Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..

Indiramma Housing

Indiramma Housing

తెలంగాణ ప్రభుత్వం పేదల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో సరికొత్త సాంకేతిక విప్లవం ఆవిష్కృతమైంది. ముఖ్యంగా మారుమూల, గిరిజన ప్రాంతాలలో ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి , మధ్యలోనే పనులు ఆగిపోకుండా చూడటానికి ప్రభుత్వం ‘షియర్ వాల్ టెక్నాలజీ’ని విస్తృతంగా అందుబాటులోకి తెస్తోంది. సాధారణంగా నగరాల్లోని బహుళ అంతస్తుల భవనాలకు మాత్రమే వాడే ఈ అధునాతన ఇంజనీరింగ్ విధానాన్ని, ఇప్పుడు పేదల సొంతింటి కలని త్వరగా సాకారం చేయడం కోసం ఇందిరమ్మ ఇళ్లకు అన్వయిస్తున్నారు.

12 రోజుల్లోనే నిర్మాణం పూర్తి..
సాంప్రదాయ పద్ధతుల్లో ఇటుకలు, సిమెంట్‌తో ఇల్లు నిర్మించడానికి దాదాపు 90 రోజుల సమయం పడుతుంది. కానీ ఈ సరికొత్త టెక్నాలజీ ద్వారా కేవలం 12 నుంచి 15 రోజుల్లోనే ఒక పక్కా ఇందిరమ్మ ఇంటి సివిల్ నిర్మాణాన్ని పూర్తి చేసి సరికొత్త రికార్డు సృష్టించారు. ప్రైవేట్ సంస్థ ‘వేదన్ ఇన్ఫ్రా’ హౌసింగ్ డిపార్ట్‌మెంట్‌తో కలిసి అల్యూమినియం/స్టీల్ ఫార్మ్‌వర్క్ (షెట్టరింగ్) విధానంలో ఈ ఇళ్లను నిర్మిస్తోంది. ఈ పద్ధతిలో కేవలం 6 నుంచి 8 మంది కార్మికులతోనే పని పూర్తవుతుంది. ఇటుకల వాడకం అస్సలుండదు. గోడలను స్టీల్, రీన్‌ఫోర్స్డ్ కాంక్రీట్ (RCC) తో ఒకేసారి ఏకీకృతంగా నిర్మించడం వల్ల ప్లాస్టరింగ్ వంటి పునరావృత పనుల ఖర్చు తప్పుతుంది. అంతేకాకుండా గోడలపై పగుళ్లు వచ్చే అవకాశం అస్సలుండదు.

×
×
Ad

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన..
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం కొఠారి గ్రామంలో ఆదివాసీల కోసం ఈ టెక్నాలజీతో నిర్మించిన మోడల్ ఇందిరమ్మ ఇళ్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించారు. సోమవారం జరిగిన భారీ గృహప్రవేశాల కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొని ఈ ప్రయోగాత్మక గృహ నిర్మాణ నాణ్యతను పరిశీలించారు. షెట్టరింగ్ వేసిన వెంటనే కాంక్రీట్ పోసి, మరుసటి రోజుకే డీషెట్టరింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన విధానాన్ని అధికారులు సీఎంకు వివరించారు. నిజామాబాద్, నాగర్‌కర్నూల్, కామారెడ్డి, మెదక్, నారాయణపేట్, సంగారెడ్డి జిల్లాల్లో ఇప్పటికే ఈ విధానంలో దాదాపు 150 ఇళ్లను విజయవంతంగా నిర్మించినట్లు గృహ నిర్మాణ సంస్థ అధికారులు తెలిపారు.

రూ.5 లక్షల బడ్జెట్.. 60 ఏళ్ల మన్నిక.
ప్రభుత్వం పేదలకు అందిస్తున్న రూ. 5 లక్షల ఆర్థిక సహాయంతోనే, 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో హాల్, బెడ్‌రూమ్, కిచెన్, బాత్రూమ్ మరియు టాయిలెట్లతో కూడిన పూర్తి స్థాయి ఇల్లు ఈ టెక్నాలజీతో సిద్ధమవుతుంది. ముడిసరుకు రవాణా కష్టంగా ఉండే మారుమూల ప్రాంతాల లబ్ధిదారులకు, సొంత డబ్బులు పెట్టుకోలేని పేదలకు ఇది ఒక సువర్ణావకాశం. ఈ పద్ధతిలో కట్టిన ఇళ్లు బలమైన ఈదురుగాలులు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలను సమర్థవంతంగా తట్టుకుంటాయి. ఈ ఇళ్ల బాహ్య గోడలు 5 అంగుళాలు, అంతర్గత గోడలు 4 అంగుళాల మందంతో ఉండి, లోపల ఎక్కువ స్థలం లభిస్తుంది. ఈ నిర్మాణాలు దాదాపు 60 ఏళ్ల పాటు అత్యంత పటిష్టంగా మన్నికగా ఉంటాయని ఇంజనీరింగ్ నిపుణులు ధృవీకరించారు. దీనివల్ల లబ్ధిదారులపై ఎలాంటి అదనపు ఆర్థిక భారం పడకుండా వేగంగా ఇళ్లు పూర్తవుతుండటంతో, రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఈ టెక్నాలజీని పెద్దపీట వేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది.