Telangana High Court: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్కు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది.. ఆయనకు రూ.50 వేల జరిమానా విధించింది. కోర్టు ఆదేశాల మేరకు కౌంటర్ పిటిషన్ దాఖలు చేయడంలో జాప్యం చేయడం, పలుమార్లు అవకాశం ఇచ్చినప్పటికీ తగిన స్పందన లేకపోవడంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ జరిమానా విధించింది.. హైదరాబాద్లోని యూసుఫ్గూడ సర్వే నంబర్ 45లో ఉన్న రెండు ఎకరాల వివాదాస్పద భూమికి సంబంధించిన కేసు విచారణ సందర్భంగా ఈ పరిణామం చోటుచేసుకుంది. సంబంధిత భూమిపై ఇప్పటికే కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ హైడ్రా అధికారులు జోక్యం చేసుకున్నారని పిటిషనర్లు ఆరోపించారు.
ఈ వ్యవహారంలో హైడ్రా తరఫున కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. అయితే, పలుమార్లు గడువు ఇచ్చినప్పటికీ కౌంటర్ పిటిషన్ దాఖలు చేయకపోవడంతో పాటు కమిషనర్ రంగనాథ్ కోర్టుకు హాజరు కాకపోవడాన్ని న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. తర్వాత దాఖలైన కౌంటర్ పిటిషన్ కూడా సాంకేతిక కారణాలతో తిరస్కరణకు గురైనట్లు కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో కమిషనర్ ఏవీ రంగనాథ్పై రూ.50 వేల జరిమానా విధిస్తూ, ఆ మొత్తాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రిలీఫ్ ఫండ్కు జమ చేయాలని ఆదేశించింది.
ఈ కేసును విచారించిన జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది. అప్పటివరకు సంబంధిత అంశాలపై పూర్తి వివరాలతో కోర్టుకు సమాధానం ఇవ్వాలని సూచించినట్లు సమాచారం. యూసుఫ్గూడ భూమి వివాదానికి సంబంధించిన ఈ కేసులో హైడ్రా అధికారుల వ్యవహార శైలిపై కోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. తదుపరి విచారణలో ఈ వ్యవహారంపై మరిన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని న్యాయవర్గాలు భావిస్తున్నాయి.

