ఇండియన్ కోస్ట్ గార్డ్లో (Indian Coast Guard) శాశ్వత కమిషన్పై సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. అర్హులైన మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేయకుంటే న్యాయస్థానమే అందులో జోక్యం చేసుకుంటుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
భారత తీరగస్తీ దళంలో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వ అలసత్వంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛందంగా చర్యలు తీసుకోకుంటే తామే ఒక అడుగు ముందుకువేయాల్సి వస్తుందని హెచ్చరించింది.
అర్హులైన మహిళా అధికారులతో శాశ్వత కమిషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఇండియన్ కోస్ట్ గార్డుకు చెందిన ఓ అధికారిణి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని న్యాయస్థానం విచారించింది. కేంద్రం తరఫున అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి వాదనలు వినిపించారు.
ఆర్మీ, నేవీతో పోలిస్తే కోస్ట్ గార్డులో పనితీరు కొంచెం భిన్నంగా ఉంటుందని ధర్మాసనం దృష్టికి అటార్నీ జనరల్ తీసుకెళ్లారు. మహిళలను మినహాయించేందుకు అవి కారణాలు కాదని పేర్కొంటూ ఏజీ వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది. మహిళలను వేరుగా చూడలేమని.. ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే తామే జోక్యం చేసుకుంటామని స్పష్టంచేసింది. అందుకే.. ఈ అంశాన్ని పరిశీలించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వ స్పందనను అఫిడవిట్ రూపంలో దాఖలు చేయాలని పేర్కొంటూ తదుపరి విచారణ వచ్చే శుక్రవారానికి (మార్చి 1) వాయిదా వేసింది.
ఇదిలా ఉంటే వారం క్రితం ఇదే పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం.. మహిళలను సముచితంగా పరిగణించే విధానాన్ని రూపొందించాల్సిందేనని కేంద్రానికి స్పష్టంచేసింది. త్రివిధ దళాల్లో మహిళలకు శాశ్వత కమిషన్ల ఏర్పాటుపై సుప్రీం తీర్పులిచ్చినా ఇంకా పూర్వకాల ఆలోచనలతోనే ఉన్నారా? అని నిలదీసింది. నౌకాదళంలో శాశ్వత కమిషన్ ఉన్నప్పుడు కోస్ట్గార్డ్ అలా ఎందుకు చేయడం లేదని ప్రశ్నించింది. స్త్రీ పురుష సమానత్వం ఉన్న విధానాన్ని రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ప్రభుత్వం స్వచ్ఛందంగా అవసరమైన చర్యలు తీసుకోకపోతే.. పేర్కొన్న రక్షణ సేవలో లింగ సమానత్వం ఉండేలా కోర్టు జోక్యం చేసుకుంటుందని చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ హెచ్చరించారు.