Sridhar Babu: త్వరలోనే డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన

Minister Sridhar Babu

Minister Sridhar Babu

Sridhar Babu: రాష్ట్రంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పాలనను మరింత వేగవంతం, పారదర్శకం చేసేందుకు ప్రభుత్వం అనేక విప్లవాత్మక డిజిటల్ కార్యక్రమాలను చేపడుతోందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. శాసనసభ, మండలి వ్యవహారాలను సంపూర్ణంగా డిజిటలైజ్ చేస్తూ త్వరలోనే డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్‌ను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. GOVconnect, ఎలక్ట్రానిక్ సర్వీసెస్ డెలివరీ (మీసేవ) సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన “ఏఐ ట్రాన్స్‌ఫార్మేషన్ కాంక్లేవ్ (తెలంగాణ)”ను ప్రారంభించిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి ప్రసంగించారు. డిజిటల్ ఆఫీస్ ప్రాజెక్ట్ ద్వారా ప్రభుత్వ శాఖల్లో పేపర్ లెస్ పాలనకు పెద్దపీట వేస్తున్నామని, నకిలీ పత్రాలకు తావులేకుండా భద్రమైన బ్లాక్‌చెయిన్ ఆధారిత సర్టిఫికెట్ల సేవలను త్వరలో అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించారు.

గ్రామీణ ప్రాంతాల సాధికారత లక్ష్యంగా టీ-ఫైబర్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 80 లక్షలకు పైగా గ్రామీణ కుటుంబాలకు హైస్పీడ్ డిజిటల్ కనెక్టివిటీని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. వృద్ధులు, దివ్యాంగులకు ఎలాంటి శ్రమ లేకుండా ప్రభుత్వ పౌర సేవలను నేరుగా వారి ఇంటి ముంగిటకే చేరవేసే వ్యవస్థను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. పాలనా వ్యవస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్ వంటి ఆధునిక సాంకేతికతలను విస్తృతంగా వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. దాదాపు 20కి పైగా ప్రధాన ప్రభుత్వ శాఖలను ఒకే వేదికపైకి తెచ్చి, పథకాల అమలును నిరంతరం పర్యవేక్షించేందుకు రియల్ టైమ్ గవర్నమెంట్ డ్యాష్ బోర్డును రూపొందిస్తున్నట్లు మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర సీఎంవో చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ ప్రవీణ్ పరదేశి, సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఎండీ జీవీఎల్ సత్య కుమార్, నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా సీఈవో డాక్టర్ దేవేష్ త్యాగి, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ అడిషనల్ సెక్రటరీ సౌరభ్ కె.తివారీలతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.