Today (05-01-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్ తీరు మారలేదు. రెండు కీలక సూచీలు కూడా నిన్నటిలాగే నష్టాల బాటలోనే నడిచాయి. ఈ రోజు గురువారం ఉదయం లాభాలతో ప్రారంభమైనప్పటికీ లాస్లతో ముగిశాయి. ఎఫ్ఎంసీజీ రంగంలో షేర్ల కొనుగోళ్లు పెరగటంతో ఇంట్రాడే నష్టాల నుంచి కాస్తయినా కోలుకోగలిగాయి. సెన్సెక్స్ ఒకానొక దశలో 60 వేల 50 పాయింట్లకు పడిపోయింది.
నిఫ్టీ50 కూడా 18 వేల మార్క్ నుంచి పతనమై 17 వేల 950కి డౌన్ అయింది. సెన్సెక్స్ నిన్న, ఇవాళ రెండు రోజుల్లోనే 12 వందలకు పైగా పాయింట్లు కుప్పకూలటం గమనించాల్సిన విషయం. సెన్సెక్స్ చివరికి 304 పాయింట్లు కోల్పోయి 60 వేల 353 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 50 పాయింట్లు నష్టపోయి 17 వేల 992 పాయింట్ల వద్ద ముగిసింది.
read more: India’s Hiring Intent: ‘అనుభవం’ ఎవరికి కావాలండి?. Q4లో సంస్థల నియామక ఉద్దేశాలు.
బీఎస్ఈలో ఇంజనీర్స్ ఇండియా, సియెట్, అపోలో టైర్స్ అధికంగా లాభపడ్డాయి. ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఏబీబీ, బజాజ్ ఫైనాన్స్ తీవ్రంగా దెబ్బతిన్నాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్క్యాప్ ఇండెక్స్లు ఫర్వాలేదనిపించాయి. నిఫ్టీలో ఎక్కువ శాతం స్టాక్స్ రాణించాయి. సిప్లా, బజాజ్ ఆటో, జేఎస్డబ్ల్యూ స్టీల్ విన్నర్స్గా నిలిచాయి. ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, టైటాన్ షేర్లు నీరసించాయి.
ఓవరాల్గా.. ఐటీసీ, సన్ ఫార్మా, ఎన్టీపీసీ, నెస్లే ఇండియా, హెచ్యూఎల్ స్టాక్స్ లాభాలను ఆర్జించాయి. పవర్ గ్రిడ్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, విప్రో, ఇన్ఫోసిస్, టైటాన్ల షేర్లు కూడా బాగా డీలా పడ్డాయి. రంగాల వారీగా పరిశీలిస్తే.. నిఫ్టీలో ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ దాదాపు ఒకటిన్నర శాతం లాభపడింది. ఫైనాన్సియల్ సర్వీసెస్ ఇండెక్స్ జీరో పాయింట్ 8 శాతం వెనకబడింది. వ్యక్తిగత స్టాక్స్ విషయానికొస్తే బజాజ్ ఫైనాన్స్ షేర్ల విలువ భారీగా.. అంటే.. 8 శాతానికి పైగా తగ్గింది.
ఈ సంస్థ వెల్లడించిన తన నిర్వహణలో ఉన్న ఆస్తుల వివరాలు మార్కెట్ అంచనాలకు తగ్గట్లు లేకపోవటం పెద్ద మైనస్ అయింది. 10 గ్రాముల బంగారం రేటు 192 రూపాయలు తగ్గి గరిష్టంగా 55 వేల 575 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. కేజీ వెండి ధర 840 రూపాయలు నష్టపోయి 68 వేల 478 రూపాయల వద్ద స్థిరపడింది. రూపాయి వ్యాల్యూ 25 పైసలు పతనమైంది. డాలరుతో పోల్చితే 82 రూపాయల 56 పైసలుగా నమోదైంది.