Today (14-02-23) Business Headlines:
సుజుకీతో టీ హబ్ ఒప్పందం
జపాన్ కంపెనీ సుజుకీ మోటార్తో తెలంగాణ హబ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇక్కడి స్టార్టప్లు ఆ దేశంలోని అవకాశాలను అందిపుచ్చుకోవటానికి ఇది ఉపయోగపడుతుందని పేర్కొంది. టీ హబ్లోని స్టార్టప్లు సుజుకీ ఇన్నోవేషన్ సెంటర్ ద్వారా గైడెన్స్ పొందొచ్చని తెలిపింది. మొబిలిటీ సెక్టార్లో ఎదురయ్యే ఛాలెంజ్లకు ఇదొక సొల్యూషన్ మాదిరిగా తోడ్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఇండియన్ స్టార్టప్స్ వరల్డ్ వైడ్గా రాణించేందుకు వీలు కలుగుతుందని టీ హబ్ సీఈఓ శ్రీనివాసరావు అన్నారు.
IAICC హైదరాబాద్ చాప్టర్
ఇండియన్ అమెరికన్ ఇంటర్నేషనల్ ఛాంబ్ ఆఫ్ కామర్స్.. IAICC.. హైదరాబాద్ చాప్టర్ తొలి చైర్మన్గా సురేష్ రాయుడు చిట్టూరి నియమితులయ్యారు. అగ్రరాజ్యం అమెరికాలో ఉంటున్న మన దేశస్తులు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్లు పెట్టేందుకు ఈ సంస్థ కృషి చేస్తుందని చెప్పారు. IAICC హైదరాబాద్ చాప్టర్ ఆవిర్భావ సభ సోమవారం హైదరాబాద్లో జరిగింది. మరో అర్ధ శతాబ్ధంలో ఇండియన్ ఎకానమీ 40 లక్షల కోట్ల డాలర్ల రేంజ్కి ఎదుగుతుందని పేర్కొన్నారు. సురేష్ రాయుడు చిట్టూరి.. శ్రీనివాసా ఫార్మ్స్ సంస్థకు వైస్ ప్రెసిడెంట్ అండ్ ఎండీ అనే సంగతి తెలిసిందే. IAICCకి ఇప్పటికే ఢిల్లీ, ముంబై, బెంగళూరుల్లో చాప్టర్లు ఉన్నాయి.
రిటైల్ ద్రవ్యోల్బణంలో వృద్ధి
జనవరి నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 3 నెలల గరిష్టానికి చేరుకుంది. తద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన కంఫర్ట్ జోన్ను మళ్లీ దాటిపోయింది. అక్టోబర్లో రిటైల్ ఇన్ఫ్లేషన్ అత్యధికంగా 6 పాయింట్ ఏడు ఏడు శాతానికి చేరుకోగా జనవరిలో 6 పాయింట్ ఐదు రెండు శాతంగా నమోదైంది. పప్పు ధాన్యాలు, ప్రొటీన్ ప్రొడక్ట్స్తోపాటు ఆహార పదార్థాల రేట్లు పెరగటం ఈ పరిస్థితికి దారితీసింది. ఈ డేటాను కేంద్ర ప్రభుత్వం సోమవారం వెల్లడించింది. ఆహార పదార్థాల ద్రవ్యోల్బణ రేటు డిసెంబర్లో నాలుగు పాయింట్ ఒకటీ తొమ్మిది మాత్రమే ఉండగా జనవరిలో 5 పాయింట్ తొమ్మిది నాలుగు శాతానికి పెరిగింది.
హైదరాబాద్ ఐఎస్బీ మళ్లీ
హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్.. ISB.. మరోసారి.. దేశంలోనే నంబర్ వన్ బిజినెస్ స్కూల్గా నిలిచింది. ఇంటర్నేషనల్ టాప్-50 బిజినెస్ స్కూల్స్లో 39వ ర్యాంకును, ఆసియాలో 6వ స్థానాన్ని దక్కించుకుంది. హైదరాబాద్ ISBలోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఫస్ట్ ప్లేస్లో నిలవటం విశేషం. ఫైనాన్షియల్ టైమ్స్ సంస్థ.. గ్లోబల్ ఎంబీఏ ర్యాంకింగ్-2023 పేరుతో వీటిని విడుదల చేసింది. అంతర్జాతీయంగా అగ్ర స్థానంలో ఉన్న 50 బిజినెస్ స్కూల్స్లో ఇండియా నుంచి హైదరాబాద్ ISBకి మాత్రమే చోటు లభించటం చెప్పుకోదగ్గ అంశం. పరిశోధనల విషయంలోనూ ఇది ఇండియాలో తిరుగులేని సంస్థగా పేరొందింది.
కోనసీమ ఆస్తులు అమ్మకానికి
కోనసీమ గ్యాస్ పవర్ లిమిటెడ్.. KGPL ఆస్తులను విక్రయించాలని నిర్ణయించారు. ఈ మేరకు బిడ్లను సైతం ఆహ్వానించారు. ఔత్సాహికులు ఈ నెల 27వ తేదీ లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మార్చి 13వ తేదీన ఇ-వేలం జరుగుతుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని రావులపాలెంలో ఈ సంస్థకు ఉన్న 445 మెగావాట్ల న్యాచురల్ గ్యాస్ బేస్డ్ కంబైన్డ్ సైకిల్ పవర్ ప్లాంట్ను అమ్ముతారు. దీంతోపాటు ఈ ప్లాంట్కు చెందిన 126 ఎకరాలకు పైగా భూమిని మరియు మరో ఆరెకరాల స్థలాన్ని సైతం విక్రయిస్తారు. వీటి కోసం కనీసం 281 కోట్ల రూపాయలతో బిడ్ను సమర్పించాల్సి ఉంటుంది.
వర్చువల్ మెడికల్ రిప్రజంటేటివ్
హైదరాబాద్లోని ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్.. IIL.. సరికొత్త ఆవిష్కరణ చేసింది. వర్చువల్ మెడికల్ రిప్రజంటేటివ్ల మాదిరిగా పనిచేసే ఒక ప్లాట్ఫామ్ను ప్రారంభించింది. డాక్టర్లు, మెడికల్ రిప్రజంటేటివ్లు సమాచారాన్ని పరస్పరం పంచుకోవటానికి ఇ-మోజ్ పేరుతో మోడ్రన్ టూల్ని ప్రవేశపెట్టింది. కొవిడ్ నేపథ్యంలో మెడికల్ రిప్రజంటేటివ్లు డాక్టర్లను కలవటం కష్టంగా మారటంతో ఈ ఆలోచనకు కార్యరూపం ఇచ్చినట్లు ఐఐఎల్ తెలిపింది. వైద్యులకు కావాల్సిన సమాచారాన్ని ఈ పరికరం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి అందిస్తుంది.