NTV Telugu Site icon

Top Headlines @ 1 PM : టాప్‌ న్యూస్

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

*మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మోడీ.. తొలి సంతకం ఆ ఫైల్ మీదే..?

భారత దేశ ప్రధాన మంత్రిగా వరుసగా మూడోసారి బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ రైతుల సంక్షేమమే లక్ష్యంగా తొలి సంతకం చేశారు. ఇక, పదవీ బాధ్యతలను స్వీకరించిన సందర్భంగా మోడీ తొలి ఫైల్‌పై సంతకం చేసి.. కోట్లాది మంది రైతులకు అద్భుతమైన కానుక అందించారు. 17వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని రైతుల ఖాతాలకు పంపే ఫైలుపై మోడీ సంతకం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. అందువల్ల తొలి సంతకం రైతుల సంక్షేమానికి సంబంధించినదై ఉండడం సముచితమని భావించామని నరేంద్ర మోడీ తెలిపారు. ఇక, పీఎం కిసాన్ నిధి పథకం వల్ల 9.3 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. దాదాపు రూ.20 వేల కోట్ల ఆర్థిక సాయం నిధులను విడుదల చేశారు. అలాగే, ఇవాళ సాయంత్రం 5 గంటలకు లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నివాసంలో కొత్త ప్రభుత్వం తమ తొలి మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయబోతుంది. ఇక, మోడీ తన కేబినేట్ లో మొత్తం 72 మంది మంత్రులతో ప్రమాణం చేయించారు. అయితే, ఈ భేటీలోనే మంత్రులకు శాఖల కేటాయింపుపై కూడా ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

 

*కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు.. ఎవరికి ఏ శాఖ దక్కుతుందో..?
భారత ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు 72 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. అయితే, ఎవరికి ఏ శాఖ ఇస్తారనే దానిపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. ఈ కేబినేట్ లో ప్రధాని మోడీ మార్క్ ఏమైనా కనిపించబోతుందా?. ఇవాళ( జూన్‌ 10) సాయంత్రం 5 గంటలకు ప్రధాని నేతృత్వంలో కొత్త కేంద్ర మంత్రి వర్గం సమావేశం కాబోతుంది. ఈ భేటీలోనే కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపుపై ఓ క్లారిటీ రానుంది. భాగస్వామ్య పక్షాలు ఆశిస్తున్న శాఖలను అన్నింటిని పరిగణలోకి తీసుకున్న బీజేపీ.. వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నట్లు సమాచారం. కీలకమైన ఆర్థిక, హోం, రక్షణ, విదేశాంగ, రైల్వే, రవాణా శాఖలను తమ దగ్గరే బీజేపీ అంటి పెట్టుకోనుంది. అలాగే.. మూడోసారి ఏర్పాడిన ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో మ్యానుఫ్యాక్చరింగ్, మౌలిక వసతులపై ప్రధానంగా ఫోకస్ ఉంటుందని గతంలోనే మోడీ ప్రకటించారు. దీని పరిధిలోకి వచ్చే శాఖలు కూడా బీజేపీ తమ దగ్గరే పెట్టుకునే ఛాన్స్ ఉంది. మంత్రి వర్గ కూర్పులో ప్రధాని మోడీ కుల సమీకరణాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తుంది. త్వరలో ఎన్నికలు జరగాల్సి ఉన్న రాష్ట్రాలకూ సైతం ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. కాగా, కొత్త మంత్రుల్లో 27 మంది బీసీలు ఉండగా.. ఐదుగురు మైనారిటీలు, ఏడుగురు మహిళలు, యువత, సీనియర్ల కాంబినేషన్‌లో మోడీ మార్క్‌తో మంత్రులకు శాఖలు కేటాయింపు ఉంటుందని సమాచారం. కాగా, ఎన్డీయే కూటమిలోని భాగస్వామ్య పార్టీలు సైతం తమ ప్రయోజనాలను దృష్ట్యిలో ఉంచుకుని ఆయా శాఖల్ని డిమాండ్‌ చేస్తున్నాయి. వ్యవసాయ శాఖను జేడీఎస్‌ నేత కుమారస్వామి కోరినట్లు సమాచారం. మరోవైపు రాష్ట్ర ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకునే శాఖల్ని కోరామని మరో మిత్రపక్షం టీడీపీ ఇప్పటికే ప్రకటించింది. అలాగే, జేడీయూ, ఇతర పార్టీలు సైతం పలు ముఖ్య శాఖల్ని కోరినట్లు తెలుస్తుంది. ప్రభుత్వ ఏర్పాటుపై ఎన్డీయే ఎంపీల సమావేశం జరుగుతున్న సమయంలోనే.. మరోవైపు జేపీ నడ్డా నివాసంలో మిత్రపక్ష నేతలతో మంత్రివర్గ కూర్పు, ఎవరికి ఏయే శాఖలు లాంటి అంశాలపై చర్చించి ఓ నిర్ణయం కూడా తీసుకున్నట్లు సమాచారం. ఇక, ఆదివారం రాత్రి మోడీతో పాటు మొత్తం 72 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. మోడీ 3.0 సర్కార్ లో 30 మంది కేబినెట్ మంత్రులు, 5 మంది స్వతంత్ర మంత్రులు, 36 మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేయగా.. ఇందులో 43 మంది మూడుసార్ల కంటే ఎక్కువసార్లు పార్లమెంట్‌కు ఎంపికయ్యారు. అలాగే, ఆరుగురు మాజీ ముఖ్యమంత్రులను సైతం కేంద్రమంత్రివర్గంలోకి మోడీ తీసుకున్నారు. అలాగే.. తెలుగు రాష్ట్రాల తరఫున తెలంగాణ నుంచి ఇద్దరు, ఏపీ నుంచి ముగ్గురి మంత్రి వర్గంలో స్థానం దక్కించుకున్నారు. ఇక, కేంద్ర కేబినెట్‌లో ఇంకా 9 బెర్తులు ఖాళీగా ఉన్నాయి.

 

*మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు దృష్టి.. పవన్‌కు ఆ పదవి కేటాయించే అవకాశం?
ఆంధ్రప్రదేశ్‌లో మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు దృష్టి పెట్టనున్నారు. భారీ మెజారిటీతో గెలిచిన కూటమి సభ్యులతో కలిసి పూర్తిస్థాయిలో మంత్రివర్గం ఉండేలా కసరత్తు చేయనున్నట్లు తెలుస్తోంది. ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి ఎక్కువగా స్థానాలను కైవసం చేసుకుంది. మూడు పార్టీలు కలిసి మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గానూ 164 సీట్లను కైవసం చేసుకుంది. ఈ నెల 12న ఉదయం 11.27 గంటలకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నెల 11న టీడీపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. టీడీఎల్పీ భేటీ అనంతరం టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో కూటమి ఎమ్మెల్యేలు చంద్రబాబును తమ నాయకుడిగా ఎన్నుకుంటారు. జనసేనకు 21, బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ నేపథ్యంలో, జనసేన, బీజేపీలకు ఎన్ని మంత్రి పదవులు దక్కుతాయన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా, పవన్ కల్యాణ్ మంత్రి పదవిని తీసుకుంటారా? ఒకవేళ తీసుకుంటే ఏ శాఖను ఎంచుకుంటారు? అనేది అత్యంత చర్చనీయాంశంగా మారింది. మరోవైపు, పూర్తి స్థాయి క్యాబినెట్ తో పరిపాలన ప్రారంభించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ముఖ్యమంత్రితో కలిపి 26 మందితో క్యాబినెట్ ప్రకటించే అవకాశాలున్నాయి. ఏపీ క్యాబినెట్ కూర్పుపై ఎన్డీయే పెద్దలు చంద్రబాబుకు స్వేచ్ఛ ఇచ్చినట్టు తెలుస్తోంది. నిన్నటివరకు ఢిల్లీ ముఖ్యనేతలతో బిజీబిజీగా గడిపిన చంద్రబాబు నేడు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకోనున్నారు. మధ్యాహ్నం ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు మంత్రివర్గంపై కసరత్తు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ఇప్పటికే జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్‌ కల్యాణ్‌తో పాటు బీజేపీ నేతలతోనూ చర్చించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పవన్‌కళ్యాణ్‌కు డిప్యూటీ సీఎంతో పాటు మరో కీలక మంత్రి పదవి అప్పజెప్పే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఆయన సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తి కావడంతో ఏపీలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్దికి కృషిచేసేందుకు సినిమాటోగ్రఫీ శాఖను కేటాయించనున్నట్లు కూడా ఓ వర్గం నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. జనసేన అధినేత ప్రధాని ప్రమాణ స్వీకారోత్సవానికి సతీసమేతంగా హాజరైన సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు పవన్‌తో మాట్లాడేందుకు పోటీపడ్డారు. జాతీయ మీడియా పవన్‌ను పదవులపై ప్రశ్నించగా.. ఆయన ఏదో చెప్పారు. స్పష్టంగా వినిపించలేదు. కానీ ఆయన ఉపముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నట్లు జాతీయ మీడియా వర్గాలు తెలిపాయి. ఏదేమైనా కూటమి సభ్యులు భారీగా గెలుపొందడంతో కేబినెట్ కూర్పు కత్తిమీద సాములా మారిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఎవరికి ఏశాఖలు వరిస్తాయో తెలియాలంటే చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేసేవరకు వేచి చూడాల్సిందే.

 

*గ్రూప్​-4 అభ్యర్థులకు టీజీపీఎస్సీ గుడ్​ న్యూస్.. మెరిట్​ జాబితా విడుదల..
గ్రూప్-4 అభ్యర్థులకు టీజీపీఎస్సీ శుభవార్త అందించింది. సర్టిఫికెట్ల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల మెరిట్ జాబితా విడుదలచేసింది. ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 13 నుంచి వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునేందుకు కమిషన్ అవకాశం కల్పించింది. సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా వెబ్ ఆప్షన్ల కోసం నమోదు చేసుకోవాలని టీజీపీఎస్సీ సూచించింది. అలా చేసిన వారికే విడతల వారీగా సర్టిఫికెట్ల పరిశీలనకు అనుమతిస్తామని స్పష్టం చేశారు. అయితే అభ్యర్థులు వెరిఫికేషన్‌కు హాజరు కావాల్సిన రోజువారీ తేదీలను కమిషన్ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని తెలిపింది. రాష్ట్రంలో 8,180 గ్రూప్‌-4 పోస్టుల భర్తీకి ఇప్పటికే పరీక్ష నిర్వహించారు. టీజీపీఎస్సీ ఈ ఏడాది ఫిబ్రవరి 9న సాధారణ ర్యాంక్ జాబితాను ప్రకటించింది. ఈ క్రమంలో ముఖ్యమైన సర్టిఫికెట్ల పరిశీలన తేదీలను కమిషన్ విడుదల చేసింది. అభ్యర్థులు పరీక్షకు అవసరమైన అన్ని సర్టిఫికెట్లతో సిద్ధంగా ఉండాలని కమిషన్ సూచించింది. అలాగే వారందరినీ దగ్గర ఉంచుకోవాలని అన్నారు. ధృవీకరణ పత్రాల సమయంలో ఈ పత్రాలన్నీ తప్పనిసరిగా సమర్పించాలని స్పష్టం చేసింది. అభ్యర్థులకు ఎలాంటి అదనపు గడువు ఇవ్వబోమని టీజీపీఎస్సీ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ గ్రూప్ 4 పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ 2022లో విడుదలైంది. కానీ పరీక్ష జూలై 2023లో జరిగింది. ఇప్పటికే సాధారణ ర్యాంకులు ప్రకటించగా, ఎన్నికల కోడ్ రాక కారణంగా మెరిట్ జాబితా ఆలస్యమైంది. ఇప్పుడు TGPSC మెరిట్ జాబితాను విడుదల చేసింది మరియు వెబ్ ఎంపికల తేదీలను కూడా ప్రకటించింది.

 

*వైసీపీ గెలుస్తుందని బెట్టింగ్ పెట్టిన సర్పంచ్ ఆత్మహత్య
బెట్టింగ్ తప్పు అని తెలిసినా కొంత మంది అదే రూట్‌లో వెళ్తున్నారు. పరువు కోసం, ఆధిపత్యం కోసం.. కారణం ఏదైనా సరే పందెం కాసి ఆస్తులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఎన్నో కుటుంబాలకు తీరని శోకాన్ని మిగుల్చుతున్నారు. అలాంటి ఘటనే ఏలూరు జిల్లాలోని నూజివీడు మండలం తూర్పుదిగవల్లిలో జరిగింది. ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని గ్రామస్థులతో పందెం వేసి అప్పులు చెల్లించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. తూర్పుదిగవల్లి గ్రామానికి చెందిన జగ్గవరపు వేణుగోపాల్‌రెడ్డి ఏడో వార్డు సభ్యుడు. భార్య సర్పంచ్‌గా ఉన్నారు. వీరు వైసీపీ మద్దతుదారులు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని వివిధ గ్రామాల వారితో రూ.30 కోట్లు బెట్టింగ్ వేశారు. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపు రోజు ఊరు విడిచి వెళ్లారు. పార్టీ ఘోరంగా ఓటమి చెందడంతో ఇంటికి తిరిగిరాలేదు. పందెం వేసినవాళ్లు ఫోన్లు చేసినా స్పందించలేదు. దీంతో పందెం వేసినవాళ్లు ఆయన ఇంటికి వెళ్లి తలుపులు పగలగొట్టి ఏసీలు, సోఫాలు, టీవీలు తీసుకెళ్లారు. ఇక దీంతో మనస్తాపానికి గురై పొలం దగ్గర పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు వేణుగోపాల్ రెడ్డి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహం వద్ద ఓ లేఖను స్వాధీనం చేసుకున్నారు. అందులో చింతలపూడి నామవరానికి చెందిన ఓ వ్యక్తి తన మృతికి కారణమని పేర్కొన్నట్లు తెలిసింది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.

 

*జమ్మూ కాశ్మీర్‌లో దాడి వెనుక పాకిస్థాన్ హస్తం… వెలుగులోకి అనుమానితుడి ఫోటో
జమ్ముకశ్మీర్‌లోని రియాసిలో ప్రయాణికుల బస్సుపై ఉగ్రవాదుల దాడి వెనుక పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా హస్తం ఉంది. శివఖోడి నుంచి తిరిగి వస్తున్న బస్సుపై ఈ దాడి జరిగింది. బస్సులోని యాత్రికులందరూ భోలే బాబాను దర్శించుకోవడానికి శివఖోడి వెళ్లి తిరిగి కత్రాకు వస్తున్నారు. ఈ దాడిలో తొమ్మిది మంది యాత్రికులు మరణించగా, మరో 33 మంది గాయపడ్డారు. ఉగ్రవాదులు 30 నుండి 40 రౌండ్లు కాల్పులు జరిపారు మరియు ఒక బుల్లెట్ బస్సు డ్రైవర్‌ను తాకింది, దీని కారణంగా బస్సు 200 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. బస్సుపై ఇద్దరు ఉగ్రవాదులు దాడి చేశారు. ఉగ్రవాదులు ఇద్దరూ పాకిస్థాన్‌కు చెందినవారని అధికారులు చెబుతున్నారు. రాజౌరి, రియాసి సరిహద్దు మధ్య ప్రాంతంలో వారు బస్సును లక్ష్యంగా చేసుకున్నారు. పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. ఉగ్రవాద కమాండర్ అబు హమ్జా రాజౌరిలో యాక్టివ్‌గా ఉన్నాడు. అబూ హంజా చిత్రం బయటపడింది. అతడి ఆచూకీ కోసం భద్రతా బలగాల సంయుక్త సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఘటనలో బాధితులైన యాత్రికులు ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్ వాసులు అని చెప్పారు. గాయపడిన వారందరూ జమ్మూలోని నారాయణ్ ఆసుపత్రి .. ప్రభుత్వ వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్నారు. ఈ దాడిపై విచారణకు ఆదేశాలు జారీ చేశారు. దీని బాధ్యతను ఎన్‌ఐఏకు అప్పగించారు. దీంతో పాటు ఎన్‌ఐఏ ఫోరెన్సిక్ బృందాన్ని కూడా ఘటనా స్థలానికి పంపారు. దీంతోపాటు ఎఫ్‌ఎస్‌ఎల్‌ బృందం ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించింది. ఈ ఘటనలో గాయపడిన సంతోష్ కుమార్ వర్మ అనే భక్తుడు శివఖోడి నుంచి దర్శనం చేసుకుని తిరిగి వస్తున్నట్లు తెలిపారు. అకస్మాత్తుగా నడిరోడ్డుపైకి ఓ ఉగ్రవాది వచ్చి కాల్పులు జరిపాడు. డ్రైవర్‌పై రెండు-మూడు సార్లు కాల్పులు జరిపి, బస్సులోపల కాల్పులు జరిపారు. ఆపై బస్సు కింద పడింది. కింద పడిన తర్వాత కూడా చాలా సేపు కాల్పులు కొనసాగాయి. ఆ తర్వాత చాలా మంది కేకలు వేయడం మొదలుపెట్టారు. అడపాదడపా కాల్పులు జరుపుతూనే ఉన్నాడు. వైష్ణో దేవి దర్శనం కోసం ఢిల్లీ నుంచి వచ్చామని గాయపడిన మరో భక్తుడు తెలిపారు. దర్శనం తరువాత మాకు సమయం మిగిలి ఉంది. కాబట్టి శివఖోడిని సందర్శించాలని అనుకున్నాము. దర్శనం చేసుకుని అక్కడి నుండి బయలుదేరిన వెంటనే, సరిగ్గా అరగంట తరువాత మాపై కాల్పులు ప్రారంభించారు. అద్దం పగిలిపోయింది. కొన్ని సెకన్లలో బస్సు కాలువలోకి వెళ్ళింది. ట్రెంచ్‌లోకి ప్రవేశించిన తర్వాత కూడా కొన్ని సెకన్ల పాటు కాల్పులు కొనసాగాయి. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం ఇద్దరు ఉగ్రవాదులు బస్సుపై కాల్పులు జరిపార రియాసి ఎస్‌ఎస్‌పి మోహిత శర్మ తెలిపారు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు పెద్ద ఎత్తున సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహిస్తున్నారు. ఈ దారుణానికి పాల్పడిన ఉగ్రవాదులు పాకిస్థానీయులుగా అనుమానిస్తున్నారు. సాధారణ ఇన్‌పుట్ ఆధారంగా, శివ ఖోడి , మాతా వైష్ణో దేవి భద్రత ఇప్పటికే పటిష్టంగా ఉంది. నిర్దిష్ట ఇన్‌పుట్ లేదు, కానీ దురదృష్టవశాత్తు ప్యాసింజర్ బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడి తర్వాత జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా యాక్షన్ మోడ్‌లో కనిపించారు. దాడికి సంబంధించి ఆయన ఉన్నత స్థాయి భద్రతా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ రోజు కూడా ఈ సమావేశం జరగాల్సి ఉంది. ఈ సమావేశానికి భద్రతా ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.

 

*జమ్మూ బస్సు ఘటన పై ఎన్ఐఏ దర్యాప్తు.. డ్రోన్ల సాయంతో ఉగ్రవాదుల కోసం అన్వేషణ
జమ్మూ కాశ్మీర్‌లోని రియాసి జిల్లాలో భక్తులతో నిండిన బస్సుపై ఉగ్రవాదుల దాడిపై ఎన్‌ఐఏ దర్యాప్తు చేయనుంది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) బృందం జమ్మూ కాశ్మీర్‌లోని రియాసికి చేరుకుని పోలీసులకు సహాయం చేయడానికి.. పరిస్థితిని అంచనా వేసింది. ఎన్‌ఐఏ ఫోరెన్సిక్ బృందం కూడా గ్రౌండ్ లెవెల్ నుండి సాక్ష్యాలను సేకరించడంలో సహాయం చేయడానికి ప్రయత్నిస్తోంది. మరోవైపు రియాసీలో భారత సైన్యం సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తోంది. అటవీ ప్రాంతంలో సోదాలకు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. ఆదివారం సాయంత్రం, రియాసిలో యాత్రికులను తీసుకువెళుతున్న బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఇందులో అమాయక శిశువుతో సహా తొమ్మిది మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోగా, చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. రియాసి ఉగ్రవాద దాడిపై ఎస్‌ఎస్‌పి మోహిత శర్మ మాట్లాడుతూ, “నిన్న సాయంత్రం 6 గంటలకు శివఖోడి నుండి దర్శనం తర్వాత ప్యాసింజర్ బస్సు రియాసి వైపు వెళుతోంది. ఈ సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తొమ్మిది మంది మరణించారు. 33 మంది గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిపై దాడులు కొనసాగుతున్నాయి. అమర్‌నాథ్ యాత్ర ప్రారంభానికి 20 రోజుల ముందు, రియాసి జిల్లాలోని ప్రసిద్ధ శివ్‌ధామ్ శివఖోడిని సందర్శించి తిరిగి వస్తున్న ప్రయాణికులతో కూడిన బస్సుపై ఉగ్రవాదులు మెరుపుదాడి చేయడంతో బస్సు లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా 9 మంది ప్రయాణికులు మృతి చెందగా, 33 మంది గాయపడ్డారు. మృతులు, గాయపడిన భక్తులందరూ ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్‌లకు చెందిన వారని చెప్పారు. ఈ ఘటనలో ఆరు నుంచి ఏడు మంది ప్రయాణికులకు బుల్లెట్ గాయాలయ్యాయి. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆదివారం సాయంత్రం 6.15 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. తొమ్మిది మంది ప్రయాణికులు మృతి చెందగా, 33 మంది గాయపడ్డారని ఎస్‌ఎస్‌పి రియాసి మోహిత శర్మ ధృవీకరించారు. జూన్ 29 నుంచి అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ప్రయాణికులతో నిండిన బస్సు (JK 02 AE 3485) శివఖోడి నుండి కత్రాకు తిరిగి వస్తోందని చెప్పారు. బస్సులో 42 మంది ప్రయాణికులు ఉదయం శివఖోడికి వెళ్లింది. దర్శనానంతరం తిరిగి వస్తుండగా, పౌని-శివ్‌ఖోడి మధ్య కంద త్రయాత్ ప్రాంతంలోని చండీ మోడ్ దగ్గర అప్పటికే మెరుపుదాడి చేసిన ఉగ్రవాదులు బస్సు ఎదురుగా వచ్చి కాల్పులు జరిపారు. అకస్మాత్తుగా కాల్పులు జరగడంతో డ్రైవర్ అదుపు తప్పి దాదాపు 200 అడుగుల లోతున్న గుంతలో పడిపోయింది. బస్సు కిందపడగానే అక్కడే ఉన్న ఇతర ఉగ్రవాదులు వెనుక నుంచి కాల్పులు జరిపారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. లోతైన గుంటలో నుంచి క్షతగాత్రులను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. బస్సు కాలువలో పడిపోవడంతో చాలా మంది మృతదేహాలు అక్కడికక్కడే పడి ఉన్నాయి. కొన్ని మృతదేహాలు కూడా అటవీ ప్రాంతం కావడంతో సహాయక చర్యలు చేపట్టడంలో ఇబ్బంది ఏర్పడింది. చాలా శ్రమించి క్షతగాత్రులను బయటకు తీశారు. రియాసి నుండి పోలీసు అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను పిహెచ్‌సి పౌని, త్రియత్‌కు తరలించారు. పౌనిలో క్షతగాత్రులందరికీ ప్రథమ చికిత్స అందించిన అనంతరం జిల్లా ఆసుపత్రి రియాసికి రెఫర్ చేశారు. ఇది కాకుండా గాయపడిన కొంతమందిని కూడా ఆరోగ్య కేంద్రం భారఖ్‌కు తీసుకువచ్చారు.

 

*సమోసాల కోసం వెళ్లిన భర్త.. ఉరేసుకున్న భార్య.. తట్టుకోలేక తాను ఆత్మహత్య
ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురిలో భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో మొదట ఒకరు ఆపై మరొకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్య మొదట సమోసాలు కొనడానికి భర్తను పంపింది. అనంతరం ఇంట్లో వెనుక నుంచి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భర్త సమోసాలతో తిరిగి వచ్చేసరికే భార్య మృతదేహం వేలాడుతూ కనిపించింది. భార్య మృతితో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చనిపోయే ముందు, భర్త తన మామగారికి కూడా ఫోన్ చేశాడు. నా భార్య ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. ఇప్పుడు నేను జీవించి ఏమి ప్రయోజనం.. నేను కూడా చావబోతున్నాను. మామగారు రాకముందే అల్లుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు ఈ ఘటనతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ విషయం బెవార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మొహల్లా ఖాజీ తోలా సౌత్‌కి చెందినది. ఇక్కడ నివసించే 21 ఏళ్ల ఛోటూకు ఫరూఖాబాద్‌లోని రాజీపూర్‌ గ్రామానికి చెందిన 20 ఏళ్ల అంజలితో ఆరు నెలల క్రితం వివాహమైంది. వారిద్దరూ 4 డిసెంబర్ 2023న వివాహం చేసుకున్నారు. ఛోటూ దొంగతనాలకు బానిస కావడంతో దంపతుల మధ్య గొడవలు జరిగాయి. కష్టపడి డబ్బు సంపాదించాలని అంజలి ఎప్పుడూ తన భర్తకు చెప్పేది. ఏదో ఒక రోజు దొంగతనం చేస్తూ పట్టుబడితే పోలీసులు నాతో పాటు మీపై కూడా చర్యలు తీసుకుంటారు. ఛోటూ తన భార్య మాటలను ఎప్పుడూ పట్టించుకోలేదు. ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవి. జూన్ 9వ తేదీ తెల్లవారుజామున ఇదే విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కొంత సమయం తర్వాత భార్య అంజలి సమోసా తీసుకురావాలని భర్త ఛోటూను కోరింది. భర్త సమోసాతో ఇంటికి తిరిగి వచ్చేసరికి భార్య ఇంట్లో హుక్‌కు వేలాడుతూ కనిపించింది. ఈ దృశ్యం చూసి అతని కాళ్ల కింద నేల జారిపోయింది. ఛోటూ తన భార్యను ఉచ్చు నుండి త్వరగా విడిపించి, తన మామగారికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. మామగారు, మీ కూతురు ఆత్మహత్య చేసుకుంది. ఇప్పుడు నేను సజీవంగా ఉండి ఏమి చేస్తాను? నేను కూడా చావబోతున్నాను. మామగారు ఏమీ చేయలేక ముందే అల్లుడు ధోతితో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటన సమయంలో ఇంట్లో తల్లి, సోదరి ఎవరూ లేరు. తర్వాత ఛోటూ మామగారు అతని తల్లికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పడంతో ఆమె కూడా టెన్షన్ పడింది. ఛోటూ సోదరి, తల్లి వెంటనే ఇంటికి చేరుకున్నారు. ఇంట్లో ఛోటూ, అంజలి మృతదేహాలు వేలాడుతూ కనిపించాయి. దీనిపై పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.

 

*కొత్త శిఖరాలను తాకిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 77000, నిఫ్టీ 23400
భారత స్టాక్ మార్కెట్‌లో విపరీతమైన బూమ్ కనిపిస్తోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మార్కెట్ కొత్త ఊపును పొందింది. సెన్సెక్స్ తొలిసారిగా 77,000ను అధిగమించగా, నిఫ్టీ 23400 స్థాయిని దాటి చారిత్రక శిఖరానికి చేరుకుంది. బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ ప్రారంభమైన వెంటనే 50,000 స్థాయిని దాటింది. దాని ఆల్-టైమ్ గరిష్ట స్థాయి 51,133.20 నుండి ట్రేడ్ అవుతోంది. బ్యాంక్ నిఫ్టీ ప్రారంభమైన వెంటనే 50,252.95 గరిష్ట స్థాయిని తాకింది. ఈరోజు మార్కెట్ ప్రారంభమైన వెంటనే బీఎస్ఈ సెన్సెక్స్ 77,079.04 వద్ద ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. అదే సమయంలో, నిఫ్టీ 23,411.90 స్థాయికి చేరుకోవడం ద్వారా మొదటిసారిగా 23400 స్థాయిని దాటింది.
మార్కెట్ ఓపెనింగ్ ఎలా ఉంది?
ఈ రోజు మార్కెట్ ఆల్-టైమ్ హై వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్ 242.05 పాయింట్లు లేదా 0.32 శాతం లాభంతో 76,935 వద్ద ఉంది, ఇది దాని కొత్త రికార్డు గరిష్టం. అయితే NSE నిఫ్టీ 29 పాయింట్లు లేదా 0.12 శాతం పెరుగుదలతో 23,319.15 వద్ద ప్రారంభమైంది.

సెన్సెక్స్ షేర్ల పరిస్థితి
సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 14 షేర్లు లాభాల్లో, 16 షేర్లు క్షీణతతో ట్రేడవుతున్నాయి. పవర్ గ్రిడ్ షేర్లు 3.33 శాతం, యాక్సిస్ బ్యాంక్ 1.63 శాతం చొప్పున పెరిగాయి. అల్ట్రాటెక్ సిమెంట్ 1.50 శాతం, నెస్లే 0.66 శాతం బలపడ్డాయి. ఎస్‌బీఐ 0.63 శాతం లాభపడింది. పడిపోతున్న షేర్లలో టెక్ మహీంద్రా 2.23 శాతం, ఇన్ఫోసిస్ 1.70 శాతం, విప్రో 1.65 శాతం, హెచ్‌సిఎల్ టెక్ 1.35 శాతం, టైటాన్ 1.11 శాతం, టిసిఎస్ 1 శాతం చొప్పున ట్రేడవుతున్నాయి.

బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్
బిఎస్‌ఇ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 425.39 లక్షల కోట్లకు చేరుకోగా, యుఎస్ డాలర్లలో చూస్తే ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ 5.10 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. బిఎస్‌ఇలో 3431 షేర్లు ట్రేడ్ అవుతుండగా అందులో 2424 షేర్లు లాభాలతో ట్రేడవుతున్నాయి. 817 షేర్లలో క్షీణత ఉంది. 117 షేర్లలో ఎటువంటి మార్పు లేదు. 194 షేర్లపై అప్పర్ సర్క్యూట్ విధించబడింది. అదే సంఖ్యలో షేర్లు ఈరోజు ఒక సంవత్సరం గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.

నిఫ్టీ షేర్ల పరిస్థితి
నిఫ్టీలోని 50 స్టాక్స్‌లో 27 స్టాక్‌లు ప్రస్తుతం క్షీణతలో ఉన్నాయి. 23 స్టాక్స్ పెరుగుదలను చూపుతున్నాయి. ఇక్కడ కూడా పవర్‌గ్రిడ్ 2.44 శాతం. అల్ట్రాటెక్ సిమెంట్ 2.30 శాతం పెరిగి టాప్ గెయినర్‌గా కొనసాగుతోంది. యాక్సిస్ బ్యాంక్ 1.99 శాతం, సిప్లా 1.88 శాతం, అదానీ పోర్ట్స్ 1.66 శాతం చొప్పున పెరిగాయి. ఎన్‌ఎస్‌ఈలో 2416 షేర్లలో ట్రేడింగ్ జరుగుతోంది మరియు వీటిలో 1743 షేర్లు పటిష్టంగా ఉన్నాయి. 600 షేర్లు క్షీణించగా, 73 షేర్లు ఎలాంటి మార్పు లేకుండా ట్రేడవుతున్నాయి.

రంగాల వారీగా షేర్ పరిస్థితి
రంగాల వారీగా చూస్తే, ఐటీ, మెటల్ రంగాలు మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు వృద్ధిలో గ్రీన్ జోన్‌లో ట్రేడవుతున్నాయి. గరిష్టంగా 1.54 శాతం పెరుగుదల కనిపించగా, రియల్టీ స్టాక్స్ 1.19 శాతం లాభంతో ట్రేడవుతున్నాయి.

ప్రీ-ఓపెనింగ్‌లో మార్కెట్ కదలిక
ఈరోజు మార్కెట్ ప్రీ-ఓపెనింగ్‌లో బిఎస్‌ఇ సెన్సెక్స్ 319.08 పాయింట్లు లేదా 0.42 శాతం పెరిగి 77012.44 స్థాయి వద్ద ట్రేడవుతోంది. ఈ విధంగా, సెన్సెక్స్ మొదటిసారిగా ప్రీ-ఓపెనింగ్‌లోనే 77 వేల స్థాయిని సాధించింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 41.65 పాయింట్లు లేదా 0.18 శాతం లాభంతో 23331.80 వద్ద ట్రేడవుతోంది.