‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్‌కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్‌షిప్ డిన్నర్.!

  • టీమిండియాకు అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రత్యేక విందు
  • ఢిల్లీలో ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్‌షిప్ డిన్నర్
  • కార్యక్రమంలో భారత ఆటగాళ్లు, బీసీసీఐ అధికారులు
  • ‘కోహ్-ఏ-జఫర్’ అంటే ‘విజయ శిఖరం’..
Friendship Dinner

Friendship Dinner

‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్, అఫ్గానిస్థాన్ మధ్య 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో చివరి మ్యాచ్‌కు ముందు అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు టీమిండియాకు ప్రత్యేక విందు ఏర్పాటు చేసింది. ఢిల్లీలో జరిగిన ఈ డిన్నర్‌లో భారత ఆటగాళ్లతో పాటు బీసీసీఐకి చెందిన ముఖ్య అధికారులు కూడా పాల్గొన్నారు. భారత్, అఫ్గానిస్థాన్ మధ్య కొనసాగుతున్న స్నేహపూర్వక క్రికెట్ సంబంధాలను జరుపుకోవడమే ఈ కార్యక్రమం ఉద్దేశంగా అఫ్గాన్ బోర్డు తెలిపింది.

‘కోహ్-ఏ-జఫర్’

అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు ఈ కార్యక్రమానికి ‘కోహ్-ఏ-జఫర్’ అనే పేరు పెట్టింది. దీని అర్థం ‘విజయ శిఖరం’. ఈ సందర్భంగా ఇరు దేశాల ఆటగాళ్లు, క్రికెట్ అధికారులు కలిసి తమ అనుభవాలను పంచుకున్నారు. టీ20 సిరీస్ ట్రోఫీతో కలిసి ఆటగాళ్లు ఫొటోలు కూడా దిగారు.

వారికి సన్మానం

కోహ్-ఏ-జఫర్ కార్యక్రమంలో అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు భారత ఆటగాళ్లు, బీసీసీఐ అధికారులను ప్రత్యేకంగా సత్కరించింది. జ్ఞాపికలను అందజేసి భారత్, అఫ్గానిస్థాన్ క్రికెట్ బంధాన్ని గుర్తుచేసుకుంది. ఇరు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య చాలాకాలంగా కొనసాగుతున్న స్నేహాన్ని మరింత బలోపేతం చేసేలా ఈ కార్యక్రమం సాగింది.

ఆసక్తికర వ్యాఖ్యలు

ఈ కార్యక్రమంలో భారత్, అఫ్గానిస్థాన్ ఆటగాళ్లు తమ క్రికెట్ ప్రయాణానికి సంబంధించిన అనుభవాలను పంచుకున్నారు. భారత ఆటగాడు ఇషాన్ కిషన్ అఫ్గాన్ క్రికెటర్ల ప్రతిభను ప్రశంసించడంతో పాటు వారు మంచి వ్యక్తులని కొనియాడాడు. అఫ్గానిస్థాన్ స్టార్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ భారత్‌ను క్రికెట్ ఆడేందుకు అద్భుతమైన ప్రదేశంగా అభివర్ణించాడు. భారత్‌లో క్రికెట్ ఆడటం తనకు ఎప్పుడూ ఇష్టమని చెప్పాడు. ముఖ్యంగా ఐపీఎల్‌లో ఆడటం ద్వారా తన ఆట మరింత మెరుగుపడిందని నబీ పేర్కొన్నాడు.

సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యం

ఇక భారత్, అఫ్గానిస్థాన్ మధ్య జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా ఇప్పటికే 2-0 ఆధిక్యంతో విజయం సాధించింది. తొలి రెండు మ్యాచ్‌లను గెలిచిన భారత్.. ఇప్పుడు సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేయడంపై దృష్టి పెట్టింది. మూడో, చివరి టీ20 మ్యాచ్ కూడా ఢిల్లీలోనే జరగనుంది. ఫ్రెండ్‌షిప్ డిన్నర్‌తో ఇరు దేశాల ఆటగాళ్లు, అధికారులు తమ స్నేహాన్ని చాటుకున్నప్పటికీ.. మైదానంలో మాత్రం పోటీ తప్పదు. చివరి మ్యాచ్‌లోనూ విజయం సాధించి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని టీమిండియా భావిస్తోంది.