Ponnam Prabhakar : తెలంగాణ శాసన సభలో బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటుగా స్పందించారు. ప్రభుత్వ విధానాలపై బీజేపీ నిరాధార ఆరోపణలు చేస్తున్నదని ఆయన ఆరోపించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, “మేము ఏ పథకాన్ని నిలిపివేయలేదని స్పష్టంగా చెప్పగలము. ప్రభుత్వం కొత్త ఉద్యోగ నియామకాలకు ప్రాధాన్యత ఇస్తోంది. కొత్తగా నియమితులైన ఉపాధ్యాయులకు విద్యాబోధన సక్రమంగా అందించాలని సూచిస్తున్నాం” అని చెప్పారు.
“రాష్ట్రానికి అప్పులు ఉన్నాయనే విషయం మాకు తెలుసు. అయితే, ఆర్థిక వ్యవస్థీకరణ చేస్తున్నాం. తెలంగాణ ఆర్థికంగా ఎదిగిపోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ పరిపాలన అనుభవం కలిగినది, పాత పథకాలను కొనసాగించడంతో పాటు కొత్త పథకాలను కూడా అమలు చేస్తున్నాం” అని ఆయన వివరించారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీపై విమర్శలు గుప్పిస్తూ, “కేంద్రం పెద్దన్న లాగా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలి. బీజేపీ నేతలు తులం బంగారం గురించి మాట్లాడుతున్నారు. 15 లక్షల రూపాయలు అందిస్తామని చెప్పారు, ఏమైపోయాయి? రైతులకు పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు, కానీ వారి కోసం ఉరి చట్టాలు తీసుకొచ్చారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు” అని దుయ్యబట్టారు.
“తెలంగాణ రాష్ట్రం నుండి వచ్చే నిధులను కేంద్రం తిరిగి ఇవ్వడం లేదు. పైగా, బాత్రూంలపై, రేషన్ షాపులపై బీజేపీ నేతల ఫోటోలు పెట్టాలని చెబుతున్నారు” అని మంత్రి మండిపడ్డారు. “రైతు రుణమాఫీపై బీజేపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. కానీ, తెలంగాణ ప్రభుత్వం నిర్మల్ నియోజకవర్గంలో 23,906 మంది రైతులకు రూ.202.55 కోట్ల రుణ మాఫీ చేసింది. రెండు లక్షల లోపు రుణమాఫీ అమలు చేయడం ద్వారా రైతులకు మద్దతుగా నిలుస్తున్నాం. నిర్మల్కు వచ్చి దీనిపై చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం” అని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం సంక్షేమాన్ని ఒక్క అడుగు కూడా తగ్గించదని, అభివృద్ధే తమ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. బీజేపీ అనవసర విమర్శలు చేయడం మానేసి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని సూచించారు.
Stock Markets: మరోమారు భారీ నష్టాలలో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్స్