Tamil Nadu: ఎలక్షన్ కమిషన్ అఫ్ ఇండియా (ECI) ప్రత్యేక సవరణ కార్యక్రమం (Special Intensive Revision – SIR) పూర్తిచేసిన అనంతరం తమిళనాడు రాష్ట్ర సంబంధింత తుది ఓటర్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 74 లక్షలకు పైగా ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగించబడ్డాయి. ఈ వివరాలను తమిళనాడు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అర్చన పట్నాయక్ చెన్నైలో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు.
సవరణకు ముందు తమిళనాడులో మొత్తం 6.41 కోట్ల మంది నమోదిత ఓటర్లు ఉన్నారు. ఇక తాజాగా SIR సవరణ అనంతరం ఈ సంఖ్య 5.67 కోట్లకు తగ్గింది. తుది గణాంకాల ప్రకారం రాష్ట్రంలో ప్రస్తుతం 2.77 కోట్ల మంది పురుష ఓటర్లు, 2.89 కోట్ల మంది మహిళా ఓటర్లు, 7,617 మంది తృతీయ లింగ ఓటర్లు ఉన్నారని అధికారులు తెలిపారు. క్లెయిమ్స్, అభ్యంతరాల కాలంలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, రికార్డులను ధృవీకరించిన తర్వాతే ఈ మార్పులు చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.
WhatsAppలో కొత్త ఫీచర్.. గ్రూప్లో చేరిన వెంటనే “గ్రూప్ మెసేజ్ హిస్టరీ”!
2025 డిసెంబర్ 19 నుంచి 2026 జనవరి 30 వరకు నిర్వహించిన సమీక్షా కాలంలో 4.38 లక్షలకు పైగా పేర్ల తొలగింపు కోసం దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 4.23 లక్షలకు పైగా పేర్లు ధృవీకరణ అనంతరం తుది జాబితా నుంచి తొలగించబడ్డాయి. సుప్రీమ్ కోర్ట్ ఆదేశాల మేరకు “లాజికల్ డిస్క్రిపెన్సీలు” కింద గుర్తించిన పేర్ల జాబితాను గ్రామ పంచాయతీ కార్యాలయాలు, వార్డు కార్యాలయాలు తదితర ప్రజా ప్రదేశాల్లో ప్రదర్శించాలని ఎన్నికల సంఘం ముందుగా ఆదేశించింది. ప్రజలు తమ పేర్లు తనిఖీ చేసి అవసరమైతే అభ్యంతరాలు వ్యక్తం చేసేందుకు ఈ చర్యలు తీసుకున్నారు. ఈ వేసవిలో అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. తమిళనాడుతో పాటు కేరళ, వెస్ట్ బెంగాల్, పుదుచ్చేరి, అస్సాం రాష్ట్రాలలో కూడా ఎన్నికలు జరగనున్నాయి.