోపా, అట్లాంటిక్ దేశాలు) అత్యధిక స్కోర్లతో సంతోషకరమైన దేశాలలో ఉన్నాయి. ఈ జాబితాలో ఫిన్లాండ్ మరోసారి మొదటి స్థానంలో నిలిచింది. ఫిన్లాండ్ వరుసగా ఏడేళ్లుగా సంతోషకరమైన దేశాల ర్యాంకింగ్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ సంవత్సరం నివేదిక వయస్సు ఆధారంగా ప్రత్యేక ర్యాంకింగ్లను చేర్చడం మొదటిసారి. ఇది ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లోని యువకులలో జీవిత సంతృప్తికి సంబంధించిన పరిస్థితిని కూడా హైలైట్ చేస్తుంది. 143 దేశాలకు చెందిన వ్యక్తుల గ్లోబల్ సర్వే డేటా ఆధారంగా ఈ నివేదిక రూపొందించబడింది. గత మూడు సంవత్సరాలలో వారి సగటు జీవిత అంచనా ఆధారంగా దేశాలు సంతోషంలో ర్యాంక్ చేయబడ్డాయి. సీఎన్ఎన్ వార్తల ప్రకారం.. ఉత్తర అమెరికాలో యువతలో ఆనందం వేగంగా తగ్గిపోయింది. యువత కంటే ఇప్పుడు అక్కడి వృద్ధులు సంతోషంగా ఉన్నారని నివేదిక చెబుతోంది. దీంతో 2012 తర్వాత తొలిసారిగా హ్యాపీ దేశాల జాబితాలో అమెరికా టాప్ 20 నుంచి బయటకు వచ్చింది. అమెరికా, కొన్ని ఇతర దేశాల ర్యాంక్లో క్షీణత కూడా పెరిగిపోయింది. మనం భారతదేశం గురించి మాట్లాడినట్లయితే, భారతదేశం 143 దేశాలలో 126వ స్థానంలో ఉంది. గతేడాది కూడా భారత్ ఇదే స్థానంలో నిలిచింది. నివేదికలో ఫిన్లాండ్ మరోసారి ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా నిలిచింది. ఫిన్లాండ్ తర్వాత డెన్మార్క్ రెండో స్థానంలో ఉంది. ఈ జాబితాలో ఐస్లాండ్ మూడో స్థానంలో, స్వీడన్ నాలుగో స్థానంలో నిలిచాయి. ఇజ్రాయెల్ 5వ స్థానంలో ఉంది. నెదర్లాండ్స్ నం. 6, నార్వే నం. 7, లక్సెంబర్గ్ నం. 8, స్విట్జర్లాండ్ నం. 9, ఆస్ట్రేలియా 10వ స్థానంలో ఉన్నాయి. న్యూజిలాండ్ 11వ స్థానంలో, కోస్టారికా 12వ స్థానంలో, కువైట్ 13వ స్థానంలో, ఆస్ట్రియా 14వ స్థానంలో, కెనడా 15వ స్థానంలో ఉన్నాయి. బెల్జియం 16వ స్థానంలో, ఐర్లాండ్ 17వ స్థానంలో, చెకియా 18వ స్థానంలో, లిథువేనియా 19వ స్థానంలో, యునైటెడ్ కింగ్డమ్ 20వ స్థానంలో ఉన్నాయి.