NTV Telugu Site icon

Tomato Price: పూర్తిగా పతనమైన టమాటా ధర.. కిలో 30 పైసలే!

Tomato

Tomato

Tomato Price: మొన్నటి వరకు సామాన్యులను ఏడిపించిన టమాటా.. ఇప్పుడు రైతులను ఏడిపిస్తోంది. దాదాపు మూడు నెలల పాటు సాధారణ ప్రజలు వాటిని తినాలంటేనే భయపడ్డారు. కానీ ఇప్పుడు ఆ టమాటాలు కొనే నాథుడు లేక పశువులకు ఆహారంగా మారుతున్నాయి. 3 నెలల వరకు కిలో రూ. 300 వరకు పలికిన టమాటా.. ఇప్పుడు 30 పైసలకు కూడా కొనే దిక్కులేక నేలపాలవుతోంది. పంట పండించిన రైతులు రవాణా ఛార్జీలు కూడా రావనే ఉద్దేశంతో టమాటాలను రోడ్డు పక్కనే పారబోస్తున్నారు.

నంద్యాల జిల్లా ప్యాపిలి మార్కెట్, కర్నూలు జిల్లాలోని పత్తికొండ వ్యవసాయ మార్కెట్లలో టమాటా ధరలు పూర్తిగా పతనమయ్యాయి. 25 కేజీల బాక్స్ 10 రూపాయల నుంచి 35 రూపాయలు పలుకుతోంది. అంటే కేజీ టమాటా ధర దాదాపు 30 నుంచి 40 పైసలు పలుకుతోంది. దీంతో గిట్టుబాటు ధరలు లేక రోడ్లపై రైతులు టమాటాలను పారబోస్తున్నారు. గత జూన్, జులై నెలలో టమోటా ధరలు అమాంతంగా పెరిగిన విషయం తెలిసిందే. మునుపెన్నడూ లేని రీతిలో ఏకంగా కిలో టమోటా ధర రూ. 200 దాటింది. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో అయితే కిలో టమోటా రూ. 250 వరకు పలికింది. ఆగస్టు 10 వరకు ఇదే పరిస్థితి నెలకొంది. దాంతో సామాన్య ప్రజలు టమోటా జోలికే పోలేదు. ప్రస్తుతం సీన్ మొత్తం మారిపోయింది. కొండెక్కిన టమాటా ధరలు ఈ 20 రోజుల్లో నేల మీద పారబోసే స్థాయికి చేరుకున్నాయి. పలు ప్రాంతాల నుంచి టన్నుల కొద్దీ పంట వస్తుండటం, ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలుదారులు రాకపోవడంతో.. టమాటా ధర ఒక్కసారిగా పడిపోయింది. దాంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఓ నెల క్రితం మార్కెట్‌కు టమాటాలు తీసుకొచ్చి జేబు నిండా డబ్బులు తీసుకెళ్లిన రైతు.. ఇప్పుడు ఖాళీ జేబులతో ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.

Also Read: Minister RK Roja: చంద్రబాబుది మాటల ప్రభుత్వం.. జగన్ మోహన్ రెడ్డిది చేతల ప్రభుత్వం

పెరిగిన టమాటా ధరలు జూన్, జూలై నెలలో రైతులకు కాసుల వర్షం కురిపించాయి. ఊహకందని ధరలతో కొందరు రైతులను టమాటా కోటీశ్వరులను చేసింది. ఇదే విషయాన్ని రైతులు స్వయంగా చెప్పారు. టమోటాకు ఇంత ధర ఎప్పుడూ లేదని, చాలా డబ్బు సంపాదించామని తెలిపారు. అయితే ఇప్పుడు అదే టమోటా రైతుకు కంటతడి పెట్టిస్తోంది. గిట్టుబాటు ధర లేక పూర్తిగా నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. పంటకు పెట్టుబడి, ఎరువులు, కూలీల ఖర్చులు కూడా పూడే పరిస్థితి లేదని కంటతడి పెట్టుకుంటున్నారు. కొన్ని రోజుల పాటు వర్షాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని, తీరా పంట చేతికి వచ్చే సమయానికి వర్షాలు కురుస్తూ నష్టాలను కలిగిస్తున్నాయని అన్నదాతలు వాపోతున్నారు. నష్టాల్లో ఉన్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.