పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రేపు సుప్రీం కోర్టులో తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరగనుంది. జస్టిస్ దీపాంకరదత్త, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ల ధర్మాసనం కేసు విచారణ జరపనున్నారు. నిన్న 5 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ తీర్పు ప్రకటించారు. ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని స్పీకర్ స్పష్టం చేశారు. అనర్హత పిటిషన్ లను కొట్టివేశారు. ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్లపై అనర్హత వేటు వేయడానికి నిరాకరించారు. గత విచారణ సందర్భంగా స్పీకర్ నాలుగు వారాల్లోగా కోర్టు ధిక్కార పిటిషన్ పై జవాబు చెప్పాలని కోర్టు ఆదేశించింది. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై డిసెంబర్ 18వ తేదీ లోపు నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్కు సుప్రీంకోర్టు సూచించింది.
స్టాండింగ్ కౌన్సిల్ ద్వారా స్పీకర్ కు నోటీసులు పంపింది. ఎమ్మెల్యేల అనర్హతపై మీరు నిర్ణయం తీసుకుంటారా? మేము తీసుకోవాలా ? అంటూ ప్రశ్నించింది. తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారంలో కోర్టుదిక్కార పిటిషన్ పై తెలంగాణ స్పీకర్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోకపోవడంపై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు కేటీఆర్. రోజువారీగా విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని గవాయి సూచించారు. 4 వారాల్లోగా విచారణ పూర్తి చేస్తామని వెల్లడించారు స్పీకర్ తరపున న్యాయవాదులు అభిషేక్ సింగ్ , ముకుల్ రోహత్గి.
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించినట్లు 10 మంది ఎమ్మెల్యేలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు దాఖలయ్యాయి. డిసెంబర్ 18లోగా నిర్ణయాన్ని తమకు సీల్డ్ కవర్లో సమర్పించాలని సుప్రీంకోర్టు గత విచారణ సందర్భంగా తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో స్పీకర్ గత నెల రోజులుగా ఎమ్మెల్యేల విచారణను వేగవంతం చేశారు. 8 మందికి సంబంధించి విచారణను స్పీకర్ పూర్తి చేశారు. దానం నాగేందర్, కడియం శ్రీహరిపై దాఖలైన పిటిషన్లపై విచారణ ఇంకా పూర్తి కాలేదు.