Today Stock Market Roundup 21-03-23: ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఇవాళ మంగళవారం మంచి జోష్ కనిపించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ట్రేడింగ్ పాజిటివ్గానే నడిచింది. పాశ్చాత్య దేశాల్లో బ్యాంకింగ్ సంక్షోభానికి సంబంధించిన భయాలు తగ్గుముఖం పట్టడం మన మార్కెట్కి కలిసొచ్చింది. దీంతో ఈక్విటీ బెంచ్మార్క్ సూచీలు భారీ లాభాలను ఆర్జించాయి.
సెన్సెక్స్ మళ్లీ 58 వేల పాయింట్లు దాటింది. చివరికి.. 445 పాయింట్లు పెరిగి 58 వేల 74 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 119 పాయింట్లు పెరిగి 17 వేల 107 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. సెన్సెక్స్లోని మొత్తం 30 కంపెనీల్లో 18 కంపెనీలు లాభాలు పొందగా మిగతా 12 కంపెనీలు నష్టాలను మూటగట్టుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లో రిలయెన్స్, ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ట్విన్స్, నెస్లె, టైటాన్, ఎల్ అండ్ టీ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్ మంచి పనితీరు కనబరిచాయి.
read more: ChatGPT: మార్కెట్లోకి కొత్త యాంకర్. ఈమెనెప్పుడైనా చూశారా?
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో అదానీ ఎంటర్ప్రైజెస్, ఎస్బీఐ లైఫ్ రాణించాయి. ఐటీసీ, పవర్గ్రిడ్, ఇండస్ఇండ్ బ్యాంక్, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, టెక్ మహింద్రా, జేఎస్డబ్ల్యూ స్టీల్ సంస్థలు రెండు ఇండెక్స్ల్లోనూ నష్టాల బాటలోనే సాగాయి. రంగాల వారీగా పరిశీలిస్తే.. నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్, కన్జ్యూమర్ డ్యూరబుల్ సూచీలు ఒక శాతం చొప్పున పెరిగాయి. నిఫ్టీ ఐటీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ ఇండెక్స్లు మాత్రం నేలచూపులు చూశాయి.
వ్యక్తిగత స్టాక్స్ విషయానికొస్తే.. మణప్పురం ఫైనాన్స్కి ప్రాఫిట్స్ కొనసాగాయి. ఈ సంస్థ షేర్ విలువ ఈ నెలలో ఇప్పటివరకు 14 శాతం ర్యాలీ తీసింది. జీ ఎంటర్టైన్మెంట్ స్టాక్ వ్యాల్యూ 4 రోజుల్లోనే 14 శాతం పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర 207 రూపాయలు తగ్గింది. గరిష్టంగా 59 వేల 299 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. కేజీ వెండి రేటు స్వల్పంగా 28 రూపాయలు పెరిగింది.
అత్యధికంగా 68 వేల 866 రూపాయలు పలికింది. క్రూడాయిల్ ధర 161 రూపాయలు పెరిగింది. ఒక బ్యారెల్ ముడి చమురు 5 వేల 693 రూపాయలుగా నమోదైంది. రూపాయి వ్యాల్యూ 8 పైసలు బలహీనపడింది. డాలరుతో పోల్చితే మారకం విలువ 82 రూపాయల 68 పైసల వద్ద స్థిరపడింది.