Site icon NTV Telugu

Telangana Assembly: ఈ నెల 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

Assembly

Assembly

Telangana Assembly: ఈ నెల 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. బడ్జెట్‌ సమావేశాలను జులై 24 నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ కుమార్, మండలి ఛైర్మన్ గురువారం మధ్యాహ్నం వివిధ శాఖల అధికారులతో అసెంబ్లీ నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి శాంతి కుమారి, డీజీపీ జితేంద‌ర్‌తో పాటు ప్రభుత్వ విప్‌లు రామ‌చంద్ర నాయ‌క్, ఆది శ్రీనివాస్‌తో పాటు ప‌లువురు హాజ‌ర‌య్యారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షలో చర్చించారు. అసెంబ్లీ సమావేశాల్లో పూర్తి స్థాయి బ‌డ్జెట్ ప్రవేశ పెట్టాల్సి ఉండ‌టంతో ఆర్థిక శాఖ అధికారుల‌తో కూడా స్పీక‌ర్ చ‌ర్చించిన‌ట్లు సమాచారం. అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల నేప‌థ్యంలో గ‌త కొద్ది రోజుల నుంచి ఆర్థిక మంత్రి భ‌ట్టి విక్రమార్క ఆయా శాఖ‌ల అధికారుల‌తో స‌మీక్షలు నిర్వహిస్తున్నారు. ఎక్సైజ్ శాఖ ఆర్థికాంశాల గురించి మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం స‌మీక్షించారు. ఉద‌యం 11 గంట‌లకు స‌మీక్ష ప్రారంభం కాగా, సాయంత్రం వ‌ర‌కు కొన‌సాగింది.

Read Also: Bhatti Vikramarka: రైతుల అభిప్రాయాలకు అనుగుణంగానే రైతు భరోసా ఖరారు

ఈ సమావేశాల్లో ముఖ్యంగా రైతు భరోసా పథకంపైనా కీలకమైన చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం రైతుభరోసా విధివిధానాల ఖరారు కోసం ఏర్పాటు చేసిన మంత్రి వర్గ ఉపసంఘం జిల్లాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. కమిటీ సేకరించిన వివరాలను అసెంబ్లీలో చర్చించనున్నారు. అసెంబ్లీలో చర్చించిన తర్వాత విధివిధానాలపై నిర్ణయానికి వస్తామని ఇది వరకే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అలాగే, జాబ్ క్యాలెండర్‌ను కూడా రాష్ట్ర ప్రభుత్వం సమావేశాల్లో ప్రకటించే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.

Exit mobile version