Telangana High Court: ఉచిత పథకాలు, ప్రభుత్వ పాలనా తీరుపై తెలంగాణ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. సమాజంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని, పెరిగిపోతున్న ప్రమాదకర పరిస్థితులను హెచ్చరించే ఉద్దేశంతోనే ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ బీమాపాక స్పష్టం చేశారు. ఉచిత పథకాలను కోటీశ్వరులు కూడా పొందుతున్నారని, రైతుబంధు వంటి పథకాల వల్ల ఎంతోమంది ధనికులు లబ్ధి పొందుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వంపై విపరీతమైన ఆర్థిక భారం పడుతోందని పేర్కొన్నారు. ఒకప్పుడు ఈ దేశానికి మనం ఏమి ఇచ్చామని ఆలోచించే వాళ్లమని, గాంధీ, నెహ్రూ, ప్రకాశం పంతులు వంటి మహనీయులను చూసి దేశానికి ఏదో ఒకటి చేయాలని తపించేవారని గుర్తుచేశారు. కానీ నేడు పరిస్థితులు మారిపోయి, ఈ దేశం మనకేమిచ్చింది లేదా నాకేమిచ్చారనే ధోరణి పెరిగిపోయిందని వ్యాఖ్యానించారు.
ఉచిత పథకాల కారణంగా పల్లెటూర్లలో పనిచేయడానికి కూలీలు దొరకని పరిస్థితి ఏర్పడిందని, రైతుల స్థితి ఘోరంగా తయారైందని తెలిపారు. ఉచితంగా లభిస్తుండటంతో నేనెందుకు పనిచేయాలనే అభిప్రాయానికి ప్రజలు వస్తున్నారని, ఇదే పరిస్థితి కొనసాగితే ఒకప్పుడు మనుషులు స్వయంగా పనిచేసేవారట అని చెప్పుకునే రోజులు వచ్చినా ఆశ్చర్యం లేదన్నారు. ప్రభుత్వాలు ఉచితాలను ఇలాగే ఇస్తూ పోతే చివరకు కుబేరుడి వద్ద ఉన్న ధనమంతా అయిపోయి, ఆయన కూడా పనికి ఆహార పథకం కింద కూలీకి రావాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. కోటి 15 లక్షల కుటుంబాలకు ఉచిత పథకాలు ఇస్తే దేశాన్ని ఎలా నడుపుతారని ప్రశ్నించిన ఆయన, విద్యార్థులకు ఫీజుల చెల్లింపులోనూ అర్హులైన, బాగా చదువుకునే వారికి మాత్రమే ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని సూచించారు. కాలేజీలకు వెళ్లకుండా తిరిగే విద్యార్థులు యాజమాన్యాలను బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
అలాగే ప్రభుత్వాలు చేసే తప్పిదాల వల్ల ఉన్నతాధికారులు బలి అవుతున్నారని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నందుకే సందీప్ సుల్తానియాపై ఏకంగా 3,000 నుంచి 4,000 కేసులు నమోదు కావడం, వందకు పైగా కోర్టు ధిక్కరణ కేసులు పెండింగ్లో ఉండటంపై విచారం వ్యక్తం చేశారు. ఈ లెక్కన చూస్తే ఆయన జీవితకాలం జైల్లోనే ఉండాల్సి వస్తుందని, మీరు ముఖ్యమంత్రి అయితే ఈ కేసులపై ఏం చేస్తారని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించారు. సందీప్ సుల్తానియా మంచి అధికారే అయినప్పటికీ, తప్పనిసరి పరిస్థితుల్లోనే కోర్టుకు పిలిపిస్తున్నామని తెలిపారు. ఇవన్నీ ఏ ప్రభుత్వాలపైనా విమర్శలు లేదా రాజకీయ ఉపన్యాసాలు కాదని, ఒక పౌరుడిగా ఆవేదనతో, ప్రమాద ఘంటికలు మోగుతున్నాయనే పాత వాస్తవాలను తెలియజేసేందుకే చెబుతున్నామని స్పష్టం చేశారు.

