Telangana Exhibitors Association: ఎగ్జిబిటర్స్ కీలక నిర్ణయం.. ‘పెద్ది’ సినిమానే కాదు ఏ సినిమానైనా పర్సంటేజ్ కావాల్సిందే..!

  • తెలంగాణలో ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం..
  • ఇకపై అన్ని సినిమాలు పర్సంటేజ్ విధానంలోనే ప్రదర్శించాలని నిర్ణయం
  • ‘పెద్ది’ సినిమాకూ ఇదే నిబంధన వర్తిస్తుందని స్పష్టం
  • పర్సంటేజ్ ఇస్తేనే తెలంగాణలో సినిమాను ప్రదర్శిస్తామని హెచ్చరిక..
Peddi

Peddi

Telangana Exhibitors Association: తెలంగాణలో సినిమా ప్రదర్శన విధానంపై తెలంగాణ ఎక్జిబిటర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తెలంగాణలో విడుదలయ్యే ఏ సినిమా అయినా పర్సంటేజ్ విధానంలోనే థియేటర్లలో ప్రదర్శిస్తామని స్పష్టం చేసింది. ముఖ్యంగా త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న పెద్ది (Peddi) సినిమాకు కూడా ఇదే నిబంధన వర్తిస్తుందని సంఘం వెల్లడించింది.

తాజాగా నిర్వహించిన ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ.. “మాకు ‘పెద్ది’ సినిమాకు కూడా పర్సంటేజ్ కావాలని తేల్చి చెప్పారు. అది ఎంత ఇవ్వాలన్నది నిర్ణయించాలి. పర్సంటేజ్ ఇస్తేనే తెలంగాణలో సినిమా ప్రదర్శిస్తాం” అని స్పష్టం చేశారు. నిర్మాతలు కావాలనే ఈ అంశాన్ని వాయిదా వేస్తూ వస్తున్నారని ఈ సందర్బంగా వారు ఆరోపించారు.

ఇదివరకు హరిహర వీరమల్లు సినిమా సమయంలో తమ డిమాండ్‌ను వినిపించామని.. అయితే ఆ సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా వెనక్కి తగ్గామని తెలిపారు. ఆ తర్వాత నుంచి పర్సంటేజ్ విధానం గురించి నిరంతరం చర్చలు జరుపుతున్నప్పటికీ నిర్మాతల నుంచి స్పష్టత రాలేదని పేర్కొన్నారు. ‘పెద్ది’ సినిమా కూడా వాయిదా పడుతూ ఈ దశకు వచ్చిందని, అయినప్పటికీ ఈ సినిమాను వదిలేసి తర్వాతి పెద్ద సినిమాకు ఈ నిబంధన అమలు చేద్దామని కొందరు సూచించారని తెలిపారు. మరోవైపు నిర్మాతలు మూడు వారాల సమయం కోరారని, అయితే ఇక ఆలస్యం సరైంది కాదని భావించి ‘పెద్ది’ సినిమాను కూడా పర్సంటేజ్ పద్ధతిలోనే ప్రదర్శించాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

టికెట్ ధరల పెంపుపై కూడా సంఘం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలంగాణలో సినిమా టికెట్ రేట్లు పెంచకూడదని సంఘాల తరఫున సీఎం రేవంత్ రెడ్డికు మెమొరాండం ఇచ్చినట్లు తెలిపారు. టికెట్ ధరలు పెంచడం వల్ల ప్రేక్షకులు దూరమవుతారని, అలాంటి నిర్ణయాలతో సినిమాను చంపవద్దని ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు. అలాగే తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్, తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ తరఫున చివరిగా ఒకే మాట చెబుతున్నామని.. ఇకపై ఏ సినిమా అయినా పర్సంటేజ్ విధానంలోనే తమ థియేటర్లలో ప్రదర్శించబడుతుందని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా ఎగ్జిబిటర్ జువ్వాడి శేఖర్ రావు ఎన్నికయ్యారు. ఇటీవల ఆ పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.