ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ అందించింది. దసరాకు లక్కీ డ్రా నిర్వహించేందుకు రెడీ అయ్యింది. ప్రయాణికులు ఆర్టీసీ బస్సెక్కితే బహుమతులు అందించాలని నిర్ణయించింది. ఈ లక్కీ డ్రాలో రీజియన్కి ముగ్గురు చొప్పున 33 మందికి రూ.5.50 లక్షల విలువగల బహుమతులను సంస్థ అందజేయనుంది. ఒక్కో రీజియన్కు ప్రథమ బహుమతి రూ.25 వేలు, ద్వితీయ బహుమతి రూ.15 వేలు, తృతీయ బహుమతి రూ.10 వేలను సంస్థ ప్రకటించింది.
Also Read:Telangana : తెలంగాణలో దసరా షాపింగ్ బీభత్స ప్రారంభం.. హైదరాబాద్ మార్కెట్లలో ఉత్సాహం
ఈ లక్కీ డ్రాలో పాల్గొనాలంటే ఈ నెల 27 నుంచి అక్టోబర్ 6వ తేదీ వరకు టీజీఎస్ఆర్టీసీకి చెందిన హైఎండ్ బస్సులైన సెమీ డీలక్స్, మెట్రో డీలక్స్, డీలక్స్, సూపర్ లగ్జరీ, లహారి నాన్ ఏసీతో పాటు అన్ని రకాల ఏసీ బస్సుల్లో ప్రయాణించిన వారే అర్హులని సంస్థ తెలిపింది. ఈ సర్వీసుల్లో ఎక్కిన ప్రయాణికులు తమ ప్రయాణం పూర్తయిన తర్వాత టికెట్ పై తమ పూర్తి పేరు, ఫోన్ నెంబరు రాసి బస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్ ల్లో వేయాల్సి ఉంటుంది. ఈ నెల 27 నుంచి అక్టోబర్ 6 వరకు చేసిన ప్రయాణాలను మాత్రమే లక్కీ డ్రాకి సంస్థ పరిగణనలోకి తీసుకుంటుంది.
Also Read:OG : ఓజీలో విలన్ రోల్ మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా..?
ముందస్తు రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు ఈ లక్కీ డ్రాలో పాల్గొనవచ్చు. ప్రతి రీజియన్ పరిధిలో లక్కీ డ్రా నిర్వహించి ముగ్గురి చొప్పున విజేతలను అక్టోబర్ 8న ఎంపిక చేయనున్నారు. లక్కీ డ్రాకు సంబంధించిన పూర్తి వివరాలకు టీజీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 తో పాటు స్థానిక డిపో మేనేజర్లను సంప్రదించాలని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ సూచించారు.
