Today Business Headlines 28-04-23:
స్విగ్గీలో 10 వేల జాబులు
ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఈ సంవత్సరం పది వేల మందికి ఉద్యోగాలు ఇవ్వనుంది. ఈ మేరకు అప్నా అనే కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. కొత్తగా నియమించుకునే ఉద్యోగులను తన ఇన్స్టామార్ట్ సర్వీసుల కోసం వాడుకోనుంది. ముఖ్యంగా టయర్ వన్, టయర్ టు సిటీల్లో ఈ రిక్రూట్మెంట్ చేపట్టనుంది. ఈ నగరాల్లో డెలివరీ నెట్వర్క్ని పెంచుకోవటం కోసమే నియామకాలు చేపడుతోంది. ఇన్స్టామార్ట్ అనేది స్విగ్గీలో నిత్యావసరాలను ఫాస్ట్గా డెలివరీ చేసే సేవల విభాగం అనే సంగతి తెలిసిందే.
మరిన్ని సిటీలకి లుఫ్తాన్సా
యూరప్కి చెందిన విమానయాన సంస్థ లుఫ్తాన్సా మన దేశంలో మరిన్ని సిటీలకు తన సర్వీసులను విస్తరించనుంది. మ్యూనిచ్ నుంచి బెంగళూరుకి, ఫ్రాంక్ఫర్ట్ నుంచి హైదరాబాద్కి విమాన సేవలను ప్రారంభించనుంది. మ్యూనిచ్-బెంగళూరు రూట్లో వారానికి మూడు సార్లు విమానాలు రాకపోకలు సాగిస్తాయి. తొలి సర్వీసును నవంబర్ 3వ తేదీన లాంఛ్ చేయనున్నారు. ఫ్రాంక్ఫర్ట్-హైదరాబాద్ మార్గంలో వచ్చే శీతాకాలంలో విమానాలు అందుబాటులోకి రానున్నాయి.
అందుకే.. ఆ బ్యాంకులు..
అమెరికాలో బ్యాంకింగ్ సంక్షోభానికి దారితీసిన కారణాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంతదాస్ వివరించారు. బిజినెస్ మోడల్స్ దరిద్రంగా ఉండటం వల్లే సిలికాన్ వ్యాలీ బ్యాంక్ కుప్పకూలిందని చెప్పారు. మన బ్యాంకింగ్ వ్యవస్థకు అలాంటి ప్రమాదాలేమీ లేవని అన్నారు. మన దేశ బ్యాంకుల వ్యాపార నమూనాలను సునిశితంగా పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. బ్యాంకుల బోర్డులు, మేనేజ్మెంట్లు ఫైనాన్షియల్ రిస్కులను గమనిస్తూ ఉండాలని సూచించారు. క్యాపిటల్ మరియు క్యాష్ లిక్విడిటీపై ఫోకస్ పెట్టాలని శక్తికాంతదాస్ వివరించారు.
మరో చేతికి.. కామసూత్ర
రేమండ్ కన్జ్యూమర్ కేర్ లిమిటెడ్ కంపెనీ.. ఎఫ్ఎంసీజీ రంగం నుంచి పూర్తిగా తప్పుకోనుంది. ఈ బిజినెస్ని గోద్రెజ్ కంపెనీకి అప్పగించనుంది. ఈ డీల్ విలువ 2 వేల 825 కోట్ల రూపాయలు. ఈ మేరకు ఇరు వర్గాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో.. పార్క్ అవెన్యూ ప్రీమియం వంటి టాల్కం పౌడర్, షేవింగ్ క్రీమ్లు, కామసూత్ర వంటి ఫ్యామిలీ ప్లానింగ్ ప్రొడక్టులు గోద్రెజ్ సంస్థకు సొంతమవుతాయి. ఈ వ్యాపార బదిలీ ప్రక్రియ మే నెల 10వ తేదీ కల్లా పూర్తి కానుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
విప్రో సంస్థ షేర్ల బైబ్యాక్
ఐటీ దిగ్గజ సంస్థల్లో ఒకటైన విప్రో.. ఓపెన్ మార్కెట్ నుంచి 12 వేల కోట్ల రూపాయల విలువైన షేర్లను బైబ్యాక్ చేయనున్నట్లు తెలిపింది. బైబ్యాక్ అంటే.. తిరిగి కొనుగోలు చేయటం అని అర్థం. కంపెనీ ఈక్విటీలో 4 పాయింట్ తొమ్మిది ఒకటి శాతానికి సమానమైన 26 కోట్ల 96 లక్షల 62 వేల 921 షేర్లను బైబ్యాక్ చేయనుంది. ఈ మేరకు కంపెనీ బోర్డు అంగీకారం తెలిపింది. ఒక్కో షేర్కి 445 కోట్ల రూపాయలు చెల్లిస్తామని విప్రో సీఈఓ థియెరీ డెలాపోర్ట్ పేర్కొన్నారు.
ఐటీఆర్ ఆఫ్లైన్ ఫామ్స్
ఆదాయపు పన్ను విభాగం.. ఇన్కం ట్యాక్స్ రిటర్న్ల ఫైలింగ్ కోసం.. ఐటీఆర్ వన్ మరియు ఐటీఆర్ ఫోర్కి సంబంధించిన ఆఫ్లైన్ ఫామ్స్ని ఇటీవల విడుదల చేసింది. ఆన్లైన్ ఫామ్స్ని రిలీజ్ చేయాల్సి ఉంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీ రిటర్న్స్ని ఈ ఫామ్స్ ద్వారా ఫైల్ చేయొచ్చు. దీన్నే అసెస్మెంట్ ఇయర్ 2023-24గా పేర్కొంటారు. ఐటీ విభాగం ప్రతి సంవత్సరం ఈ ఫామ్స్ విడుదల చేస్తుంది. ఇందులో భాగంగానే ఈ ఏడాది కూడా అందుబాటులోకి తెచ్చింది.