తెలంగాణ ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సామాజిక భద్రత, శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజలపై సానుకూల ప్రభావం చూపనున్నాయి. ఈ నిర్ణయాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడటానికి , సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులను అరికట్టడానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత కీలకమైన ‘తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్ ప్రివెన్షన్ బిల్లు 2026’ ను ఆమోదించింది. విద్వేషపూరిత ప్రసంగాలు, అల్లర్లను ప్రేరేపించే వ్యాఖ్యలను కట్టడి చేసేందుకు ఈ చట్టం ఒక శక్తివంతమైన ఆయుధంగా పనిచేయనుంది. మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలను అడ్డుకోవడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం.
గిగ్ వర్కర్ల భద్రతకు పెద్దపీట..
రాష్ట్రంలో సుమారు 4.2 లక్షల మంది గిగ్, ప్లాట్ఫామ్ కార్మికులు (డెలివరీ బాయ్స్, డ్రైవర్లు మొదలైనవారు) ఉన్నారు. వీరి సంక్షేమం కోసం ‘తెలంగాణ ప్లాట్ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ యాక్ట్ 2026’ ను క్యాబినెట్ ఆమోదించింది. దీని ప్రకారం వర్కర్ల రిజిస్ట్రేషన్తో పాటు ఒక ప్రత్యేక వెల్ఫేర్ బోర్డు, సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తారు. దీనివల్ల వీరికి చట్టబద్ధమైన గుర్తింపుతో పాటు సామాజిక భద్రత లభిస్తుంది.
తల్లిదండ్రుల మద్దతు బిల్లు..
మానవీయ కోణంలో ప్రభుత్వం ఒక వినూత్న బిల్లును తీసుకొచ్చింది. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల బాధ్యతను తీసుకోని ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల వేతనం నుంచి 15 శాతం లేదా రూ.10 వేలు (ఏది తక్కువైతే అది) కట్ చేసి నేరుగా తల్లిదండ్రులకు అందజేస్తారు.
Also Read:Iran Counter: అమెరికాతో ఎలాంటి చర్చలు జరగలేదు.. ‘ట్రంప్ భయపడ్డాడు’.. ఇరాన్ కౌంటర్..
మెట్రో రైలు స్వాధీనం..
హైదరాబాద్లోని ఫేజ్-1 మెట్రో (69 కి.మీ) వ్యవస్థను ఎల్ అండ్ టీ (L&T) సంస్థ నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది. ఇందుకోసం రూ.15 వేల కోట్లు చెల్లించాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియను పర్యవేక్షించడానికి హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL)ను నోడల్ ఏజెన్సీగా నియమించింది.
న్యాయవాదుల రక్షణ బిల్లు..
న్యాయవాదులపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వామనరావు దంపతుల హత్య వంటి ఘటనలు పునరావృతం కాకుండా న్యాయవాదులకు తగిన భద్రత కల్పించడమే దీని లక్ష్యం.
కులగణన నివేదిక, రోహిత్ వేముల చట్టం..
రాష్ట్రంలో నిర్వహించిన కులగణన సర్వేపై జస్టిస్ సుదర్శన్ రెడ్డి కమిటీ ఇచ్చిన నివేదికను క్యాబినెట్ పరిశీలించింది. అలాగే విద్యాసంస్థల్లో కుల వివక్షను నివారించేందుకు ‘రోహిత్ వేముల చట్టం’ విధివిధానాల కోసం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది.