ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్కు సంబంధించిన వార్తలు ఎప్పటికప్పుడు పుట్టుకొస్తూనే ఉంటాయి. ధోనీ ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా ఆ వార్తలకు మాత్రం ఫుల్స్టాప్ ఉండదు. అంతర్జాతీయ క్రికెట్కు చాలా సులభంగానే వీడ్కోలు పలికేసిన ధోనీ ఐపీఎల్ కు మాత్రం అంత త్వరగా దూరం కాలేకపోతున్నాడు. వయసు 43 దాటేసినా, ఆరోగ్యం సహకరించకపోయినా ఐపీఎల్ ఆడేందుకే మొగ్గు చూపుతున్నాడు. ధోనీకిదే చివరి సీజన్ అనే వ్యాఖ్యలు వినిపిస్తున్న వేళ.. క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ మాత్రం విభిన్నంగా స్పందించాడు. ధోనీ తీసుకొనే నిర్ణయం ఎప్పుడూ సరిగ్గానే ఉంటుందని అభిప్రాయపడ్డాడు.
ఏ ప్లేయర్ అయినా సరే తన కంటే తాను ప్రాతినిధ్యం వహించే జట్టు ప్రయోజనం కోసం నిర్ణయాలు తీసుకుంటాడని సునీల్ గావస్కర్ అన్నాడు. ఈ సీజన్ తర్వాత ధోనీ ఆడాలా? లేదా? అనేది ఆయనే నిర్ణయించుకుంటాడన్నారు. సీఎస్కేకు ఏది మంచిదైతే ధోనీ అదే చేస్తాడని.. భవిష్యత్తులోనూ ఏదైనా డెసిషన్ తీసుకుంటే సీఎస్కే మంచిదా? కాదా? అనే ఆలోచిస్తాడని సునీల్ చెప్పాడు. సీఎస్కే గురించి ముందుగా ఆలోచించిన తర్వాతే తనకు మంచిదా? కాదా? అనేది ఆలోచిస్తాడని తెలిపాడు.
READ MORE: Karumuri Nageswara Rao: ప్రధాని మోడీ ఏదో ఇస్తారని ఆశించాం.. కానీ, పవన్కి చాక్లెట్ ఇచ్చారు..!
‘‘ఈ సీజన్లో సీఎస్కే ఆటతీరులో పెద్దగా దూకుడుగా లేదు. ఆ జట్టు బౌలింగ్ ఇబ్బందికరంగా ఉంది. వచ్చే సీజన్లో బలంగా దూసుకురావాలంటే బౌలింగ్పై దృష్టిపెట్టాలి. ఆక్షన్ స్ట్రాటజీలో ఈసారి కాస్త వెనుకబడినట్లు అనిపిస్తోంది. టాలెంట్ను గుర్తించే క్రమంలో ఇతర జట్ల కంటే సీఎస్కే మెరుగు కావాల్సి ఉంది. కేవలం బ్యాటర్లపైనే ఆశలు పెట్టుకోకూడదు. బౌలింగ్ చాలా కీలకం.’’ అని సునీల్ గావస్కర్ పేర్కొన్నాడు. కాగా.. ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటతీరు సరిగ్గా లేదు. ఇప్పటికే ప్లేఆఫ్స్ నుంచి ఎలిమినేట్ అయిన సీఎస్కే ఇవాళ చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడేందుకు సిద్ధమవుతోంది.