NTV Telugu Site icon

Addanki Dayakar : నేను చేసిన సేవలకు ఇది ప్రజలు ఇచ్చిన గుర్తింపు

Addanki Dayakar Rao

Addanki Dayakar Rao

Addanki Dayakar : తెలంగాణలో ఎమ్మెల్సీ కోటా ఎమ్మెల్సీ (MLC) ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగిసింది. కాంగ్రెస్ పార్టీ తరఫున అద్దంకి దయాకర్, కేతావత్ శంకర్ నాయక్, విజయశాంతి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. నామినేషన్ అనంతరం మీడియాతో మాట్లాడిన అద్దంకి దయాకర్, తనకు ఎమ్మెల్సీగా అవకాశం రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. “నా ఎంపికను ఎంతో మంది వారి కుటుంబాల్లో ఓ విజయంగా భావిస్తున్నారు. నేను చేసిన సేవలకు ఇది ప్రజలు ఇచ్చిన గుర్తింపు,” అని వ్యాఖ్యానించారు.

అయితే, తనకు ఈ అవకాశం ఆలస్యంగా వచ్చినా, ప్రజా సేవను అదనపు బాధ్యతగా స్వీకరిస్తానని పేర్కొన్నారు. “ఎమ్మెల్సీ అవకాశం రాకపోయినా నేను ప్రజల కోసం పోరాడుతూనే ఉంటా. ప్రజల ప్రేమ, అండ లేకుండా నేను బతకలేను” అని స్పష్టం చేశారు. “మంత్రి పదవి దక్కుతుందా?” అనే ప్రశ్నకు అద్దంకి దయాకర్ స్పందిస్తూ, “ఇది కేవలం వార్తల వరకే పరిమితం. మంత్రివర్గ విస్తరణపై నిర్ణయం అధిష్టానం చేతిలో ఉంది” అని అన్నారు.

అద్దంకి దయాకర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయాన్ని అమలు చేస్తోందని తెలిపారు. ఉద్యమకారులైన తనకు, విజయశాంతికి అవకాశం ఇవ్వడం ఇందుకు నిదర్శనం అని అన్నారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత ప్రతిపక్ష సూచనలు, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ మూడు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, మరో స్థానం మిత్రపక్షమైన సీపీఐ (CPI)కి కేటాయించింది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు తెలంగాణ రాజకీయ పరిణామాలకు కీలకంగా మారనున్నాయి.

Botsa Satyanarayana: ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం కాదు రైతులను ఆదుకోవాలి..