Chandrababu: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. రెండు రాష్ట్రాలు ఏర్పడి నేటికి 10 ఏళ్లు అయిందని.. రాష్ట్రాలు రెండైనా తెలుగు ప్రజలంతా ఒక్కటేనన్నారు. 10 కోట్ల తెలుగు జాతి మేటిగా వెలగాలన్నదే నా ఆకాంక్ష అని అన్నారు. నాటి ఆర్థిక సంస్కరణల తరువాత సంపద సృష్టికి బీజం పడిందని.. ప్రభుత్వ విధానాల ద్వారా సంక్షేమం, అభివృద్ధితో ప్రజల జీవితాల్లో మార్పులు మొదలయ్యాయన్నారు.
Read Also: YV Subbareddy: ఎగ్జిట్ పోల్తో సంబంధం లేదు.. ప్రజలపై నమ్మకం ఉంది..
నాలెడ్జ్ ఎకానమీతో అవకాశాలను అందిపుచ్చుకుని భారతీయులు, ముఖ్యంగా తెలుగు ప్రజలు అద్భుత ఫలితాలు సాధిస్తున్నారని చంద్రబాబు తెలిపారు. పేదరికం లేని సమాజం దిశగా రెండు రాష్ట్రాల ప్రయాణం సాగాలన్నారు. రానున్న రోజుల్లో ఆర్థిక అసమానతలను నిర్మూలించి.. సమగ్ర సాధికారత సాధించాలని కోరుకున్నారు. రెండు రాష్ట్రాలు ఏర్పడి 10 ఏళ్లు అవుతున్న నేటి ఈ సందర్భంగా తెలుగు ప్రజల విజయాలు, కీర్తి ప్రపంచ వ్యాప్తం కావాలన్నారు. భారతదేశం స్వాతంత్ర్యం సాధించి 100 ఏళ్లు పూర్తి అయ్యే 2047 నాటికి ప్రపంచంలో భారతీయులు అంతా అగ్రస్థానంలో ఉండాలన్నారు. అందులో తెలుగు జాతి నెంబర్ 1 అవ్వాలని ఆకాంక్షిస్తున్నానని చంద్రబాబు ట్వీట్ చేశారు.