Operation Crackdown: రాష్ట్రంలో పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు తెలంగాణ పోలీసులు “ఆపరేషన్ క్రాక్డౌన్” పేరుతో ప్రత్యేక చర్యలను ప్రారంభించారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) రూపకల్పన చేసిన ఈ ఆపరేషన్ వచ్చే కొన్ని నెలల పాటు దశలవారీగా కొనసాగనుంది. జిల్లా పోలీస్ యూనిట్లు, కమిషనరేట్లతో కలిసి నేరగాళ్ల నెట్వర్క్లు, సైబర్ క్రైమ్ ఎకోసిస్టమ్ను పూర్తిగా ధ్వంసం చేయడం ఈ చర్యల ప్రధాన లక్ష్యం.
T20 World Cup 2026: రన్ రేట్ లైట్..! టీమిండియా సెమీస్కు చేరే ఒకే ఒక మార్గం
ఈ ఆపరేషన్లో భాగంగా తొలి దశలో రాష్ట్రంలోని 16 జిల్లాలు/యూనిట్లలో మ్యూల్ బ్యాంక్ ఖాతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. TGCSB నిర్వహించిన డేటా విశ్లేషణ ప్రకారం 2025 సంవత్సరంలో రాష్ట్రంలో మొత్తం 4,775 మ్యూల్ ఖాతాలు కార్యకలాపాలు నిర్వహించినట్లు గుర్తించారు. ఇందులో భాగంగా 137 బ్యాంకు శాఖల్లో తెరవబడిన 1,888 అనుమానాస్పద మ్యూల్ ఖాతాలను అధికారులు తనిఖీ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా నమోదైన 9,431 సైబర్ నేరాలతో ఈ ఖాతాలకు సంబంధాలు ఉన్నట్లు తేలగా, అందులో 782 కేసులు తెలంగాణకు చెందినవిగా గుర్తించారు.
ఈ సంయుక్త తనిఖీల్లో 512 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో కూడిన 137 బృందాలు పాల్గొన్నాయి. బ్యాంకు శాఖలను సందర్శించి అనుమానాస్పద ఖాతాదారుల KYC వివరాలను సేకరించి పరిశీలిస్తున్నారు. ప్రాథమిక తనిఖీల్లో కొన్ని శాఖల్లో వందల సంఖ్యలో మ్యూల్ ఖాతాలు ఉండటం గమనించడంతో బ్యాంకు సిబ్బంది సహకారం, సంఘటిత నెట్వర్క్ పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
హైదరాబాద్ సుల్తాన్బజార్కు చెందిన ఒకే బ్యాంక్ ఖాతా దేశంలోని వివిధ ప్రాంతాల్లో నమోదైన 496 సైబర్ నేర కేసులతో సంబంధం ఉన్నట్లు బయటపడింది. సూర్యాపేట జిల్లాలో నాలుగు బ్యాంకు శాఖల్లో మొత్తం 298 ఖాతాలు అనేక నేరాలకు లింక్ ఉన్నట్లు గుర్తించారు. అవసరమైన చోట్ల కేసులు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అదనంగా, కొన్ని చిన్న బ్యాంకులు స్వంతంగా RTGS సౌకర్యం లేకపోవడంతో జాతీయ బ్యాంకుల RTGS వ్యవస్థను వినియోగిస్తున్నట్లు కూడా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో సైబర్ నేరాలను సమూలంగా అణచివేయడానికి ఈ ఆపరేషన్ కీలకంగా మారనుందని పోలీసులు పేర్కొన్నారు.