Supreme Court: సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. కశ్మీర్ వేర్పాటు వాది షబీర్ అహ్మద్ షాకు దేశ అత్యున్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. దాదాపు ఆరేళ్లు జైలు జీవితం గడిపి షాకు ఊరట లభించినట్లయింది. షబీర్ అహ్మద్ షాపై 2017 కేసు నమోదైంది. కానీ.. జాతీయ దర్యాప్తు సంస్థ 2019లో అరెస్టు చేసింది. కశ్మీర్ ప్రాంతంలో వేర్పాటు కార్యకలాపాలకు నిధులు సమకూర్చినట్లు అతడిపై ఆరోపణలు ఉన్నాయి. బెయిల్ మంజూరుకు ముందు.. న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సందీప్ మెహతా ఉన్న ద్విసభ్య ధర్మాసనం సుదీర్ఘ వాదనలు విన్నది. షా తరఫున వాదించిన న్యాయవాది ఆయనపై మొదట దర్యాప్తు సంస్థ దాఖలు చేసిన ప్రధాన అభియోగ పత్రంలో పేరు లేదని కోర్టుకు తెలిపారు. తరువాత అదనపు అభియోగ పత్రంలో మాత్రమే నిందితుడిగా చేర్చినట్లు వెల్లడించారు. ఇప్పటికే ఆరు సంవత్సరాలకుపైగా జైలులో ఉన్నారని, కేసులో నాలుగు వందలకుపైగా సాక్షులను విచారించాల్సి ఉన్నందున విచారణ త్వరగా పూర్తయ్యే అవకాశం లేదని కోర్టుకు తెలిపారు. మరోవైపు.. దర్యాప్తు సంస్థ తరఫు లాయర్ ఈ కేసులో షబీర్ అహ్మద్ షా కీలకమని వెల్లడించారు. వాదనలు విన్న కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
READ MORE: US aircraft crash: ఇరాన్తో ఉద్రిక్తతల మధ్య భారీ ప్రమాదం.. ఇరాక్లో కూలిన అమెరికా సైనిక విమానం.!
ఇంతకు ముందు ఈ కేసు ఢిల్లీ హైకోర్టులో వాదనలకు వచ్చింది. నిందితుడికి బెయిల్ మంజూరు చేయాలని నిందితుడి తరఫు లాయర్ ఢిల్లీ హైకోర్టు ఆశ్రయించారు. అక్కడ బెయిల్ ఇవ్వడం కుదరదని కోర్టు తేల్చి చెప్పింది. నిందితుడిపై వచ్చిన ఆరోపణలు వాస్తవాలనే అనుమానం వస్తుందని కోర్టు తెలిపింది. అంతేకాదు.. ఇదే తరహా కేసుల్లో షబీర్ అహ్మద్ షాపై ఇరవై నాలుగు ఫిర్యాదులు వచ్చినట్లు కోర్టు వివరించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించింది. దీంతో నిందితుడు ఈ సారి దేశ అత్యున్నత న్యాయస్థానానికి చేరుకున్నాడు. ఇరువురి తరఫున వాదనలు విన్న సుప్రీంకోర్టు చివరకు బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
