ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం అంతర్జాతీయంగా ఇంధన సరఫరాపై ప్రభావం చూపుతోంది. ఈ పరిణామాల వల్ల గల్ఫ్ దేశాల నుంచి రావాల్సిన వంట గ్యాస్ (LPG) సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీనివల్ల తమిళనాడులో గ్యాస్ కొరత తీవ్రమై, హోటళ్లు, చిన్న వ్యాపారాల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఈ పరిస్థితుల్లో చిన్న వ్యాపారులను ఆదుకోవడానికి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడటానికి ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. గ్యాస్ సిలిండర్ల కొరత తీరే వరకు, విద్యుత్ స్టవ్లను ఉపయోగిస్తున్న హోటళ్లు, రెస్టారెంట్లు, టీ షాపులకు విద్యుత్ యూనిట్కు రూ. 2 చొప్పున ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వనుంది. గ్యాస్ నుంచి ఎలక్ట్రిక్ స్టవ్లకు మారాలనుకునే చిన్న తరహా పరిశ్రమలు (MSME), చిన్న వ్యాపారులకు ప్రభుత్వం రుణ సౌకర్యం కల్పిస్తోంది. అంతేకాదు.. ఈ రుణాలపై 25 శాతం రాయితీని కూడా ప్రకటించింది.
Also Read:SSY Account: ‘సుకన్య సమృద్ధి యోజన’ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. మార్చి 31 చివరి తేదీ..
మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించే ఉద్దేశంతో.. వారు తీసుకునే రూ. 10 లక్షల లోపు రుణాలపై రూ. 2 లక్షల వరకు సబ్సిడీని ప్రభుత్వం అందిస్తుంది. ప్రస్తుత గ్యాస్ కొరత దృష్ట్యా, కేంద్ర ప్రభుత్వం ఆసుపత్రులు , విద్యా సంస్థలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ సరఫరా చేస్తోంది. ఫలితంగా వాణిజ్య అవసరాలకు గ్యాస్ సిలిండర్లు దొరకడం కష్టంగా మారింది. హోటళ్లు మూతపడితే.. వాటిపై ఆధారపడిన రైతులు, కూరగాయల సరఫరాదారులు నష్టపోయే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని నివారించడానికి.. హోటళ్లు నిరంతరాయంగా నడవాలని ప్రభుత్వం ఈ ప్రోత్సాహకాలను తీసుకువచ్చింది. హోటళ్లు మూతపడకుండా ఉండేలా చూడటంతో పాటు.. రైతులు తమ పంటలను ఎలాంటి ఆంక్షలు లేకుండా నేరుగా రైతు బజార్లలో అమ్ముకోవడానికి అనుమతినిచ్చారు. సామాన్యుల అవసరాలను తీర్చడానికి రేషన్ కార్డుదారులకు ఈ నెలలో అదనంగా కిరోసిన్ను సరఫరా చేయనున్నారు. గ్యాస్ సరఫరాలో అక్రమాలను అరికట్టడానికి, పంపిణీని సజావుగా నిర్వహించడానికి జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో ప్రత్యేక కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
