హింసాత్మక నిరసనల మధ్య ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా విధానాన్ని కొనసాగించాలన్న హైకోర్టు నిర్ణయాన్ని బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ఆదివారం రద్దు చేసింది. అయితే..సుప్రీం కోర్టు ఈ రిజర్వేషన్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయలేదు. కోటా విధానాన్ని ‘చట్టవిరుద్ధం’గా కొనసాగించాలన్న హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు పరిగణించిందని అటార్నీ జనరల్ ఏఎం అమీనుద్దీన్ ఓ వార్తా సంస్థకు తెలిపారు. ‘ప్రభుత్వ ఉద్యోగాల్లో 93 శాతం పోస్టులను మెరిట్ ప్రాతిపదికన భర్తీ చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. 1971 విముక్తి పోరాట యోధుల వారసులు, ఇతర కేటగిరీలకు 7 శాతం పోస్టులను మాత్రమే రిజర్వ్ చేయాలని తెలిపింది.
READ MORE: Brinda: ఇంట్రెస్టింగ్ కంటెంట్తో రాబోతున్న త్రిష “బృంద”..
బంగ్లాదేశ్లో ఇప్పుడు అమలవుతున్న కోటా విధానంలో 56 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు రిజర్వ్ చేయబడ్డాయి. వీటిలో 30 శాతం 1971 విముక్తి యుద్ధంలో యోధుల వారసులకు, 10 శాతం వెనుకబడిన పరిపాలనా జిల్లాలకు, 10 శాతం మహిళలకు, 5 శాతం జాతి మైనారిటీ వర్గాలకు, 1 శాతం వికలాంగులకు కేటాయించబడ్డాయి. స్వాతంత్య్ర సమరయోధుల వారసులకు 30 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఈ ఘటనలో ఇప్పటికే దాదాపు 100కి పైగా మృతి చెందారు.
2018 సంవత్సరంలో .. ఈ కోటా వ్యవస్థకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్లో హింసాత్మక విద్యార్థి ఉద్యమం జరిగింది. ఆ తర్వాత షేక్ హసీనా ప్రభుత్వం కోటా విధానాన్ని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాతంత్య్ర సమరయోధుల వారసులు హైకోర్టులో సవాలు చేశారు. గత నెలలో హైకోర్టు షేక్ హసీనా ప్రభుత్వ నిర్ణయాన్ని రద్దు చేసింది. కోటా విధానాన్ని కొనసాగించాలని తీర్పు ఇచ్చింది. కోర్టు ఈ నిర్ణయం తర్వాత బంగ్లాదేశ్ అంతటా హింసాత్మక నిరసనలు ప్రారంభమయ్యాయి. నిరసనకారులు ప్రజా ఆస్తులను ధ్వంసం చేశారు. బస్సులు మరియు రైళ్లకు నిప్పు పెట్టారు. పరిస్థితి అదుపు తప్పడంతో హసీనా ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దింపాల్సి వచ్చింది.
READ MORE:Bigg Boss Season 8: ఈసారి మరింత ఎంటర్టైన్మెంట్ అంటున్న నాగార్జున.. (వీడియో)
ఈ నిరసనల్లో ఇప్పటివరకు 133 మంది మరణించారు. 3000 మందికి పైగా గాయపడ్డారు. జులై 14న ప్రధాని షేక్ హసీనా నివాసంలో విలేకరుల సమావేశంలో విద్యార్థుల నిరసనల గురించి అడిగిన ప్రశ్నకు ఆమె బదులిస్తూ.. ‘స్వాతంత్ర్య సమరయోధుల మనవళ్లకు (కోటా) ప్రయోజనాలు అందకపోతే.. ఇంకెవరికి ఇస్తాం. ” అని ఆమె పేర్కొన్నారు. ఈ ప్రకటన తరువాత.. నిరసనకారులు మరింత దూకుడు పెంచారు. కాగా.. తాజా ఆందోళనల్లో ప్రతిపక్ష ‘బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP)’ మద్దతుదారులు సైతం పాల్గొన్నారు. వీరి వల్లే హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని అధికార పక్షం ఆరోపించింది. రాజకీయ ప్రయోజనాల కోసమే ఇలా చేస్తున్నారని పేర్కొంది. బీఎన్పీ మాత్రం వాటిని కొట్టిపారేసింది. తాము శాంతియుత నిరసనలకే పిలుపునిచ్చామని వివరణ ఇచ్చింది.