తెలుగోడి సత్తా ప్రపంచానికి చాటి చెప్పాడు.. అతడి పేరు వింటేనే దాయాదికి ముచ్చెమటలు పట్టేలా చేశాడు. ఓటమి తీరాలకు వెళ్తున్న మ్యాచ్కు ఒంటరిపోరాటంతో గెలుపుబాటలు వేశాడు.. అతడే తిలక్ వర్మ. ప్రపంచమంతా ఈ పేరే మార్మోగుతోంది. హైఓల్టేజ్ మ్యాచ్లో చెలరేగి ఆడిన తిలక్వర్మ.. ఆసియా కప్ భారత్ వశం అయ్యేలా చేశాడు. తిలక్ వర్మ.. మా హైదరాబాదీ అని కాలర్ ఎగరేసి చెప్పుకుంటున్నారు క్రికెట్ లవర్స్.
Also Read:Telangana: ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ ముగింపు.. క్రాస్ ఎగ్జామినేషన్ కీలక దశ
భారత్.. పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే చాలు థ్రిల్లింగ్ గా ఉండాలని భావిస్తుంటారు క్రికెట్ ఫ్యాన్స్ !! ఆసియా కప్ ఫైనల్ లో భాగంగా జరిగిన దాయాదుల మధ్య పోరు… అభిమానులు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే వందరెట్లు కిక్ ఇచ్చింది. నరాలు తెగే ఉత్కంఠ రేపింది మ్యాచ్. చివరి రెండు ఓవర్లు మాత్రం.. ఏ ఒక్కరూ కుదురుగా కూర్చుని మ్యాచ్ చూసి ఉండరు. దేవుళ్లను ప్రార్థిస్తూ.. ఫ్రీజ్ ఐపోయి మరీ టీవీలకు అతుక్కుపోయి ఉంటారు.
టార్గెట్ చిన్నదే ఐనా.. లక్ష్య చేధనలో తడబడింది టీం ఇండియా. వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. ఆశలన్నీ అభిషేక్ పై పెట్టుకుంటే.. 5 పరుగులకే పెవీలియన్ చేరాడు. ఈ మ్యాచ్ లోనైనా ఇరగదీస్తాడనుకున్న సూర్య కుమార్ యాదవ్.. ఒక్క పరుగుకే వెనుదిరిగాడు. ఎప్పటిలాగే గిల్ 12 రన్స్ కే ఔట్ అయి నిరాశపర్చాడు. అప్పుడొచ్చాడు ఒక ధీరుడు !! అతడే తిలక్ వర్మ !! ఎలాంటి ఒత్తిడికి లోనవకుండా… నిలకడగా ఆడాడు. ఎవరైనా కోపంగా కొడతారు.. లేదా బలంగా కొడతారు. తిలక్ వర్మ మాత్రం శ్రద్ధగా కొట్టాడు. ఏదో గొడ కడుతున్నట్లు.. గులాబీ మొక్కకు అంటు కడుతున్నట్లు.. చాలా క్లాసిక్గా ఆడాడు తిలక్. సంజూ శాంసన్.. శివం దూబేలతో కలిసి అద్భుతమైన పార్ట్నర్షిప్ బిల్డ్ చేశాడు. వీడు మగాడ్రా బుజ్జీ అనుకునేలా చేశాడు తిలక్ వర్మ.
20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న భారత్ను తిలక్, సంజూ శాంసన్ గట్టెక్కించారు. 57 పరుగుల పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. సంజూ ఔట్ ఐన తర్వాత కూడా తిలక్ నిలకడగా ఆడాడు. శివం దూబేతో కలిసి ఏకంగా 60 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. 53 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 69 పరుగులు చేసి భారత్ను గెలిపించాడు. తిలక్ పై టీం ఇండియా ఫ్యాన్స్ పెట్టుకున్న ఆశలను నేరవేర్చాడు. తిలక్ ఆటతీరు చూస్తే.. ఇండియాన్ క్రికెట్ ఫ్యాన్సే కాదు.. కంట్రీ ఏదైనా సరే.. క్రికెట్ తెలిసిన ప్రతోడూ.. ఈ తెలుగోడి ఆటకు ఫిదా అవ్వాల్సిందే !! అలా ఆడాడు.
నిన్నటి మ్యాచ్ తర్వాత తిలక్ ఫ్యాన్ ఫాలోయింగ్ వెయ్యిరెట్లు పెరిగింది. తిలక్ వర్మది హైదరాబాద్ కావడంతో… క్రికెట్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసి మరీ చెప్పుకుంటున్నారు… వాడు మా వాడు రా .. మన హైదరాబాదీ రా..!! అని గర్వంగా చెప్పుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల సీఎం లు మొదలుకుని.. సినీ, రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, క్రికెట్ లెజెండరీస్ సైతం తిలక్ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
తండ్రి నాగరాజు సాధారణ ఉద్యోగి !! తెలంగాణ విద్యుత్ శాఖలో లైన్మెన్ !! తల్లి గాయత్రీదేవి హౌజ్వైఫ్ ! క్రికెట్పై ఆసక్తి ఉన్న తిలక్ను చిన్నప్పటి నుంచే ఎంకరేజ్ చేశారు. చందానగర్ పీజేఆర్ స్టేడియంలో కోచ్ సలాం భాష లో క్రికెట్ ఓనమాలు నేర్చుకున్నాడు. 2018-19 లో రంజీ ట్రోఫీ.. హైదరాబాద్ తరఫున ఆరంగేట్రం చేశాడు. 2020 అండర్ -19 వరల్డ్ కప్ టీంలో మెంబర్ గా ఉన్నాడు. 2022 నాటికి లిస్ట్ ఏ లో 16 మ్యాచులు ఆడి784 పరుగులు చేశాడు. ఐపీఎల్ ప్రాంచైజీల దృష్టిలో పడ్డాడు. 20 లక్షల బేస్ ప్రైస్తో ఆక్షన్ లో ఉన్న తిలక్ వర్మను దక్కించుకునేందుకు సన్ రైజర్స్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ పోటీ పడ్డాయి. ఊహించని విధంగా కోటి 70 లక్షలకు ముంబై ఇండియన్స్ తిలక్ను సొంతం చేసుకుంది. వేలం లోకి వచ్చిన మొదటి సీజనే.. అధరగొట్టాడు తిలక్ వర్మ.
తిలక్ దశ, దిశ మారిపోయింది !! ముంబై ఇండియన్స్ టీంలో స్టార్ ప్లేయర్గా మారిపోయాడు. కొన్నాళ్లకు టీం ఇండియాలో చోటు దక్కించుకున్నాడు. అవకాశం ఇచ్చిన ప్రతీసారి తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు వరల్డ్ క్రికెట్ అంతా.. తన పేరు తలుచుకునేలా చేశాడు తిలక్.
