Telangana Rains: తెలంగాణ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు నదులు, ఉపనదులు పొంగిపొర్లుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ, మహారాష్ట్రల్లోని ఎగువ ప్రాంతాల్లో వర్షాపాతం తీవ్రమవడంతో గోదావరి, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని పలు కీలకమైన నీటిపారుదల ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో జలాశయాలు సంతరించుకుంటున్న జలకళ రైతుల్లోనూ, ప్రజల్లోనూ తీవ్ర ఆనందాన్ని నింపుతోంది.
నిజామాబాద్ జిల్లాలోని ప్రతిష్టాత్మక శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం జలాశయంలోకి 12,900 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా, ప్రాజెక్టు నీటి నిల్వ 17.103 టీఎంసీలకు చేరింది. కాకతీయ కాలువ ద్వారా దిగువకు 300 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతోంది. అలాగే, నిర్మల్ జిల్లాలోని సారంగాపూర్ మండలంలో ఉన్న స్వర్ణ ప్రాజెక్టుకు ఉదయం వేళకు నీటి సామర్థ్యం అర టీఎంసీ దాటి, ఇన్ ఫ్లో దాదాపు 10 వేల క్యూసెక్కులకు చేరింది. నిర్మల్ జిల్లాకే తలమానికమైన కడెం ప్రాజెక్టుకు వరద నీరు విపరీతంగా పోటెత్తుతోంది. ఉదయం 11:00 గంటల సమయానికి కడెం ప్రాజెక్టుకు ఏకంగా 77,442 క్యూసెక్కుల భారీ ఇన్ ఫ్లో నమోదు కాగా, పరిస్థితికి అనుగుణంగా అధికారులు 6 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం వద్ద ప్రాణహిత, గోదావరి ఉభయ నదులు పరవళ్లు తొక్కుతూ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అక్కడ నీటిమట్టం 6.320 మీటర్ల ఎత్తులో మెట్ల వద్దకు చేరడంతో తీరం కొత్త రూపు సంతరించుకుంది. గోదావరి జలాలు పోటెత్తడంతో కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కి ఇన్ ఫ్లో భారీగా పెరిగింది. ఎన్డీఎస్ఏ (NDSA) సూచనలను పాటిస్తూ అధికారులు బ్యారేజ్ కి చెందిన మొత్తం 85 గేట్లను ఎత్తి ఉంచారు. ప్రస్తుతం అక్కడ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో సమంగా 1,01,530 క్యూసెక్కులుగా కొనసాగుతుండటంతో గోదావరి ప్రవాహం దిగువకు వేగంగా పయనిస్తోంది. ప్రాజెక్టుల్లో క్రమంగా నీటి నిల్వలు పెరుగుతుండటంతో నీటిపారుదల శాఖ అధికారులు పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నారు.

