NTV Telugu Site icon

TDP-BJP-Janasena Manifesto: నేడు టీడీపీ-బీజేపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో..

Manifesto

Manifesto

TDP-BJP-Janasena Manifesto: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టాలు ముగిసిపోతున్నాయి.. ఇప్పటికే బరిలో నిలిచేది ఎవరో క్లారిటీ వచ్చింది.. దీంతో.. అన్ని పార్టీలు ప్రచారంపై ఫోకస్‌ పెట్టాయి.. మరోవైపు, ఇప్పటికే అధికార వైసీపీ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఇక, ఈ రోజు టీడీపీ – బీజేపీ – జనసేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు చంద్రబాబు నివాసంలో మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ ముఖ్య నేతల సమక్షంలో మేనిఫెస్టో విడుదల కానుంది. 2023 రాజమండ్రి మహానాడులో టీడీపీ సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించింది. ఆ తరువాత కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలోకి మూడు పార్టీలు దిగాయి.

Read Also: T20 World Cup 24: నేడు బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ సమావేశం.. ఎవరా 15 మంది!

ఇక, మూడు పార్టీలకు ప్రజలు, వివిధ వర్గాల నుంచి వచ్చిన వినతులు, అగ్రనేతల ఆలోచనలు, వివిధ సందర్భాల్లో ఇచ్చిన హామీలతో మేనిఫెస్టో రూపకల్పన చేశారు. మేనిఫెస్టో అంశాలపై మూడు పార్టీల నేతలతో కూడిన మేనిఫెస్టో కమిటీ సుదీర్ఘ కసరత్తు చేసింది. రాష్ట్ర ప్రజల నేటి అవసరాలు తీరుస్తాం.. రేపటి ఆకాంక్షలను సాకారం చేస్తాం అనే థీమ్‌తో మేనిఫెస్టోను ఏర్పాటు చేశారు. అధిక పన్నులు, పన్నుల బాదుడు లేని సంక్షేమం – ప్రతి ప్రాంతంలో అభివృద్ధి అనే కాన్సెప్ట్‌తో మేనిఫెస్టోను తయారు చేశారు. అప్పులు, పన్నులతో ఇచ్చేది సంక్షేమం కాదని.. సంపద సృష్టితో సంక్షేమం ఇస్తామని కూటమి హామీలు ఇస్తోంది. వచ్చే 5 ఏళ్లలో చేసే డెవలప్మెంట్‌పై స్పష్టమైన రోడ్ మ్యాప్ తో మేనిఫెస్టో ఉంటుందంటోంది కూటమి. రాష్ట్ర సమగ్ర అభివృద్దితో పాటు, ప్రజల వ్యక్తిగత జీవితాల్లో మార్పు తెచ్చేలా ఒక్కో పథకం, కార్యక్రమం ఉంటుందని కూటమి అంటోంది. లబ్దిదారులు, రాష్ట్ర రాబడులు, నిధుల లభ్యత అంశాలపై లోతైన కసరత్తు తరువాతనే పథకాల డిజైన్ ఉంటుందని కూటమి నేతలు పేర్కొంటున్నారు. అయితే, కూటమి మేనిఫెస్టో ఎలా ఉంటుంది? ఏ అంశాలు చేరుస్తారు అనేది.. ఆసక్తికరంగా మారింది.