Today (13-01-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్ వ్యాపారం ఎట్టకేలకు మురిసింది. ఈ వారాంతాన్ని లాభాలతో ముగించింది. ఇవాళ శుక్రవారం ఉదయం కూడా నష్టాలతోనే ప్రారంభమైన సూచీలు.. మొత్తానికి.. ఇంట్రాడేలో కోలుకొని.. చివరికి పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. సెన్సెక్స్ ఒకానొక దశలో 59 వేల 628 పాయింట్లకు పడిపోయి.. మళ్లీ.. 60 వేల 418 పాయింట్లకు ర్యాలీ తీసింది. నిఫ్టీ కూడా తిరిగి 18 వేల పాయింట్ల బెంచ్ మార్క్ను చేరుకుంది.
ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్, హెచ్యూఎల్, టాటా స్టీల్ స్టాక్స్ ఒక శాతానికి పైగా లాభపడటం కలిసొచ్చింది. ఇండియా మరియు అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ను పెంచాయి. సెన్సెక్స్ 303 పాయింట్లు లాభపడి 60 వేల 261 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 98 పాయింట్లు పెరిగి 17 వేల 956 పాయింట్ల వద్ద ముగిసింది. 18 వేల బెంచ్ మార్క్ను చేరుకోలేకపోయింది.
read more: Non-Tech Sector Hiring: పెరగనున్న వైట్ కాలర్ ఉద్యోగ నియామకాలు
సెన్సెక్స్లోని మొత్తం 30 కంపెనీల్లో 21 కంపెనీలు లాభాల బాటలో నడిచాయి. ఇండస్ ఇండ్, మారుతి, అల్ట్రాటెక్ సిమెంట్, హిందుస్థాన్ యూనీలీవర్, ఎస్బీఐ షేర్లు బాగా రాణించాయి. మిడ్క్యాప్ ఇండెక్స్ సున్నా పాయింట్ ఒక శాతం, స్మాల్క్యాప్ ఇండెక్స్ సున్నా పాయింట్ 3 శాతం పెరిగాయి. ఎల్టీటీఈస్, జీఈ షిప్పింగ్, బాటా ఇండియా బాగా వెనకబడ్డాయి.
నిఫ్టీలో మెటల్ మరియు పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్లు ఉత్తమ పనితీరు కనబరిచాయి. లాభపడ్డ సంస్థల్లో అదానీ ఎంటర్ప్రైజెస్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐషర్ మోటర్స్ టాప్లో నిలిచాయి. టైటాన్, ఎస్బీఐ లైఫ్, అపోలో హాస్పిటల్స్ తీవ్రంగా దెబ్బతిన్నాయి. సెక్టార్ల వారీగా చూస్తే పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ట్రేడింగ్లో దూసుకుపోయాయి. కెనరా బ్యాంక్ స్టాక్స్ 2 శాతానికి పైగా లాభపడ్డాయి.
వ్యక్తిగత స్టాక్స్ విషయానికొస్తే ఇండియా వీఐఎక్స్ షేర్లు 4 శాతానికి పైగా బోల్తా కొట్టాయి. టైటాన్ కంపెనీ షేర్ల విలువ కూడా 2 శాతం తగ్గి 4 నెలల కనిష్టానికి పడిపోయింది. 52 వారాల గరిష్టం నుంచి 14 శాతం పతనమయ్యాయి. 10 గ్రాముల బంగారం ధర 245 రూపాయలు పెరిగి గరిష్టంగా 56 వేల 120 రూపాయల వద్ద ట్రేడ్ అయింది.
కేజీ వెండి రేటు స్వల్పంగా 46 రూపాయలు నష్టపోయి అత్యధికంగా 68 వేల 597 రూపాయలు పలికింది. క్రూడాయిల్ ధర 25 రూపాయలు పెరిగి ఒక బ్యారెల్ చమురు 6 వేల 416 రూపాయలుగా నమోదైంది. రూపాయి వ్యాల్యూ 16 పైసలు తగ్గింది. డాలరుతో పోల్చితే మారకం విలువ 81 రూపాయల 41 పైసల వద్ద స్థిరపడింది.