NTV Telugu Site icon

Telangana Elections 2023: పీవీ నరసింహారావు రికార్డును అధిగమించిన శ్రీధర్‌ బాబు!

Sridhar Babu Record

Sridhar Babu Record

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మంథని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. సమీప బీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధుపై 30 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మంథని నియోజకవర్గంలో 2,36,442 మంది ఓటర్లు ఉండగా.. 1,95,632 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీధర్ బాబుకు 1,01,796 ఓట్లు రాగా.. బీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధుకు 71,732 ఓట్లు వచ్చాయి. ఇక బీజేపీ అభ్యర్థి చందుపట్ల సునీల్ రెడ్డికి 5,642 ఓట్లు రాగా.. బీఎస్పీ అభ్యర్థి నారాయణ రెడ్డికి 2,878 ఓట్లు పోలయ్యాయి.

Also Read: Monday : శివుడికి అభిషేకం చేస్తే కలిగే ఫలితాలు ఏంటో తెలుసా?

మంథని నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు రికార్డును శ్రీధర్‌ బాబు అధిగమించారు. మంథని నుంచి 1957, 1962, 1967, 1972 ఎన్నికల్లో వరుసగా నాలుగుసార్లు పీవీ నర్సింహారావు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఇదే మంథని నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. 1999, 2004, 2009, 2018, 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు.