TDP vs YSRCP: టెంపుల్‌ సిటీలో టెన్షన్‌.. టెన్షన్‌.. టీడీపీ వర్సెస్‌ వైసీపీ

Tension In Tirupati

Tension In Tirupati

TDP vs YSRCP: టెంపుల్‌ సిటీ తిరుపతిలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా హీటెక్కింది.. టీడీపీ, వైసీపీ మహిళా కార్యకర్తలు పోటాపోటీగా నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడంతో నగరంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఒకవైపు గంజాయి విక్రయాల అంశం, మరోవైపు సోషల్ మీడియా వేధింపుల అంశంపై ఇరు పార్టీల నేతలు వీధుల్లోకి వచ్చి ఘర్షణకు దిగారు. గంజాయి విక్రయాలకు వ్యతిరేకంగా టీడీపీ మహిళా కార్యకర్తలు గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. తిరుపతిలో గంజాయి ముఠాలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయని ఆరోపించారు. స్థానిక వైసీపీ కీలక నేత భూమన కరుణాకర్ రెడ్డి అనుచరుల వల్లే నగరంలో గంజాయి విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయని టీడీపీ మహిళా నేతలు తీవ్ర విమర్శలు చేశారు.

అయితే, వైసీపీ మహిళా కార్యకర్తలు సైతం భారీ ఎత్తున వీధుల్లోకి వచ్చారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద వారు ఆందోళనకు దిగారు. సోషల్ మీడియాలో మహిళలను టార్గెట్ చేస్తూ టీడీపీ నేతలు అత్యంత అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని వారు ధ్వజమెత్తారు. మహిళల పట్ల కనీస గౌరవం లేకుండా ప్రవర్తిస్తున్న టీడీపీ నాయకులకు బుద్ధి చెప్పాలంటూ నినాదాలు చేశారు. రెండు ప్రధాన పార్టీల మహిళా విభాగాలు పక్కపక్కనే పోటాపోటీగా నిరసనలకు దిగడంతో తిరుపతి నడిబొడ్డున హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఇరువర్గాల మధ్య మొదట మాటల యుద్ధం నడిచింది. ఒకరినొకరు విమర్శించుకుంటూ నినాదాలు చేసుకోవడంతో వాతావరణం మరింత హీటెక్కింది. ఈ క్రమంలోనే ఇరుపక్షాల కార్యకర్తలు ఒకరినొకరు నెట్టుకుంటూ తోపులాటకు దిగారు. పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను అడ్డుకున్నారు‌‌..