Supreme Court: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పు వెలువరించనుంది.. ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీం కోర్టు ఈ రోజు తీర్పు వెల్లడించనుంది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఎఫ్ఐఆర్ రద్దు చేయాలంటూ చంద్రబాబు.. సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే.. చంద్రబాబు 17ఏపై దాఖలు చేసిన పిటిషన్పై నేడు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. ఈ తీర్పును జస్టిస్ అనిరుద్ద్ బోస్, జస్టిస్ బేలా త్రివేదీల ధర్మాసనం ఇవ్వనుంది. అక్టోబర్ 20న తుది విచారణ జరిపి తీర్పును జనవరి 16కు వాయిదా వేసింది సుప్రీం ధర్మాసనం.
కాగా, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో ఏపీ సీఐడీ చంద్రబాబును అరెస్ట్ చేసింది.. ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా 52 రోజుల పాటు ఉన్నారు. అనంతరం చంద్రబాబుపై సీఐడీ పలు కేసులు నమోదు చేసింది. అయితే తన కేసుల విషయంలో కనీస నిబంధనలు పాటించలేదని చెబుతూ చంద్రబాబు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రత్యేక లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. కేసులన్నింటినీ క్వాష్ చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై ఇరు వర్గాల వాదనలను అత్యున్నత న్యాయస్థానం వినింది. ఇంతలో చంద్రబాబుకు బెయిల్ లభించింది. క్వాష్ పిటిషన్పై విచారణ పూర్తయినా.. ఇంతవరకు తీర్పు వెల్లడించలేదు. దీంతో.. నేడు సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉంటుందనే ఉత్కంఠ నెలకొంది.
Read Also: Guntur Kaaram : ‘గుంటూరు కారం’ సక్సెస్ సెలబ్రేషన్స్.. గురూజీ మిస్ అయ్యాడే?
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఎఫ్ఐఆర్ రద్దు చేయాలంటూ సుప్రీంలో చంద్రబాబు పిటిషన్ వేశారు. 17ఏ ప్రకారం గవర్నర్ ముందస్తు అనుమతి లేకుండా కేసు నమోదు చేయడం కుదరదని పిటిషన్లో చంద్రబాబు పేర్కొన్నారు. ఈ నెల 16వ తేదీన ఉదయం 10.30 గంటలకు సుప్రీం ధర్మాసనం తీర్పును ఇవ్వనుంది. దీంతో ఎన్నికల ముంగిట ఎటువంటి తీర్పు వస్తుందోనని దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. గవర్నర్ అనుమతి తీసుకోకుండానే తనను అరెస్టు చేశారని.. రాజకీయ కక్షతోనే ఈ విధంగా వ్యవహరించారని చంద్రబాబు పిటిషన్ దాఖలు చేసుకున్నారు. దీంతో జాతీయస్థాయిలో రాజకీయ కక్ష బాధితులు, అటు ప్రభుత్వాధినేతలు ఈ కేసు తీర్పు కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. కాగా, స్కిల్ కేసులో మొదట మధ్యంతర బెయిల్ పొందిన చంద్రబాబు.. ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ పొందిన విషయం విదితమే.. ఆ తర్వాత చంద్రబాబుపై నమోదైన ఐఆర్ఆర్, లిక్కర్, ఇసుక కేసుల్లోనూ ముందస్తు బెయిల్ పొందిన విషయం తెలిసిందే.