CM Revanth Reddy: టీజీ సేఫ్ అమల్లోకి తెచ్చామన్న సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణలో ప్రారంభమైన కొత్త అథారిటీ..

Cm Revanth Reddy

Cm Revanth Reddy

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (X) వేదికగా ప్రజా ప్రభుత్వ ప్రాధాన్యతలను, ప్రజారోగ్య పరిరక్షణ దిశగా తీసుకున్న నూతన నిర్ణయాన్ని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల భద్రత, రక్షణ, సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఆయన పేర్కొన్నారు. సమాజంలోని ప్రతి అంశంలోనూ చట్టం ప్రకారమే పాలన సాగిస్తూ, ప్రజలకు సంపూర్ణ జవాబుదారీతనంతో సేవలు అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన సంకల్పమని పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఆహార పదార్థాలు, నిత్యవసర ఔషధాల నాణ్యతను, భద్రతను పర్యవేక్షించేందుకు ఏకీకృత వ్యవస్థగా ‘తెలంగాణ సేఫ్’ (TG-Safe – తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్) ను అమలులోకి తీసుకువచ్చినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు వేర్వేరుగా ఉన్న ఆహార భద్రత, ఔషధ నియంత్రణ విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి, ప్రజారోగ్య పరిరక్షణకు ఈ నూతన అథారిటీ ద్వారా కఠిన ప్రమాణాలు అమలు చేయనున్నట్లు తెలియజేశారు.

దీని ద్వారా మార్కెట్లో లభించే ఆహార పదార్థాల్లో కల్తీని నిరోధించడం, నకిలీ , ప్రమాదకర మందుల విక్రయాలకు అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుంది. క్షేత్రస్థాయిలో తనిఖీలు పెరిగి, నాణ్యతా ప్రమాణాలు పాటించని వారిపై తక్షణ చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది. ఫలితంగా పౌరులకు సురక్షితమైన ఆహారం, సమర్థవంతమైన మందులు అందుబాటులోకి వచ్చి, ప్రజారోగ్యానికి సంపూర్ణ భద్రత చేకూరుతుంది.

నాణ్యమైన ఆహారం, సురక్షితమైన మందులు అందించడమే లక్ష్యంగా పనిచేసే ‘TG-Safe’ సేవలను ఉపయోగించుకుంటూ, ఆరోగ్యవంతమైన, సురక్షితమైన తెలంగాణ నిర్మాణంలో రాష్ట్ర పౌరులందరూ భాగస్వాములు కావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.