తెలంగాణ సమాజ నిర్మాణంలో తమ రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడే హమాలీ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. హనుమకొండ బాలసముద్రంలోని హయగ్రీవాచారి మైదానంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని కార్మికుల సమస్యలపై సానుకూలంగా స్పందించారు. ఈ సభలో మంత్రి ప్రధానంగా హమాలీ కార్మికుల ఆరోగ్య భద్రతపై దృష్టి సారించారు. నిరంతరం శారీరక శ్రమతో కూడిన పని చేసే హమాలీలకు మెరుగైన వైద్యం అందేలా ‘హెల్త్ కార్డులు’ మంజూరు చేసే అంశాన్ని.. ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఉండేందుకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Also Read:Indiramma Canteen: రూ.5కే భోజనం.. గ్యాస్ ఇబ్బంది అస్సలే లేదు..
ఈ హెల్త్ కార్డులు, ఇన్సూరెన్స్ , ప్రత్యేక ‘సంక్షేమ బోర్డు’ ఏర్పాటుపై స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి త్వరితగతిన నిర్ణయం తీసుకుంటామని మంత్రి ప్రకటించారు. గ్రామాల్లో, మండల కేంద్రాల్లో పనిచేసే హమాలీలకు కనీసం కూర్చునేందుకు కూడా సరైన స్థలం లేకపోవడంపై మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో హమాలీ సంఘాల భవనాల కోసం భూమిని కేటాయించే దిశగా అడుగులు వేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. హమాలీల సంక్షేమం కోసం తన నియోజకవర్గ అభివృద్ధి నిధుల (CDF) నుంచి రూ. 20 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించి కార్మికుల్లో ఉత్సాహం నింపారు. ఈ సమస్యలను అసెంబ్లీలో కూడా ప్రస్తావిస్తానని ఆయన పేర్కొన్నారు.
