Cabinet Meeting: ఈ నెల 18వ తేదీన శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. రాష్ట్ర పునర్విభజన జరిగి పదేండ్లు పూర్తి కానుండటంతో పునర్విభజన చట్టానికి సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలతో తెలంగాణ, ఏపీ మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై కేబినెట్లో చర్చించనున్నారు. ఆగస్ట్ 15లోపు రైతుల రుణమాఫీ చేసి తీరాలని ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులను ఆదేశించారు. అందుకు సంబంధించిన నిధుల సమీకరణపై చర్చించనున్నారు.
Read Also: MLC Jeevan Reddy: బీఆర్ఎస్ పార్టీని బీజేపీ దగ్గర కుదవపెట్టారు.. కేసీఆర్ పై జీవన్ రెడ్డి ఫైర్
ధాన్యం కొనుగోళ్ల పురోగతిని సమీక్షించి, వచ్చే ఖరీఫ్ పంటల ప్రణాళికపై చర్చ జరగనుంది. రాష్ట్ర ఆదాయం పెంచుకునే దిశగా వనరుల సమీకరణ, ఆదాయ పెంపు ప్రత్యామ్నాయాలపై కేబినెట్ లో చర్చిస్తారు. కుంగిపోయిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల రిపేర్లకు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇటీవలే మధ్యంతర నివేదికను సమర్పించింది. నివేదికలోని సిఫారసులు, తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. జూన్ నుంచి కొత్త విద్యాసంవత్సరం ఆరంభమవుతుంది. స్కూల్, కాలేజీల ప్రారంభానికి ముందే అవసరమైన సన్నాహక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. విద్యార్థుల నమోదు, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ల పంపిణీ తదితర అంశాలను చర్చించనున్నారు.