NTV Telugu Site icon

CM Revanth Reddy: వనపర్తి వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రత్యేక పూజల్లో పాల్గొన్న సీఎం

Revanth Reddy (1)

Revanth Reddy (1)

CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వనపర్తి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉదయం హెలికాప్టర్‌లో వనపర్తికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి ముందుగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత దేవాలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం బాయ్స్ జూనియర్ కాలేజీ మైదానంలో రూ.880 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రాంత ప్రజల శ్రేయస్సు కోసం కృషి చేస్తామని సీఎం తెలిపారు.

Read Also: AICC: మున్నూరు కాపుల సమావేశంపై ఏఐసీసీ సీరియస్

ఇక ఆ తర్వాత కేటీఆర్ పాలిటెక్నిక్ మైదానంలో వివిధ సంక్షేమ పథకాలు, ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాల పంపిణీ, మహిళలకు రుణాల పంపిణీ వంటి కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు తమ ఆనందం వ్యక్తం చేశారు. సాయంత్రం 3 గంటలకు ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మేఘారెడ్డి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు.

ఈ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి చిన్నప్పుడు, 43 ఏళ్ల క్రితం అద్దెకు ఉండి చదువుకున్న ఇంటిని సందర్శించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ ఇంటి యజమాని పార్వతమ్మను కలుసుకొని ఆమెతో ఆత్మీయంగా ముచ్చటించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో సీఎం తన చిన్ననాటి స్నేహితులను కలుసుకున్నారు. ముఖ్యమంత్రి అయ్యాక రేవంత్ రెడ్డి తొలిసారి వనపర్తికి రావడంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున ఆత్మీయ స్వాగతం పలికారు. గ్రామస్తులు, కార్యకర్తలు ఆయన పర్యటనతో ఎంతో ఉత్సాహంగా కనిపించారు.