Crop Loan Waiver: తెలంగాణ రైతులకు శుభవార్త.. రేపే మూడో విడత రుణమాఫీ

  • రేపే మూడో విడత రుణమాఫీ
  • రేపు వైరాలో ప్రకటించనున్న సీఎం రేవంత్ రెడ్డి
Rytu Runamafi

Rytu Runamafi

Crop Loan Waiver: మూడో విడత రుణమాఫీ రేపు ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. మూడో విడత కింద రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు రుణమాఫీని రేపు ఖమ్మం జిల్లా వైరాలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఆ వెంటనే రైతుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. ఈ క్రమంలో అన్నదాతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాదాపు 14.45 లక్షల మందికి రుణమాఫీ అవుతుందని అంచనా. కాగా విదేశాల నుంచి రేవంత్ ఇవాళ హైదరాబాద్‌కు చేరుకుంటారు. రేపు గోల్కొండ కోటలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం హెలికాప్టర్‌ల వైరాకు పయనమవుతారు. అక్కడ సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవం అనంతరం జరిగే బహిరంగ సభలో రుణమాఫీని ప్రకటిస్తారు. రుణమాఫీకి అర్హమైన ఖాతాలు మొత్తంగా 32.50 లక్షలు ఉన్నట్లు వ్యవసాయ శాఖ గుర్తించింది. ఈ మేరకు సర్కారు బడ్జెట్‌లో నిధులను కేటాయించింది.

Read Also: Actress Regina Cassandra: మంత్రి సీతక్కను కలిసిన హీరోయిన్ రెజీనా.. ఎందుకంటే?

ఇప్పటికే రెండు విడతల్లో రుణమాఫీ జరిగిన విషయం తెలిసిందే. లక్షన్నర వరకు రెండు విడతల్లో రుణమాఫీ చేసినట్టు ప్రకటించినా పలువురికి రుణాలు జమ కాలేదు. సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని రైతులకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ గుడ్‌న్యూస్ చెప్పారు. వారి కోసం నెల రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించారు. ఆధార్‌ కార్డు, పాస్‌బుక్‌లో పేర్లలో మార్పులు, కుటుంబాల్లో పంపకాలు పూర్తి కాకపోవడం వంట కారణాలతో పలువురికి రుణమాఫీ కాలేదు.