Telangana Schools Reopen: వేసవి సెలవుల అనంతరం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి (జూన్ 15) నుండి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. సుదీర్ఘ సెలవుల తర్వాత పాఠశాలలు తెరుచుకుంటుండటంతో విద్యాసంస్థలన్నీ విద్యార్థుల సందడితో కళకళలాడనున్నాయి.
ఈ విద్యా సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 41, 673 పాఠశాలల్లో 63 లక్షల మందికి పైగా విద్యార్థులు తరగతులకు హాజరు కానున్నారు. ఇందులో ప్రభుత్వ పాఠశాలలు దాదాపు 26,000 ఉండగా. వాటిలో సుమారు 21.5 లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం విద్యార్థులకు మరింత నాణ్యమైన సౌకర్యాలు అందించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు బ్రాండెడ్ యూనిఫామ్లు, షూస్, బెల్ట్, టై, బ్యాగులతో కూడిన ప్రత్యేక కిట్లను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది.
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా.. ఈ ఏడాది ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే దాదాపు 2 లక్షల మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా కాలేజీ బ్యాగ్, బూట్లు, సాక్సులు, టై, బెల్టులను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుంది. పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్న నేపథ్యంలో విద్యార్థుల భద్రతకు అధికారులు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. స్కూల్ బస్సులు, వ్యాన్లు, ఇతర రవాణా వాహనాలపై రవాణా శాఖ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. గత నెల రోజులుగా ఈ వాహనాలకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకుండా రోడ్డెక్కితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో బస్సులను నిలిపివేసి తనిఖీలు చేపట్టారు.
విద్యార్థులకు ఎలాంటి రవాణా ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రూట్లలో విద్యార్థుల రద్దీకి అనుగుణంగా తగినన్ని బస్సులను నడపాలని టీజీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వై. నాగరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 227 పనిదినాలు ఉన్నందున.. విద్యార్థులు సకాలంలో, సురక్షితంగా తమ పాఠశాలలకు చేరుకునేలా అన్ని రవాణా సౌకర్యాలను సిద్ధం చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

